Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండోనేషియా ఓపెన్
- విజేత యమగుచి
జకర్తా : ఈ ఏడాదిలో తొలి టైటిల్ను అందుకోవాలను కున్న తెలుగు తేజం పివి సింధుకు నిరాశే మిగిలింది. ఇండోనేషియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సింధు పరాజయం చవి చూసింది. ప్రపంచ నాలుగో స్థానంలో ఉన్న జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచితో జరిగిన తుదిపోరులో ఐదో ర్యాంకర్ సింధు వరస సెట్లలో ఓడింది. ఈ టోర్నిలో క్వార్టర్స్, సెమీస్లో అద్భుతంగా రాణించిన సింధు ఫైనల్లో మాత్రం 52 నిమిషాల్లోనే ప్రత్యర్థి ముందు తలవంచింది. ఆదివారం మహిళల సింగిల్స్ ఫైనల్లో యమగుచి 21-15, 21-16 స్కోరుతో సింధుపై సునాయసంగా విజయం సాధించింది. గంటలోపే మ్యాచ్ను ముగించి యామగుచి ఏకపక్షంగా మ్యాచ్ను సొంతం చేసు కుంది. ఫైనల్లో తొలి గేమ్లో మొదటి అర్థభాగం వరకూ సింధు ఆధిపత్యం కనబర్చినప్పటికీ.. ఆ తరువాత నుంచి సింధుకు యామగుచి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. వరుస తొమ్మిది పాయింట్లు సాధించి తొలి సెట్ను సొంతం చేసుకుంది. ఒక దశలో 11-8తో ఆధిక్యంలో ఉన్న సింధు చివరికి తొలి గేమ్ను ప్రత్యర్థికి అప్పగించింది. తొలి గేమ్ 21 నిమిషాల్లోనే ముగిసింది. తరువాత రెండోగేమ్ లోనూ యమగూచి ఆధిపత్యం చెలాయించి సింధుపై పైచేయి సాధించింది. రెండో గేమ్ 31 నిమిషాల్లోనే ముగిసింది. ఈ విజయంతో టైటిల్ను కైవసం చేసుకుంది. యమగూచిపై విజయాల రికార్డు ఉన్న సింధు ఫైనల్లో ఓడటం గమనార్హం. ఆదివారంతో యామగుచి,సింధుతో మధ్య ఉన్న ముఖముఖి రికార్డు5-10గా మారింది. ఆదివారం ఫైనల్కు ముందు వరసగా నాలుగు మ్యాచ్ల్లో యమగుచిని చిత్తు చేసిన సింధు ఇప్పుడు మాత్రం పరాజయం చవిచూసింది. భారత్ నుంచి ఇండోనేషియా ఓపెన్ ఫైనలకు చేరుకున్న మూడో షట్లర్గా నిలిచిన సింధు టైటిల్ గెలుచుకోవడంలో మాత్రం విఫలం చెందింది. ఈ ఏడాదిలో సింధుకు ఇదే తొలి ఫైనల్. మార్చి లో ఇండియా ఓపెన్లో, ఏప్రిల్లో సింగపూర్ ఓపెన్లో సెమీ ఫైనల్ నుంచి నిష్క్రమించిన సింధు ఈ ఇండోనేషియా ఓపెన్లో ఫైనల్కు చేరుకుంది. త్వరలో జరగనున్న జపాన్ ఓపెన్, థాయిలాండ్ ఓపెన్ల్లో సింధు పాల్గొననుంది.