Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు నెలల విరామం కోరిన మహి
- ఆర్మీ పారాచూట్ విభాగంలో విధులు
- నేడు భారత జట్ల ఎంపిక
నవతెలంగాణ-ముంబయి
ప్రపంచకప్లో భారత్ ప్రస్థానం ముగిసింది. న్యూజిలాండ్తో సెమీఫైనల్లోనే ఎం.ఎస్ ధోని కెరీర్ చివరి మ్యాచ్ ఆడేశాడు. త్వరలోనే వీడ్కోలు ప్రకటన చేయనున్నాడు.. ఇదీ వరల్డ్కప్ అనంతరం దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని కెరీర్పై చెలరేగుతున్న ఊహాగానాలు. ధోనికి వీడ్కోలు ఆలోచన ఇప్పట్లో లేదని స్నేహితుడు అరుణ్ పాండే ప్రకటన చేసిన మరుసటి రోజే.. కెరీర్పై ధోని నుంచి అధికారిక సమాచారం అందింది. ఆగస్టు 1 నుంచి ఆరంభం కానున్న వెస్టిండీస్ పర్యటనకు తనను పరిగణనలోకి తీసుకోవద్దని ఎం.ఎస్ ధోని బీసీసీఐ అధికారులకు తెలియజేశాడు. వెస్టిండీస్ టూర్కు జట్టు ఎంపిక నేపథ్యంలో మహి కెరీర్పై సెలక్టర్లు ఏం నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠకు తాత్కాలికంగా తెరపడింది. ఆర్మీ పారాచూట్ రెజిమెంట్లో గౌరవ లెఫ్టినెట్ కల్నల్గా కొనసాగుతున్న ఎం.ఎస్ ధోని.. ఆగస్టు, సెప్టెంబర్ మాసాలను సైన్యంలో విధులు నిర్వర్తించేందుకు ఉపయోగించుకోనున్నాడు.
' మేం మూడు విషయాలు స్పష్టం చేయదలచుకున్నాం. ఎం.ఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగటం లేదు. ఆర్మీ పాలామిటరీ దళంలో విధులు నిర్వర్తించేందుకు అతడు రెండు నెలల సెలవు తీసుకున్నాడు. ఇదే విషయాన్ని కెప్టెన్ విరాట్ కోహ్లి, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్కు తెలియజేశాం' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 38 ఏండ్ల ధోని వీడ్కోలుకు నిరాకరించటంతో బంతి ఇప్పుడు సెలక్టర్ల కోర్టులో పడింది. సెప్టెంబర్ 15 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో భారత్ ద్వైపాక్షిక సిరీస్ ఆడనుంది. ధోని విండీస్ టూర్కు దూరం కావటంతో.. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మూడు ఫార్మాట్లకు ప్రధాన వికెట్ కీపర్ కానున్నాడు. టెస్టులకు వృద్దిమాన్ సాహా అందుబాటులో ఉన్నప్పటికీ.. పంత్కే తొలి ప్రాధాన్యంగా తెలుస్తోంది.
నేడు జట్ల ఎంపిక : వెస్టిండీస్లో పర్యటించే భారత జట్లను ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ నేడు ఎంపిక చేయనుంది. విండీస్ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు సహా మూడు టెస్టులు ఆడనుంది. సెలక్షన్ కమిటీ సమావేశానికి కెప్టెన్ విరాట్ కోహ్లి హాజరు కానున్నాడు. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయం క్రికెట్ సెంటర్లో సెలక్షన్ కమిటీ సమావేశం జరుగనుంది. కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లి, జశ్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యలు విశ్రాంతి తీసుకునే వాతావరణం కనిపించటం లేదు. సెలక్షన్ సమావేశానికి విరాట్ కోహ్లి సైతం హాజరవుతున్నాడు, దీంతో పరిమిత ఓవర్ల ఫార్మాట్కు నాయకత్వ మార్పు సైతం ఉండబోదని బీసీసీఐ స్పష్టం చేసినట్టైంది.