Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్స్ ఫలితాన్ని శాసించిన ఆరు పరుగుల నిర్ణయం
- నిబంధనల ప్రకారం ఐదు పరుగులే ఇవ్వాలి
- ఎంసీసీ రూల్స్ కమిటీ సభ్యుడు సైమన్ టఫెల్ విమర్శ
నవతెలంగాణ-లార్డ్స్
ఆద్యంతం ఉత్కంఠ. బంతి బంతికీ నరాలు తెగే ఉత్కంఠ. క్షణక్షణం చరిత్రను తిరగరాసే సన్నివేశం. నమ్మశక్యం కాని ఫలితం. అంతిమంగా క్రికెట్ చరిత్రలో అద్భుతమైన పోరాటం. 2019 ప్రపంచకప్ ఫైనల్స్ ఊపేసింది. 50 ఓవర్లలో టై, సూపర్ ఓవర్లో టైతో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ పోరాటపటమి లార్డ్స్ ఫైనల్స్ను చారిత్రక ఇతిహాసం చేశాయి. ఇది టైటిల్ పోరులో ఒక వైపు కథ.
మరోవైపు చారిత్రక తప్పిదాలు, తర్కం లేని నిబంధనలు 2019 ప్రపంచకప్ ఫైనల్స్ను అత్యంత వివాదస్పదం చేశాయి. బౌండరీల కొలమానంలో విజేతను నిర్ణయించటం హాస్యాస్పద నిబంధన అని మాజీలు తిట్టిపోస్తుండగా.. తీవ్రమైన అంపైరింగ్ తప్పిదం ప్రపంచకప్ విజేతను తేల్చటంలో బహుముఖ పాత్ర వహించింది. అంపైరింగ్ తప్పిదంతో లార్డ్స్లో ప్రపంచకప్ను అందుకునే జట్టు మారిపోయిందా?!
ఆఖరు ఆరు బంతులు. క్రీజులో బెన్ స్టోక్స్. విజయానికి 15 పరుగులు అవసరం. ట్రెంట్ బౌల్ట్ తొలి రెండు బంతులకు పరుగులు ఇవ్వలేదు. ఒత్తిడి స్టోక్స్పై ప్రస్ఫుటంచింది. మూడో బంతిని స్టోక్స్ మిడ్వికెట్ మీదుగా సిక్సర్గా మలిచాడు. సమీకరణం మూడు బంతుల్లో 9 పరుగులకు చేరింది. నాల్గో బంతిని డీప్ మిడ్వికెట్లో ఆడిన స్టోక్స్ రెండో పరుగు కోసం క్రీజులోకి డైవ్ కొట్టాడు. డైరెక్ట్ త్రోకు ప్రయత్నించిన మార్టిన్ గప్టిల్ బంతిని వికెట్ల మీదకు విసిరాడు. డైవ్ చేస్తున్న స్టోక్స్ బ్యాట్కు తగిలిన బంతి థర్డ్మ్యాన్ దిశగా బౌండరీకి తరలింది. రెండు పరుగులకు తోడు నాలుగు పరుగులు వచ్చాయి. ఇంగ్లాండ్ ఖాతాలో ఆరు పరుగులు జమయ్యాయి. దీంతో సమీకరణం రెండు బంతుల్లో మూడు పరుగులకు చేరింది. తర్వాతి రెండు బంతులకు స్టోక్స్ డబుల్ రన్ కోసం ప్రయత్నించినా.. రషీద్, ఫ్లంకెట్ రనౌట్తో ఒక్క పరుగే సాధ్యపడింది. ఛేదనలో ఇంగ్లాండ్ 241 పరుగులు చేసి, న్యూజిలాండ్ 241తో టై చేసుకుంది. తర్వాత సూపర్ ఓవర్లోనూ 15 పరుగులు చేయటం.. మళ్లీ టై కావటం, బౌండరీల తేడాతో ఇంగ్లాండ్ను విజేతగా ప్రకటించటం అందరికీ తెలిసిందే. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఆఖరి ఓవర్ నాల్గో బంతికి ఇంగ్లాండ్కు ఆరు పరుగులు సాధించింది. ఈ ఆరు పరుగులపై ఇప్పుడు వివాదం నడుస్తోంది. ఎంసీసీ నిబంధనల సబ్ కమిటీ సభ్యుడు, అంపైర్ సైమన్ టఫెల్ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. ' అది పూర్తిగా తప్పుడు నిర్ణయం. తీర్పులో దొర్లిన పొరపాటు. ఇంగ్లాండ్కు ఐదు పరుగులే ఇవ్వాలి. ఆరు పరుగులు కాదు' అని టఫెల్ పేర్కొన్నాడు.
నిబంధన ఏం చెబుతోంది? : ఐసీసీ నిబంధన 19.8 ప్రకారం ఇంగ్లాండ్కు ఆరు పరుగులు ఇవ్వటం చారిత్రక తప్పిదంగా తెలుస్తోంది. ' ఒకవేళ బౌండరీ ఓవర్త్రో రూపంలో కానీ, ఫీల్డర్ కావాలని విసిరినా గానీ.. పరుగులు ఇవ్వటంలో బ్యాట్స్మెన్ పూర్తి చేసిన పరుగులు, ఓవర్ త్రో విసిరిన సమయంలో బ్యాట్స్మెన్ ఎక్కడ ఉన్నారనేది గమనంలోకి వస్తుంది' అని నిబంధన చెబుతోంది. దీని ప్రకారం బెన్ స్టోక్స్, ఆదిల్ రషీద్ ఓ పరుగు పూర్తి చేశారు. మార్టిన్ గప్టిల్ త్రో విసిరే సమయానికి ఈ ఇద్దరూ పిచ్ సగం భాగం దాటలేదు. కాబట్టి ఓవర్ త్రో కారణంగా లభించిన పరుగులను అక్కడ్నుంచి పరిగణలోకి తీసుకోవాలి. రెండో పరుగును బౌండరీలో భాగంగానే చూడాలి. ప్రత్యేకమైన పరుగుగా పరిగణించరాదు. థర్డ్ అంపైర్, సహచర అంపైర్ ఎరాస్మస్తో సంప్రదించిన తర్వాత కుమార ధర్మసేన ఇంగ్లాండ్కు ఆరు పరుగులు ప్రకటించాడు. ఈ సమయంలో వారు స్టోక్స్, రషీద్ త్రో సమయంలో ఎక్కడున్నారనే విషయాన్ని గమనించలేదు. ఫోకస్ పూర్తిగా బంతి స్టోక్స్కు తగిలిందా? లేక వికెట్ కీపర్ తప్పిదంతో బౌండరీకి తరలిందా? అని స్టేడియంలో పెద్ద తెరపై చూడటానికే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఆ సమయంలో స్టోక్స్, రషీద్ పొజిషన్ను పట్టించుకోలేదు.
కివీస్కు మరో దెబ్బ! : అంపైరింగ్ తప్పిదంతో ఓ పరుగు అదనంగా కోల్పోవటమే కాదు, స్ట్రయిక్ ఎండ్లో బెన్ స్టోక్స్ను ఉంచటంతో న్యూజిలాండ్ మరింత అన్యాయం జరిగింది. అంపైర్లు ఇంగ్లాండ్కు ఐదు పరుగులే ఇచ్చిఉంటే, బెన్ స్టోక్స్ నాన్ స్ట్రయిక్ ఎండ్లో ఉండాల్సి ఉంటుంది. టెయిలెండర్ ఆదిల్ రషీద్ స్ట్రయిక్ బ్యాట్స్మన్ అవుతాడు. మరో రెండు బంతులే ఉన్న నేపథ్యంలో న్యూజిలాండ్కు ఇది గొప్ప అవకాశంగా ఉండేది. కానీ అదనపు పరుగు, ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ను నిబంధనల విరుద్ధంగా స్ట్రయిక్లో ఉంచటం న్యూజిలాండ్కు చేటు చేసింది. ప్రపంచకప్ కోసం చివరి బంతి వరకూ ఇంగ్లాండ్తో సమవుజ్జీగా పోరాడినా.. ఆఖరి అర గంట ఆట న్యూజిలాండ్కు వ్యతిరేకంగా సాగింది. భారీ తేడాతో విజయాలు సాధించిన వేళ.. ఇటువంటి చిన్న పొరపాట్లను ఎవ్వరూ పట్టించుకోరు. కానీ రెండు సార్లు టైగా ముగిసిన మ్యాచ్లో, అందునా ప్రపంచకప్ విజేతను తేల్చాల్సిన సమరంలో ఇటువంటి తప్పిదాలు ఆటకు మేలు చేయవు.
నాకౌట్ మ్యాచుల్లో, తర్వాతి దశకు ఏదో జట్టు చేరాల్సిన స్థితిలో నిబంధనలు ఫర్వాలేదు. కానీ విశ్వవిజేతను నిర్ణయించే ప్రపంచకప్ ఫైనల్లో అర్థరహిత నిబంధనలు హాస్యాస్పదమని మాజీ క్రికెటర్లు మండి పడుతున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రపంచకప్ ఫైనల్ టైగా ముగిస్తే, సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఒక వేళ సూపర్ ఓవర్లోనూ టై వస్తే.. బౌండరీల తేడాతో విజేతను ప్రకటిస్తారు. ఈ లెక్కన న్యూజిలాండ్ కంటే ఎక్కువ బౌండరీలు (50 ఓవర్ల ఆట, సూపర్ ఓవర్) బాదిన ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. ప్రపంచకప్ విజేతను ఈ పద్దతిన తేల్చటంపై క్రికెటర్లు, అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సూపర్ ఓవర్లోనూ టై లభిస్తే, మరో సూపర్ ఓడించటం చేయవచ్చు కదా అని ఐసీసీ ప్రశ్నిస్తున్నారు. బౌండరీల కొలమానం చూసే బదులు.. వికెట్ల తేడాను పట్టించుకోరని అడుగుతున్నారు. పరుగులతో పాటు వికెట్లు విలువైనవే, అటువంటప్పుడు ఎక్కువ వికెట్లు కూల్చిన జట్టును విజేతగా ప్రకటిస్తే అది సమంజసంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్లోనైనా నిబంధనలు మార్చాలని ఐసీసీకి ట్వీట్లు పెడుతున్నారు.
' బౌండరీల తేడాతో ప్రపంచకప్ విజేతను నిర్ణయించే నిబంధనతో అంగీకరిం చను. కానీ రూల్స్ అన్నాక రూల్సే. అంతిమంగా వరల్డ్కప్ అందుకున్న ఇంగ్లాండ్కు అభినందనలు. ఆఖరు వరకూ పోరాడిన న్యూజిలాండ్ మనసు గెల్చు కుంది. గొప్ప ఆట, అద్భుతమైన ఫైనల్'
- యువరాజ్ సింగ్
ఏం జరిగిందో తెలు సుకునేందుకు ప్రయ త్నించాను. సంబురాలు చేసుకోలేదు. ఆనందపడే సందర్భం కాదది. దానికి ఫలితం ఇరు జట్లలో ఎవరిపైనా పడవచ్చు. స్టోక్స్ డైవ్ చేశాడు, బంతి బౌండరికీ తరలింది. కివీస్ ఆట గాళ్లు షాకయ్యారు. కీపర్ కొట్టాడా? స్టోక్స్కు తగి లిందా? తెలుసుకునే ప్రయత్నం చేశాను'
-ఇయాన్ మోర్గాన్, ఇంగ్లాండ్ కెప్టెన్
ఓ విషయాన్ని చూపించి, అది మ్యాచ్ను నిర్ణయిం చిందని చెప్ప లేం. ఆటలో కీలక పాత్ర పోషించిన చిన్న చిన్న విషయాలు ఎన్నో ఉన్నాయి. మ్యాచ్ టైగా ముగిసినప్పుడు.. ప్రతి సింగిల్ బాల్పై దృష్టి పెడతాం. బౌల్ట్ బంతితో గొప్పగా కనిపిస్తున్నప్పుడు, దీన్ని జీర్ణించుకోవటం అంత సులువు కాదు'
- కేన్ విలియమ్సన్, న్యూజిలాండ్ కెప్టెన్
2019 ప్రపంచకప్ ఫైనల్లో నిబంధనలను ఎలా పాటించారో అర్థం చేసుకోలేకపోతున్నాను. అంతిమంగా బౌండరీల ప్రకారం విజేతను తేల్చా రు. ఐసీసీ పెట్టిన హాస్యా స్పద నిబంధన ఇది. దీన్ని టైగా చూడాల్సింది. ఇద్ద రినీ విజేతలుగా నిల పాల్సింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ రెండు జట్లకూ అభినందనలు'
- గౌతం గంభీర్
క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ సమరాల్లో ఒకటి.ట్రోఫీని పంచు కోవటానికి న్యూజిలాండ్కు అర్హత ఉంది. విజేత ఇంగ్లాండ్కు అభినందనలు. ఆఖరి వరకూ పోరాడి అద్భుత మ్యాచ్ అందించినందుకు న్యూ జిలాండ్కు అభినందనలు'
-ఎంజెలో మాథ్యూస్