Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బౌలింగ్, బ్యాటింగ్కు అవకాశం
- యాషెస్ నుంచే అమలు
లండన్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకోనుంది. రెండేండ్లుగా పెండింగ్లో ఉన్న కాంకషన్ సబ్స్టిట్యూట్కు గ్రీన్ సిగల్ ఇవ్వనుంది. 2014లో ఫిలిప్ హ్యూస్ మరణాంతరం ఐసీసీ ముందుకు క్రికెట్ ఆస్ట్రేలియా(సిఏ) ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఇప్పటికే దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో 2017 నుంచే సబ్స్టిట్యూట్ ఆటగాళ్లు బౌలింగ్, బ్యాటింగ్ చేసేందుకు ప్రయోగాత్మక పద్ధతిలో ఐసీసీ అనుమతి ఇచ్చింది. అయితే ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 'టెస్టు చాంపియన్ షిప్'లో ఈ విధానానికి అనుమతినివ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా యాషెస్ సిరీస్లో కాంకషన్ సబ్స్టిట్యూట్ను అమలు చేయనుంది. దీనికోసం రూపొందించాల్సిన నియమ నిబంధనలను జులై చివరి వారంలో జరగనున్న వార్షిక సమావేశంలో చర్చించనుంది.
కాంకషన్ సబ్స్టిట్యూట్ అంటే?
మైదానంలో ఏ ఆటగాడి తలకైనా బంతి బలంగా తగిలితే కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాదు. అతడి పరిస్థితి ఏంటో తెలీదు. దీనినే కాంకషన్ అంటారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం సబ్స్టిట్యూట్ ఆటగాడికి కేవలం ఫీల్డింగ్ చేసేందుకు అనుమతి ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు అవకాశం లేదు. అయితే కాంకషన్ సబ్స్టిట్యూట్ ప్రకారం మరొక ఆటగాడిని జట్టులోకి అనుమతినిస్తారు. దీంతో ఆ ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశాలు ఉంటాయి.
వివాదాస్పద రన్స్పై ఐసీసీ వివరణ
ప్రపంచకప్ ఫైనల్లో బెన్స్టోక్స్ బ్యాటుకు బంతి తాకడం వల్ల వచ్చిన అదనపు పరుగుల విషయంపై ఐసీసీ వివరణ ఇచ్చింది. ఇది విధానాలకు సంబంధించిన అంశం కాబట్టి అంపైర్ల నిర్ణయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని బుధవారం వెల్లడించింది. నిబంధనల ప్రకారం ఆ ఓవర్ త్రో విషయంలో ఐదు పరుగులు మాత్రమే ఇవ్వాలి. అంతర్జాతీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న మాజీ, ప్రస్తుత అంపైర్లు చెబుతున్న మాట ఇది. కానీ ఫైనల్ మ్యాచ్లో అంపైర్లుగా ఉన్న ఎరాస్మస్, ధర్మసేన ఆరు పరుగులు ఇచ్చారు. అంపైర్ల నిర్ణయ లోపాలు, పొరపాట్లపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై ఎట్టకేలకు ఐసిసి దీనిపై మూస ధోరణిలో స్పందించింది. 'నిబంధనలపై తమకున్న అవగాహన మేరకు మైదానంలో అంపైర్లు నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విధానపరమైన అంశం కాబట్టి వారి నిర్ణయాలపై మేం ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు' అని ఐసిసి అధికార ప్రతినిధి వెల్లడించారు. ఐదుసార్లు ఐసిసి ఉత్తమ అంపైర్ అవార్డు గ్రహీత మాజీ అంపైర్ సిమోన్ టఫెల్(ఆస్ట్రేలియా) సైతం ఫీల్డ్ అంపైర్ల తప్పిదంతోనే ఇంగ్లండ్ జట్టుకు 6 పరుగులు వచ్చాయని, నిజానికి 5 పరుగులు మాత్రమే అంపైర్లు ప్రకటించాల్సిందని టఫెల్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.