Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 34-33తో ఢిల్లీ పైచేయి
- యోధను చిత్తు చేసిన బెంగాల్
నవతెలంగాణ-హైదరాబాద్
సొంతగడ్డపై తెలుగు టైటాన్స్కు హ్యాట్రిక్ ఓటమి. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 7ను ఘనంగా ఆరంభించాలని తపించిన తెలుగు టైటాన్స్కు ఇది ఊహించని ఫలితమే. బాహుబలి, స్టార్ రైడర్ సిద్దార్థ్ దేశారు సహా సురజ్ దేశారు రైడింగ్లో మెరిసినా, టైటాన్స్కు మూడో ఓటమి తప్పలేదు. యు ముంబా, తమిళ తలైవాస్, తాజాగా దబంగ్ ఢిల్లీలు తెలుగు టైటాన్స్పై వరుస విజయాలు సాధించాయి. ఆఖరు రైడ్ వరకూ ఉత్కంఠ రేపిన బుధవారం నాటి మ్యాచ్లో తెలుగు టైటాన్స్ తృటిలో విజయానికి దూరమైంది. 33-34తో ఒక్క పాయింట్ తేడాతో సీజన్ బోణీ విజయాన్ని అందుకోలేకపోయింది. అరంగేట్ర ఆటగాడు సురజ్ దేశారు తొలి కూతలోనే రెండు పాయింట్లు తీసుకొచ్చి టైటాన్స్కు మంచి ఆరంభాన్ని అందించాడు. ఇదే సమయంలో దబంగ్ ఢిల్లీ సైతం ఆరంభం నుంచీ టైటాన్స్కు గట్టి పోటీ ఇచ్చింది. విరామ సమయానికి 13-12తో ఢిల్లీ ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్థంలో టైటాన్స్ను ఆలౌట్ చేసిన ఢిల్లీ ఆధిక్యం పెంచుకుంది. సురజ్ దేశారు వరుస రైడ్ పాయింట్లకు తోడు ఓ సూపర్ రైడ్తో టైటాన్స్ను రేసులోకి తీసుకొచ్చాడు. 28-26తో తెలుగు జట్టును ముందంజలో నిలిపాడు. చివరి ఐదు నిమిషాల్లో పాయింట్ల సాధనలో విఫలమైన టైటాన్స్ నిరాశపరిచింది. చివరి రైడ్లో రెండు పాయింట్లు సాధిస్తే డ్రా అవకాశం ఉన్నా, సురజ్ ఓ పాయింట్ తీసుకొచ్చాడు. 18 పాయింట్లతో సురజ్ అదరగొట్టినా, జట్టును విజయ పథాన నడిపించలేదు. 13 సార్లు కూతకెళ్లిన సిద్దార్థ్ దేశారు 8 పాయింట్లే సాధించాడు. విశాల్ భరద్వాజ్ నాలుగు ట్యాకిల్స్ చేశాడు. దబంగ్ ఢిల్లీ తరఫున రైడర్ నవీన్ కుమార్ 14 పాయింట్లు సాధించగా..జోగిందర్ నర్వాల్ నాలుగు ట్యాకిల్స్తో మెరిశాడు. అంతకముందు జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ భారీ విజయం సాధించింది. యూపీ యోధను 48-17తో చిత్తుగా ఓడించింది. బెంగాల్ రైడర్ మహ్మద్ నబిబిక్ష్ 10 పాయింట్లు సాధించగా.. మణిందర్ సింగ్ 9, ప్రపంజన్ ఐదు పాయింట్లతో రాణించారు. డిఫెండర్ బల్దేవ్ సింగ్ ఏడు ట్యాకిల్స్తో సత్తా చాటాడు.