Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జట్టు ఎంపికపై పలు ప్రశ్నలు సంధించనున్న రాయ్
ముంబయి : 2019 ప్రపంచకప్లో భారత్ కథ ముగిసింది. టైటిల్ ఫేవరెట్గా బరిలో నిలిచి, గ్రూప్ దశలో నాల్గో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. కోహ్లిసేనతో పోల్చితే ఎన్నో రెట్లు వెనుకంజలో ఉన్న న్యూజిలాండ్ చేతిలో ఓడటం పట్ల బీసీసీఐ సంతృప్తిగా లేనట్టు సమాచారం. ప్రపంచకప్ ప్రదర్శనపై పాలకుల కమిటీ (సీఓఏ) త్వరలోనే సమీక్ష నిర్వహించనుంది. కెప్టెన్ విరాట్ కోహ్లి, చీఫ్ కోచ్ రవిశాస్త్రిలపై సీఓఏ పలు ప్రశ్నలు సంధించే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో 2020లో ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచకప్ దృష్ట్యా రోడ్మ్యాప్ విషయమై సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ నుంచి సీఓఏ ప్రజెంటేషన్ కోరనుంది. ' కోచ్, కెప్టెన్ స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత సమీక్ష సమావేశం ఉంటుంది. కచ్చితంగా ఓ తేది, సమయం చెప్పలేను. కానీ పాలకుల కమిటీ వారితో మాట్లాడుతుంది. ఇదే సమయంలో భవిష్యత్ ప్రణాళికపై సెలక్షన్ కమిటీతో మాట్లాడుతాం' అని పాలకుల కమిటీ చైర్మన్ వినోద్ రారు పేర్కొన్నారు. ఇంగ్లాండ్ నుంచి భారత జట్టు ఆదివారం ముంబయికి చేరుకోనుంది. స్వదేశం చేరుకున్న తర్వాత కోచ్, కెప్టెన్లు విరామం తీసుకోనున్నారు. ఆ తర్వాత సమీక్ష సమావేశం ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. సమీక్ష సమావేశంలో ప్రధానంగా అంబటి రాయుడి అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. నం.4 స్థానానికి అతడు తగిన వాడు కాదని తెలిసిప్పుడు, ప్రపంచకప్కు ముందు చివరి సిరీస్ వరకూ అతడిని జట్టులో ఎందుకు కొనసాగించారు? ఇద్దరు ఆటగాళ్లు గాయాలతో ప్రపంచకప్కు దూరమైనా.. రిజర్వ్ ఆటగాడు రాయుడుని ఎందుకు ఎంపిక చేయలేదు? అని సెలక్షన్ కమిటీని ప్రశ్నించనుంది. ఇదే సమయంలో జట్టులో ధోని, పంత్, కార్తీక్ రూపంలో ముగ్గురు వికెట్ కీపర్లను కొన్ని మ్యాచుల్లో ఎందుకు ఆడించాల్సి వచ్చింది? సెమీఫైనల్లో ఎం.ఎస్ ధోని బ్యాటింగ్ స్థానాన్ని నం.7కు మార్చాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? అని కెప్టెన్ కోహ్లి, కోచ్ శాస్త్రిని ప్రశ్నించనుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.