Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచకప్ ఫైనల్ అంపైర్
కొలంబో : వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓవర్ త్రో విషయంలో తాను పొరపాటు చేశానని ఆ మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించిన కుమార్ ధర్మసేన ఎట్టకేలకు ఒప్పుకున్నాడు. బెన్ స్టోక్స్ బ్యాట్కు తగిలిన బంతి ఓవర్ త్రోగా బౌండరీకి వెళ్లడంతో దానికి ఆరు పరుగులు ఇవ్వడం తాను చేసిన తప్పని తెలిపాడు. మ్యాచ్ అధికారులతో పాటు ఫీల్డ్లోనే ఉన్న మరొక అంపైర్ ఎరాస్మస్తో చర్చించిన తర్వాతే ఆరు పరగులు ఇచ్చానంటూ తెలిపాడు. ఇది తాను చేసిన అతి పెద్ద తప్పిదమని టీవీ రిప్లేలో చూసిన తర్వాత కానీ అర్థం కాలేదన్నాడు. 'సండే టైమ్స్'తో ఆదివారం మాట్లాడిన ధర్మసేన ఓవర్ త్రో నిర్ణయంపై స్పందించాడు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్లీ దాని గురించి ఆలోచించడం, తలచుకుని బాధపడడం లాంటివి చేయబోనన్నాడు. అయితే, తప్పు మాత్రం జరిగిందని అంగీకరించాడు. ''టీవీ రీప్లేలు చూసి ఎన్నైనా చెప్పొచ్చు. టీవీ రీప్లే చూసినప్పుడే నాకూ తెలిసింది. జడ్జిమెంట్లో తప్పు జరిగిన మాట వాస్తవం. అయితే, గ్రౌండ్లో మాకు పెద్దపెద్ద టీవీలు ఉండవు కదా. అయినా, ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్లీ దాని గురించి ఆలోచించి చింతించే అలవాటు నాకు లేదు. ఆ సమయంలో నేను తీసుకున్న నిర్ణయానికి ఐసీసీ కూడా ప్రశంసించింది'' అని ధర్మసేన వివరించాడు. ఎరాస్మన్తో పాటు ఇతర అంపైర్లు కూడా ఇంగ్లండ్కు ఆరు పరుగులు ఇవ్వడాన్ని అంగీకరించారని పేర్కొన్నాడు. ఇలాంటి సమయంలో దానిని థర్డ్ అంపైర్కు ఇవ్వాలని క్రికెట్ చట్టంలో లేదన్నాడు. అందుకనే కమ్యూనికేషన్ సిస్టం ద్వారా థర్డ్ అంపైర్కు సమాచారం అందించానని, దానిని ఇతర అంపైర్లు, మ్యాచ్ రిఫరీ కూడా విన్నాడని ధర్మసేన వివరించాడు.
'నేను తప్పిదం చేసిన విషయాన్ని అంగీకరిస్తున్నా. మ్యాచ్ ముగిసిన తర్వాత టీవీ రిప్లేలో చూస్తే నేను చేసిన పొరపాటు తెలిసింది. బ్యాట్స్మన్ రెండో పరుగును పూర్తి చేశాడని అంతా భ్రమపడి ఆ త్రోకు అదనంగా మరో నాలుగు పరుగులు ఇవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలోనే దాన్ని మ్యాచ్ అధికారులు రిప్లేలో చూడకపోవడంతో పొరపాటు జరిగింది' అని ధర్మసేన పేర్కొన్నాడు.
ప్రపంచకప్ ఫైనల్లో గప్టిల్ విసిరిన త్రో బెన్ స్టోక్స్ బ్యాట్కు తగిలి బౌండరీ దాటడంతో మొత్తంగా ఆరు పరుగులు ఇచ్చారు. చివరికి ఈ మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్కు దారి తీసింది. చివరికి ఇంగ్లండ్ విశ్వ విజేతగా నిలిచింది.