Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రొ కబడ్డీ లీగ్ 7 సీజన్లో బలహీన జట్టుగా బరిలోకి దిగిన దబంగ్ ఢిల్లీ రెండు రోజుల్లో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఆతిథ్య తెలుగు టైటాన్స్పై ఒక్క పాయింట్ తేడాతో మెరుపు విజయంతో పీకెఎల్ 7ను మొదలెట్టిన దబంగ్ ఢిల్లీ.. గురువారం తమిళ తలైవాస్పైనా ఒక్క పాయింట్ తేడాతో ఉత్కంఠ విజయం సొంతం చేసుకుంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 30-29తో తమిళ తలైవాస్పై దబంగ్ ఢిల్లీ గెలుపొందింది. భారత జట్టు కెప్టెన్ అజరు ఠాకూర్, పీకెఎల్ స్టార్ రైడర్ రాహుల్ చౌదరి, స్టార్ ఆల్రౌండర్ మంజిత్ చిల్లార్లతో కూడిన తలైవాస్తో పోటీ ఢిల్లీకి కష్టమే అనిపించింది. అందుకు తగినట్టుగానే తొలి 20 నిమిషాల్లో తలైవాస్ సత్తా చాటింది. ప్రథమార్థంలో 18-11తో ఏడు పాయింట్ల ఆధిక్యం సాధించి ముందంజ వేసింది. వెనుకంజలో నిలిచినా, పట్టు విడువని దబంగ్ ఢిల్లీ ఒక్కో పాయింట్తోనే తలైవాస్కు చేరువైంది. చివరి ఆరు నిమిషాల ఆట మిగిలి ఉన్న సమయంలో 28-20తో తలైవాస్ మంచి ఆధిక్యంలో నిలిచింది. నవీన్ కుమార్ ఒకే రైడ్లో అజిత్, వినీత్, రణ్సింగ్లను అవుట్ చేసి ఢిల్లీని 24-28తో రేసులో నిలిపాడు. అజరు ఠాకూర్ను ట్యాకిల్ చేసిన విశాల్ మనె తైలవాస్ను ఆలౌట్ చేశాడు. దీంతో అంతరం 27-29కు దిగొచ్చింది. నవీన్ కుమార్ మరో సక్సెస్ఫుల్ రైడ్తో 28-29తో మ్యాచ్ను తారాస్థాయికి తీసుకొచ్చాడు. నవీన్ కుమార్ ట్యాక్లింగ్లోనూ మెరిసి అజరు ఠాకూర్ను అవుట్ చేయటంతో 29-29తో స్కోర్లు సమం అయ్యాయి. ఈ స్థితిలో నాలుగు రైడ్లు పూర్తయినా ఏ జట్టు ఆధిక్యం సాధించలేదు. మ్యాచ్ చివరి రైడ్లో నవీన్ కుమార్ మ్యాజిక్ చేశాడు. మంజిత్ చిల్లార్ను అవుట్ చేసి ఢిల్లీకి ఓ పాయింట్ ఆధిక్యం అందించాడు. 30-29తో పైచేయి సాధించిన దబంగ్ ఢిల్లీ సీజన్లో వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ 7 పాయింట్లు సాధించగా, డిఫెండర్ జోగిందర్ నర్వాల్ నాలుగు ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. తలైవాస్ రైడర్ రాహుల్ చౌదరి ఆరు పాయింట్లు, డిఫెండర్ మంజిత్ చిల్లార్ ఐదు పాయింట్లతో మెరిశారు. నేడు జరిగే మ్యాచ్లో మూడు సార్లు విజేత పట్నా పైరేట్స్తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. యూపీ యోధతో గుజరాత్ ఢీ కొట్టనుంది.