Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీఫైనల్లోకి సింధు
- ఇండోనేషియా ఓపెన్
జకర్తా : సమవుజ్జీలతో సమరం అంటేనే కొందరు క్రీడాకారులు రెచ్చిపోతారు. వరుస ఓటములు ఎదురైనా దీటైన ప్రత్యర్థి ఎదురైతే, ఆ మ్యాచ్లోనే ఫామ్ అందుకుంటారు. ఒలింపిక్ మెడలిస్ట్, హైదరాబాదీ షట్లర్ పి.వి సింధు ఈ కోవలోకే వస్తుంది. వరుస పరాజయాలు చవిచూస్తున్న తెలుగు తేజం, ఇండోనేషియా ఓపెన్ ఆరంభంలోనూ తడబడింది. తొలి రెండు రౌండ్లలో విజయాల కోసం శ్రమించింది. ఏడో సీడ్ సింధు క్వార్టర్ఫైనల్లో మూడో సీడ్ నొజొమి ఒకుహర (జపాన్)తో పోరాడగలదా? అనే సందేహం. కానీ ప్రియ ప్రత్యర్థిపై సింధు చెలరేగింది. పూర్వ వైభవం, తనదైన దూకుడు చూపిస్తూ వరుస గేముల్లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. సింధు హవా నడిచిన క్వార్టర్ఫైనల్లో 14-21, 7-21తో ఒకుహర ఓటమిపాలైంది. 44 నిమిషాల మ్యాచ్లో ఆద్యంతం సింధు ఆధిపత్యం కొనసాగింది. నేడు జరిగే సెమీఫైనల్లో చైనా కెరటం చెన్ యుఫెరుతో సింధు తలపడనుంది. 'ఈ రోజు ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. నిజంగా బాగా ఆడాను. ఒకుహరతో మ్యాచులు సుదీర్ఘ ర్యాలీలతో సాగుతుందని మీకు తెలుసు. మేము అందుకు తగ్గట్టుగానే సిద్ధమవుతాం. మంచి ర్యాలీలు సాగాయి, ఉత్కంఠ కొనసాగింది. రేపటి మ్యాచ్ కోసం త్వరగా కోలుకుంటానని అనుకుంటున్నాను. ఈ రోజు అనవసర తప్పిదాలు చేయనందుకు సంతోషంగా ఉన్నాను' అని సెమీస్కు చేరిన అనంతరం సింధు తెలిపింది.