Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యతిరేకించిన ముంబయి, చెన్నై!
ముంబయి : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బలంగా లేదు. సొంత వ్యవహారాలనే చక్కబెట్టుకోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)ను నడిపించే బీసీసీఐకి ఐపీఎల్ పాంఛైజీల సంఘంతో ఢకొీట్టాలనే ఆలోచనకు ఆదిలోనే చెక్ పడిందని సమాచారం. ప్రపంచకప్ మ్యాచుల కోసం ఇంగ్లాండ్ వెళ్లిన ఐపీఎల్ ప్రాంఛైజీల యజమానులు లండన్లో సమావేశమయ్యారు. ఐపీఎల్ ఆరంభం నుంచీ కొనసాగుతున్న ప్రాంఛైజీ యజమాని ఒకరు ' ఐపీఎల్ సంఘం' ప్రతిపాదనను ముందుంచారు. ఇక నుంచి బోర్డు ఆదేశాలు, మార్గదర్శకాల కోసం ఎదురు చూడకుండా.. ప్రాంఛైజీలకు ఏం కావాలి, ఎలా ఉండాలనే విషయాలనే సంఘం ద్వారా బీసీసీఐ ముందుంచాలనేది ఆలోచన. ఐపీఎల్ ప్రాంఛైజీల కాంట్రాక్టు ప్రకారం ఇటువంటి సంఘం అనైతికం. అలా చేస్తే, బోర్డు నుంచి సస్పెన్షన్ ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదు. ఈ ఆలోచనకు కొంత మంది మద్దతు తెలుపగా, మరికొందరు అభిప్రాయం చెప్పలేదు. కానీ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ యజమానులు ఈ ఆలోచనకు అక్కడికక్కడే వ్యతిరేకత తెలిపినట్టు సమాచారం. బలమైన రెండు ప్రాంఛైజీలు వ్యతిరేకత వ్యక్తం చేయటంతో, సంఘం ఆలోచనను విరమించుకున్నట్టు తెలిసింది.
100 బంతుల టోర్నీపై ఈసిబితో.. : ఇదిలా ఉండగా ఆ సమావేశానికి ఐపీఎల్ ప్రాంఛైజీల యజమానులు ఈసీబీ (ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు) సీఈవో టామ్ హారిసన్ను ఆహ్వానించినట్టు తెలిసింది. ఇంగ్లాండ్ ప్రవేశపెట్టిన 100 బంతుల లీగ్ మ్యాచ్పై ఈ సమావేశంలో ప్రజంటేషనల్ ఇవ్వాల్సిందిగా ఈసిబి సీఈవోను కోరారు. ' ఐపీఎల్ తరహా లీగ్ను ఎలా నిర్వహించాలి అనే అంశంపై కౌంటీ క్లబ్లతో బీసీసీఐ సమావేశం నిర్వహిస్తే ఎలా ఉంటుంది?' అని బీసీసీఐ ఉన్నతాధికారి ఈసీబీతో వ్యాఖ్యానించగా... ఈ భేటికి హారిసన్ హాజరు కాలేదు. ప్రాంఛైజీల యజమానులు ఇలా ప్రయివేట్ సమావేశంలో సంఘం ఏర్పాటు, 100 బంతుల ఫార్మాట్పై సమీక్షలు చేయటంపై బోర్డు అవసరమైన సమయంలో స్పందిస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.