Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్ : ఇక్కడ జరుగుతున్న ప్రొ కబడ్డీ పోటీల్లో బెంగాల్ వారియర్స్-తెలుగు టైటాన్స్ జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ డ్రా గా ముగిసింది. నిర్ణీత సమయానికి ఇరుజట్లు 29-29 పాయింట్లతో సమంగా నిలిచాయి. తొలి అర్ధభాగంలో ఆధిక్యతలో నిలిచిన టైటాన్స్ రెండో అర్ధభాగంలోనూ ఓ దశలో 17-21 పాయింట్ల ఆధిక్యతలోకి దూసుకెళ్లింది.
కానీ ఆ తర్వాత అనూహ్యంగా బెంగాల్ పుంజుకొని 25-22 పాయింట్ల ఆధిక్యతను సంపాదించింది. మ్యాచ్ చివర్లో టైటాన్స్ పుంజుకోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరుజట్లు ట్యాకిల్స్, రైడ్లలో సమంగా పాయింట్లను సాధించాయి. అంతేగాక ప్రత్యర్ధి జట్లకు రెండేసిసార్లు ఆలౌట్ కూడా చేశాయి. టైటాన్స్ జట్టులో సూరజ్ దేశారు(7), సిద్ధార్ద్ దేశారు(4) రాణించారు. బెంగాల్ జట్టులో నబీబక్షు(8), మణిందర్సింగ్(5) ఆకట్టుకున్నారు. దీంతో టోర్నీలో తెలుగు టైటాన్స్ జట్టు రెండో మ్యాచ్ను డ్రాగా ముగించినట్లైంది.
బెంగళూరుకు షాక్
రెండోమ్యాచ్లో యుపి యోథా జట్టు బెంగళూరు బుల్స్పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన బెంగళూరు జట్టు 33-34 పాయింట్ల తేడాతో యుపి చేతిలో ఓటమి చవిచూసింది. బెంగళూరు జట్టులో కెప్టెన్ పవన్కుమార్(15) రైడ్లలో రాణించిన మిగతా రైడర్లు రాణించలేకపోయారు. యుపి జట్టు 15 ట్యాకిల్ పాయింట్లతో అదరగొట్టింది. మోనూ గోయట్(8), జాధవ్(9) మెరుగైన ప్రదర్శన చేశారు. అంతేగాక యుపి జట్టు నాలుగుసార్లు బెంగళూరు జట్టును ఆలౌట్ కూడా చేయడం గమనార్హం. ప్రొ కబడ్డీ పోటీలకు మంగళవారం విశ్రాంతి. బుధవారం యుపి-హర్యానా, గుజరాత్-బెంగాల్ జట్ల మధ్య పోటీలు జరగనున్నాయి.