Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోహ్లి కెప్టెన్సీ, మహి వీడ్కోలుపై ఉత్కంఠ
- విండీస్ పర్యటనకు జట్ల ఎంపిక నేడు
- చూపులన్నీ ఎమ్మెస్కే బృందంపైనే
నవతెలంగాణ-ముంబయి
జులై 14న, ఐసీసీ 2019 ప్రపంచకప్ ముగిసింది. అంతకముందే మాంచెస్టర్లో టీమ్ ఇండియా వేటకు తెరపడింది. ప్రీ టోర్నమెంట్ టైటిల్ ఫేవరెట్లు ఇంగ్లాండ్ విజయ సంబురాల్లో మునిగిపోతుండగా.. భారత్ ఓటమి కారణాలను అన్వేషిస్తూ నైరాశ్యంలో కూరుకుంది. 2015 ప్రపంచకప్ గ్రూప్ దశ నుంచి నిష్క్రమించిన ఇంగ్లాండ్.. స్వదేశంలో జరుగబోయే 2019 ప్రపంచకప్ కోసం నాలుగేండ్ల ముందుగానే ప్రణాళిక వేసుకుంది. జులై 14 లక్ష్యంగా నాలుగేండ్ల ముందుగానే పక్కా వ్యూహంతో సిద్ధమైంది. 2023లో ప్రపంచకప్కు ఆతిథ్యం ఇవ్వబోతున్న భారత్, అదే రీతిలో సన్నద్ధం కావాలని క్రికెట్ నిపుణులు కోరుతున్నారు. భారత క్రికెట్ వర్గాలు సైతం టీమ్ ఇండియా ప్రక్షాళనతోనే 2023 కల సాకారానికి ప్రయాణం మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఆగస్టు 1 నుంచి ఆరంభయమ్యే వెస్టిండీస్ పర్యటనకు సీనియర్ సెలక్షన్ కమిటీ ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలో నేడు జట్లను ఎంపిక చేయనుంది. పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20, మూడు టెస్టులు ఆడాల్సి ఉంది. మూడు ఫార్మాట్లలోని 15 మంది ఆటగాళ్లలో ఎవరు ఉంటారనే చర్చ ఇప్పుడు ఎవరి మదిలోనూ లేదు. విరాట్ కోహ్లి నుంచి కెప్టెన్సీ పగ్గాలు తీసేసుకుంటారా? ఎం.ఎస్ ధోని వీడ్కోలుపై స్పష్టత లభిస్తుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నేడు మంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయం (క్రికెట్ సెంటర్)లో సమావేశం కానున్న సీనియర్ సెలక్షన్ కమిటీ జట్లను ప్రకటించనుంది.
నాయకత్వ మార్పు ఉంటుందా? : 2019 ప్రపంచకప్కు విరాట్ కోహ్లి సారథ్యంలో భారత్ బరిలోకి దిగిన వేళ సోషల్ మీడియాలో ఓ జోక్ చక్కర్లు కొట్టింది. నాలుగు ఐపీఎల్ టైటిళ్లు నెగ్గిన రోహిత్ శర్మ, మూడు ఐపీఎల్ టైటిళ్లు నెగ్గిన ఎం.ఎస్ ధోనిలు అసలు ఐపీఎల్లో విజయమెరుగని విరాట్ కోహ్లి సారథ్యంలో ఆడుతున్నారనే జోక్ పాపులర్ అయ్యింది. బ్యాట్స్మన్గా, పోరాటయోధుడిగా విరాట్ కోహ్లిపై ఎవరికి ఎటువంటి సందేహం లేదు. కానీ నాయకుడిగా కోహ్లి లక్షణాలు సగటు అభిమానికి సైతం ప్రశ్నార్థకం. ఐపీఎల్లో కీలక సందర్బాల్లో కోచ్ ఆశీష్ నెహ్రా సలహాలతో బౌలింగ్, ఫీల్డింగ్ మార్పులు చేసిన కోహ్లి.. ప్రపంచకప్లోనూ సీనియర్ ఆటగాడు ధోనిపైనే ఎక్కువ ఆధారపడతాడు. ఒత్తిడితో కూడిన సెషన్లలో కోహ్లి నుంచి సాధారణ నాయకత్వం ఆశించినా భంగపాటే ఎదురవుతోంది. దీనికి తోడు తుది జట్టు ఎంపికలో కోహ్లి సమీకరణాలు నిలకడగా భారత్ కొంప ముంచుతున్నాయి. ప్రపంచకప్లో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఎంపికలో కోహ్లి వ్యూహం బెడిసికొట్టింది. కష్టకాలంలో సలహాలు ఇచ్చేందుకు కోహ్లికి ఎవరో ఒకరి సాయం కావాలి. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో, 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లో కోహ్లి నాయకత్వంలోనే భారత్ భంగపడింది. దీంతో నాయకత్వ మార్పిడితో 2023 వరల్డ్కప్ను టీమ్ ఇండియాను సిద్ధం చేయాలని బోర్డు ఆలోచన. ముంబయి ఇండియన్స్ను ఐపీఎల్లో నాలుగు సార్లు విజేతగా నిలిపిన నాయకుడు రోహిత్ శర్మ. భారత్కు ఆసియా కప్ సహా పలు సిరీస్ విజయాలు అందించాడు. వన్డేల్లో బ్యాట్స్మన్గా రోహిత్ రికార్డులకు తిరుగులేదు. మూడు డబుల్ సెంచరీలు సహా ఓ ప్రపంచకప్లో ఐదు సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్గా చరిత్ర పుటలకెక్కాడు. టెస్టు పగ్గాలు కోహ్లి వద్ద ఉంచి, వన్డే, టీ20 కెప్టెన్సీ రోహిత్ శర్మకు అప్పగించాలనే డిమాండ్ రోజు రోజుకూ ఎక్కువైపోతుంది. విరాట్ కోహ్లి ఆధునిక క్రికెట్లో సాటిలేని బ్యాట్స్మన్. గొప్ప బ్యాట్స్మన్కు గొప్ప కెప్టెన్సీ లక్షణాలు ఉండనక్కర్లేదు. కోహ్లి విషయంలోనూ ఇదే జరుగుతోందని భావించాలి. సచిన్ టెండూల్కర్ దిగ్గజ బ్యాట్స్మన్ అయినా, కెప్టెన్గా రాణించలేని విషయం ఇక్కడ గమనార్హం. అయితే నాయకత్వ మార్పు అంత చిన్న విషయం కాదు. గతంలో ధోని, కుంబ్లేలతో బీసీసీఐ ఇద్దరు కెప్టెన్ల ప్రయోగంతో సక్సెస్ అయ్యింది. ఇద్దరు నాయకుల ప్రయోగం వికటిస్తే డ్రెస్సింగ్రూమ్ రెండు గ్రూపులుగా చీలిపోయే ప్రమాదం ఎక్కువ. ఇవన్నీ గమనంలోకి తీసుకుని బీసీసీఐ, సెలక్షన్ కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.
ధోని సంగతేంటి? : టీమ్ ఇండియా ప్రపంచకప్ పోరాటం అంతా ఎం.ఎస్ ధోని చుట్టూనే తిరిగింది!. వరల్డ్కప్కు ముందు అతడు జట్టులో ఉండాలా? వద్దా? అని.. ప్రపంచకప్లో అతడిని ఎక్కడ ఆడించాలి? ఎలా సద్వినియోగం చేసుకోవాలని.. ఇప్పుడు ప్రపంచకప్ ముగిసిన తర్వాత అతడు ఎప్పుడు వీడ్కోలు తీసుకుంటాడని నిరంతరం చర్చ నడుస్తూన ఉంది. వీడ్కోలుపై మహి తనతో ఏమీ చెప్పలేదని కోహ్లి చెప్పాడు. వెస్టిండీస్ పర్యటనకు నేడు జట్టు ఎంపిక నేపథ్యంలో ధోని భవిష్యత్పై ఆసక్తి నెలకొంది. దిగ్గజ క్రికెటర్గా ధోని చివరి మ్యాచ్ వీడ్కోలు పలుకుతాడా? లేక టెస్టులకు గుడ్ బై చెప్పినట్టు సింపుల్గా తేల్చేస్తాడా? ఆసక్తికరం. ధోని తల్లిదండ్రులు మాత్రం మహి వీడ్కోలు తీసుకోవాలని కోరుకుంటున్నారని చిన్ననాటి కోచ్ వెల్లడించాడు.