Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంతే ఇక తొలి ప్రాధాన్యం
- చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్
నవతెలంగాణ-ముంబయి
దిగ్గజ క్రికెట్ ఎం.ఎస్ ధోని కెరీర్ చివరి మ్యాచ్ ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆడేశాడనే ఊహాగానాలు గుప్పుమన్నాయి. వీడ్కోలు ప్రకటన కోసం ఎదురుచూస్తున్న వారిని ఆశ్చర్యపరుస్తూ.. ధోని రెండు నెలల సెలవు కోరుతూ బోర్డుకు లేఖ రాశాడు. వెస్టిండీస్ పర్యటనకు భారత జట్ల ఎంపిక నేపథ్యంలో అక్కడే మహి భవిష్యత్ ఏంటో తేలిపోతుందని క్రికెట్ పండితులు అంచనా వేశారు. ఐసీసీ మేజర్ ట్రోఫీలు నెగ్గిన ఏకైక నాయకుడు ధోనిని సెలక్షన్ కమిటీ ఏ విధంగా సాగనంపుతుంది? మహిని ఎంపిక చేయ కుండా వేటు వేయగల ధైర్యం చేయగలదా? అనే ప్రశ్నలెన్నో మొలకెత్తాయి. విమర్శలు ఊహించిన ప్రశ్నలకు సమాధానం లభించకపోయినా, ధోని ఇక వీడ్కోలు తీసుకో అని కోరుకునే వారికి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కోరుకున్న పనే చేసిపెట్టాడు. ఆర్మీలో పారామిలటరీ దళంలో పనిచేసేందుకు రెండు నెలల సెలవు తీసుకున్న ధోనితో సెలక్షన్ కమిటీ చైర్మన్ ప్రసాద్ కీలక సందేశం పంపించినట్టు సమాచారం.
2020 టీ20 ప్రపంచకప్ ఆడే ఆలోచనలో ఉన్న ధోని.. ఇప్పటికిప్పుడు వీడ్కోలు చెప్పేందుకు సుముఖంగా లేడని తెలుస్తోంది. దీంతో సెలక్షన్ కమిటీ ప్రాధామ్యాలను ధోనితో ప్రసాద్ పంచుకు న్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ' భారత జట్టు ప్రధాన ప్రణాళికల్లో మీరు ఇక భాగం కాబోరు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని సెలక్షన్ కమిటీ భావిస్తోంది' అని ప్రసాద్ చెప్పగా.. నాకు ఇప్పట్లో వీడ్కోలు ఆలోచన లేదు. మీ ప్రణాళిక ప్రకారం మీరు వెళ్లండి అని ధోని బదులిచ్చినట్టు తెలిసింది. వీడ్కోలు నిర్ణయం వ్యక్తిగత అంశం. మా ప్రాధామ్యాలను మేం వివరించాం. నేడే వీడ్కోలు పలుకుతాడా? రేపు ప్రకటిస్తాడా? ఇక ధోని అభిష్టం. యువ క్రికెటర్ రిషబ్ పంత్కు మూడు ఫార్మాట్లలో తొలి వికెట్కీపర్గా అవకాశాలు ఇవ్వదలచు కున్నాం. రానున్న రోజుల్లో అతడి పని భారం పర్యవేక్షణ చేయటం అవసరం. అందుకే వృద్దిమాన్ సాహా, కెఎస్ భరత్లు రేసులో ఉన్నారని ప్రసాద్ అన్నాడు. ఇక ప్రపంచకప్లో విమర్శలకు గురైన ధోని స్ట్రయిక్ రేట్పై స్పందించటం సరైనది కాదని ప్రసాద్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ప్రపంచకప్ జట్టులోకి ఆలస్యంగా ప్రవేశించిన రిషబ్ పంత్ సెమీఫైనల్లో న్యూజిలాండ్పై ఆకట్టుకునే ప్రదర్శనే చేశాడు. భారత క్రికెట్ భవిష్య స్టార్కు పేరొందిన రిషబ్ పంత్ ఇక నుంచి టెస్టు, వన్డే, టీ20 జట్ల ప్రణాళికల్లో భాగమయ్యాడు. రిషబ్ పంత్ పవర్ హిట్టింగ్ సామర్థ్యం దృష్య్టా 2020 టీ20 వరల్డ్కప్కు అతడిని కాదని సెలక్టర్లు ధోనిని ఎంచుకోవటం అసాధ్యమనే చెప్పాలేమే!.
మయాంక్ ఎక్కడ? : మరోవైపు సెలక్షన్ కమిటీ తీరు పట్ల విమర్శలు నిలకడగా వినిపిస్తూనే ఉన్నాయి. విజరు శంకర్ గాయంతో అంబటి రాయుడని కాదని ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన మయాంక్ అగర్వాల్ తాజాగా వెస్టిండీస్కు ఎంపిక చేసిన వన్డే జట్టులో చోటు సాధించలేదు. భావోద్వేగ రిటైర్మెంట్తో రాయుడు క్రికెట్కు గుడ్బై చెప్పాడు. ఒక్క వన్డే కూడా ఆడని అగర్వాల్ను వరల్డ్కప్కు ఎంపిక చేసిన సెలక్టర్లు.. తర్వాతి సిరీస్కు అతడిని తప్పించటం వారి ఆలోచన తీరును ప్రశ్నించేలా చేస్తోంది. మూడో ఓపెనర్ కారణంతో అగర్వాల్ను ఎంపిక చేశామని చెప్పినా.. అతడిని నం.4 కోసమూ ఉపయోగించుకోవచ్చు. ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ జట్టుకు నేరుగా ఎంపికయ్యే అర్హతలు కలిగిన ఆటగాడు.. ఓ ద్వైపాక్షిక సిరీస్కు అక్కరకు రాకుండా పోయాడా? అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. టెస్టులో చోటు మయాంక్ అగర్వాల్ చోటు నిలుపుకున్నా.. యువ కెరటం పృథ్వీ షాకు సెలక్టర్లు మొండిచేయి చూపించారు.