Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్పై 30-24తో ఘన విజయం
- బెంగళూర్పై హర్యానా గెలుపు
- ప్రొ కబడ్డీ లీగ్ 7
అహ్మదాబాద్ : ప్రొ కబడ్డీ లీగ్ 7లో ఎట్టకేలకు తెలుగు టైటాన్స్ ఖాతా తెరిచింది. బాహుబలి సిద్దార్థ్ దేశారుని రికార్డు ధరకు వేలంలో దక్కించుకుని మరోసారి టైటిల్ ఫేవరెట్గా సీజన్ను సొంతగడ్డపై ఆరంభించిన టైటాన్స్ చివరగా ఏడో ప్రయత్నంలో గెలుపు రుచి చూసింది. సొంతగడ్డపై నాలుగు ఓటముల తర్వాత యూపీ యోధతో మ్యాచ్ను అత్యుత్సాహంతో టై చేసుకున్న టైటాన్స్.. రెండు సార్లు ఫైనలిస్ట్ గుజరాత్ ఫార్చ్యూన్జెయింట్స్పై సాధికారిక విజయంతో రేసు మొదలు పెట్టింది. ఆరంభం నుంచీ ఆధిక్యంలో కొనసాగిన తెలుగు టైటాన్స్ 30-24తో ఆరు పాయింట్ల తేడాతో గుజరాత్పై గెలుపొందింది. టైటాన్స్ డిఫెండర్ విశాల్ భరద్వాజ్ ఏడు ట్యాకిల్స్తో కండ్లుచెదిరే ప్రదర్శన చేశాడు. స్టార్ రైడర్ సిద్దార్థ్ దేశారు 7 రైడ్ పాయింట్లతో రాణించాడు. డిఫెన్స్లో తిరుగులేని ఆధిపత్యం తెలుగు టైటాన్స్కు సీజన్లో తొలి విజయాన్ని అందించింది.
టైటాన్స్ జోరు : విజయం కోసం ఎదురుచూస్తున్న జట్టు తెలుగు టైటాన్స్. హ్యాట్రిక్ ఓటముల నుంచి బయట పడేందుకు చూస్తున్న జట్టు గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్. విజయం కోసం ఇరు జట్లపై ఒత్తిడి నెలకొన్న మ్యాచ్లో తెలుగు టైటాన్స్ మెరిసింది. పీకెఎల్7లో తొలిసారి ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసిన టైటాన్స్ మెరుపు విజయం సొంతం చేసుకుంది. తొలి పది నిమిషాల్లోనే గుజరాత్ను ఆలౌట్ చేసిన టైటాన్స్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రథమార్థంలో సిద్దార్థ్ దేశారు ఏడు సార్లు కూతకెళ్లి ఆరు సార్లు పాయింట్లు తీసుకొచ్చాడు. దీంతో తెలుగు టైటాన్స్ విరామ సమయానికి 17-13తో ముందంజలో నిలిచింది. ద్వితీయార్థంలో డిఫెన్స్లో మెరుగైన గుజరాత్ పుంజుకునే ప్రయత్నం చేసింది. టైటాన్స్కు చేరువగా వచ్చేందుకు శ్రమించింది. కానీ టైటాన్స్ డిఫెండర్ విశాల్ భరద్వాజ్ ఏడు ట్యాకిల్స్ ప్రయత్నించి, ఏడు సార్లు విజయవంతమయ్యాడు. రైడింగ్ పాయింట్లు కరువైన గుజరాత్, ఎక్కువగా బోనస్ పాయింట్లపైనే ఆధారపడింది. చివర్లో గుజరాత్ జోరందుకుని రేసులోకి వచ్చినా.. వరుస పాయింట్లతో టైటాన్స్ మరింత ముందంజ వేసింది. ఆరు పాయింట్ల తేడాతో మెరుపు విజయం అందుకుంది. గుజరాత్ తరఫున రోహిత్ గులియా ఐదు రైడ్ పాయింట్లు సాధించాడు. డిఫెండర్ పర్వేశ్ బైంసావాల్ ఏడు ట్యాకిల్స్ చేశాడు. డిఫెన్స్లో గుజరాత్ 8 పాయింట్లు సాధించగా, టైటాన్స్ 16 పాయింట్లతో ఫలితాన్ని శాసించింది.
అంతకముందు జరిగిన మరో మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన బెంగళూర్ బుల్స్ 30-33తో హర్యానా స్టీలర్స్ చేతిలో ఓటమిపాలైంది. 20 నిమిషాల అనంతరం బుల్స్, స్టీలర్స్ 17-17తో సమవుజ్జీలుగా నిలిచాయి. ఆధిక్యం చేతులు మారిన ద్వితీయార్థం ఆటలో హర్యానా మెరిసింది. మూడు పాయింట్ల తేడాతో బుల్స్పై విజయం సాధించింది. బుల్స్ కెప్టెన్ రోహిత్ కుమార్ రైడింగ్లో పది పాయింట్లు, రెండు ట్యాకిల్స్తో మొత్తం 12 పాయింట్లు సాధించినా జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. హర్యానా రైడర్ వికాశ్ 12 పాయింట్లు సాధించగా, డిఫెండర్ వికాశ్ ఆరు ట్యాకిల్స్తో మెరిశాడు. వినరు 5, ధర్మరాజ్ 3, నవీన్ 2 రాణించారు.