Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తలైవాస్ చేతిలో28-34తో భంగపాటు
- ప్రొ కబడ్డీ లీగ్ 7 సీజన్
అహ్మదాబాద్ : ప్రొ కబడ్డీ లీగ్ రెండు సార్లు ఫైనలిస్ట్, టైటిల్ ఫేవరెట్లలో ఒకటి గుజరాత్ ఫార్చ్యూన్జెయింట్స్ హ్యాట్రిక్ ఓటమి చవిచూసింది. సీజన్ 7లో వరుసగా మూడు విజయాలు సాధించి జోరు కొనసాగించిన గుజరాత్.. తర్వాతి మూడు మ్యాచుల్లో పరాజయం పాలైంది. యు ముంబా, పుణెరి పల్టన్, తమిళ తలైవాస్ చేతిలో ఓటమితో హ్యాట్రిక్ పూర్తి చేసుకుంది. సొంతగడ్డ అహ్మదాబాద్లో జరిగిన తొలి మ్యాచ్లోనే 28-34తో తలైవాస్ చేతిలో ఓటమిపాలైంది. తలైవాస్ స్టార్ రైడర్ రాహుల్ చౌదరిని నిలువరించిన గుజరాత్ ఆరంభంలో ఆధిక్యంలో కొనసాగింది. కెప్టెన్ అజరు ఠాకూర్ వరుస రైడ్లలో నలుగురు డిఫెండర్లను అవుట్ చేసి, గుజరాత్ను ఆలౌట్ చేశాడు. దీంతో విరామ సమయానికి తలైవాస్ 15-10తో ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్థంలో తలైవాస్ ఆధిక్యం కొనసాగినా.. చివరి 8 నిమిషాల్లో గుజరాత్ పుంజుకుంది. వరుస పాయింట్లతో తలైవాస్ను ఆలౌట్ చేసి 26-25తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి రెండు నిమిషా ఆట మిగిలి ఉన్న సమయంలో అజరు ఠాకూర్ సూపర్ రైడ్ మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించింది. మగ్గురు డిఫెండర్లను అవుట్ చేసిన అజరు ఠాకూర్ తలైవాస్ను 29-26తో ముందంజలో నిలిపాడు. డిఫెండర్ల జోరుతో మరోసారి గుజరాత్ను ఆలౌట్ చేసి గెలుపు ఖాయం చేసుకుంది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆరు పాయింట్ల తేడాతో గుజరాత్ను ఓడించింది. డిఫెండర్ మోహిత్ చిల్లార్ ఐదు ట్యాకిల్స్తో మెరువగా.. అజరు ఠాకూర్ 9 పాయింట్లు సాధించాడు. గుజరాత్ రైడర్ రోహిత్ గులియా 9 పాయింట్లు తీసుకురాగా, డిఫెండర్ సునీల్ కుమార్ 6 ట్యాకిల్స్ చేశాడు.
టైటాన్స్ ఖాతా తెరిచేనా? : ఆరు సీజన్లుగా టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగి భంగపడిన తెలుగు టైటాన్స్.. సీజన్ 7ను సైతం అదే శైలిలో ఆరంభించింది. సొంతగడ్డపై జరిగిన నాలుగు మ్యాచుల్లో పరిపూర్ణ పరాజయం చవిచూసిన టైటాన్స్.. అత్యుత్సాహంతో యూపీ యోధతో మ్యాచ్ను టై చేసుకుంది. నేడు అహ్మదాబాద్లో జరిగే మ్యాచ్లో లోకల్ జట్టు గుజరాత్ ఫార్చ్యూన్జెయింట్స్తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. గుజరాత్ సైతం హ్యాట్రిక్ ఓటములతో ఒత్తిడిలో కొనసాగుతోంది. స్టార్ రైడర్ సిద్దార్థ్ దేశారుపైనే మరోసారి టైటాన్స్ ఆధారపడనుంది.