Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడేజా, అజయ్ ఠాకూర్, స్వప్న బర్మన్,
- సాయి ప్రణీత్లకు అర్జున అవార్డు
- విమల్ కుమార్కు ద్రోణాచార్య పురస్కారం
- జాతీయ క్రీడా అవార్డుల ప్రకటన
నవతెలంగాణ- న్యూఢిల్లీ
అంగవైకల్యం ఆమెను ఇంటికి పరిమితం చేయలేకపోయింది. క్రీడా కెరీన్ను ఎంచుకునేందుకు ఆమెకు వయసు అడ్డంకి కాలేదు. పతకం నెగ్గాలనే ఆమె సంకల్పం ముందు అన్ని సమస్యలు చిన్నబోయాయి. పారాలింపిక్స్లో రజత పతకం సాధించిన తొలి భారత పారా అథ్లెట్గా చరిత్ర సృష్టించిన దీప మాలిక్ను అత్యున్నత క్రీడా పురస్కారం 'రాజీవ్ గాంధీ ఖేల్రత్న' వరించింది. 2016 రియో పారాలింపిక్స్లో షాట్ఫుట్ విసిరి సిల్వర్ మెడల్ పట్టేసిన దీప మాలిక్, దేశం గర్వించదగిన ప్రదర్శన చేసింది. ఎంతో మందిలో స్ఫూర్తి రగిల్చింది. పారాలింపిక్స్లో సిల్వర్ సాధించిన మూడో ఏడాదికి ఆమెను వెతుక్కుంటూ అత్యున్నత పురస్కారం వచ్చేసింది. రెజ్లింగ్ వరల్డ్ నం.1, టోక్యో ఒలింపిక్స్ మెడల్ రేసులో దూసుకెళ్తోన్న బజరంగ్ పూనియాతో పాటు దీప మాలిక్ ఈ ఏడాది రాజీవ్గాంధీ ఖేల్రత్న పురస్కారం అందుకోనుంది. 36 ఏండ్ల వయసులో షాట్ఫుట్ సాధన మొదలెట్టిన దీప మాలిక్, 45 ఏండ్ల వయసులో ఒలింపిక్ (పారా) మెడల్ సాధించింది. గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ క్రీడలు, జకర్తా ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన బజరంగ్ పూనియా నిరుడే ఖేల్రత్న ఆశించినా, నిరాశ ఎదురైంది. దీప మాలిక్ ఇప్పటికే పద్మ శ్రీ, అర్జున అవార్డులను అందుకుంది. ఐసీసీ 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ను విజయ తీరాలకు చేర్చేందుకు విఫల ప్రయత్నం చేసిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అర్జున అవార్డు అందుకోనున్నాడు. భారత కబడ్డీ జట్టు కెప్టెన్ అజరు ఠాకూర్, హెఫథ్లాన్ ఆసియా బంగారు పతక విజేత స్వప్న బర్మన్ సైతం అర్జున పురస్కారాలు దక్కించుకున్నారు. బ్యాడ్మింటన్ మాజీ వరల్డ్ నం.1 సైనా నెహ్వాల్ మాజీ కోచ్ విమల్ కుమార్కు ద్రోణాచార్య పురస్కారం లభించింది. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ పుట్టినరోజు ఆగస్టు 29 భారత్లో జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుతారు. ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో క్రీడా పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఆరు సార్లు వరల్డ్ చాంపియన్, దిగ్గజ బాక్సర్ మేరీకోమ్, ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియాలతో కూడిన 12 మంది క్రీడా అవార్డుల కమిటీ శనివారం అవార్డు విజేతల జాబితానుత క్రీడా మంత్రిత్వ శాఖకు అందజేసింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ముకుందకం శర్మ కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు.
క్రికెటర్ రవీంద్ర జడేజా సహా 19 మందికి అర్జున అవార్డులు ప్రకటించారు. జడేజా 156 వన్డేల్లో 2128 పరుగులు, 178 వికెట్లు కూల్చాడు. 42 టీ20ల్లో 135 పరుగులు, 32 వికెట్లతో రాణించాడు. 41 టెస్టుల్లో 1485 పరుగులు సహా 192 వికెట్లు తీశాడు. కబడ్డీ స్టార్ అజయ్ ఠాకూర్ అర్జున అవార్డుకు ఎంపికయ్యాడు. జాతీయ జట్టుతో పాటు పీకెఎల్లో తమిళ తలైవాస్కు ఠాకూర్ నాయకుడు. కాలుకు ఆరు వేళ్లతో ఇబ్బంది పడుతూనే హెఫథ్లాన్ రేసులో ఆసియా విజేతగా నిలిచిన స్వప్న బర్మన్ను సైతం అర్జున పురస్కారం వరించింది. తెలుగు తేజం బ్యాడ్మింటన్ ఆటగాడు బి. సాయిప్రణీత్ అర్జున అవార్డు అందుకోనున్నాడు. అనంతపురం కేంద్రంగా పనిచేస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి క్రీడల అభివృద్ది విభాగంలో రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహక పురస్కారం లభించింది. సైనా నెహ్వాల్ మాజీ కోచ్ విమల్ కుమార్ ద్రోణాచార్యకు ఎంపికయ్యారు. మేరీకోమ్ వ్యక్తిగత కోచ్ చోటేలాల్ యాదవ్ ద్రోణాచార్య రేసులో ఉండటంతో, ఆ సమయంలో మేరీకోమ్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు తలెత్తకుండా జాగ్రత్త వహించింది. నిబంధనల ప్రకారం అంతర్జాతీయ స్థాయిలో పతక ప్రదర్శనతో పాటు నాయకత్వ లక్షణాలు, క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని క్రీడా అవార్డులకు ఎంపిక చేస్తారు. మెరుగైన ప్రదర్శన చేసినా క్రమశిక్షణ ఆరోపణలు ఉంటే, సదరు అథ్లెట్/కోచ్ను అవార్డుకు ఎంపిక చేయరు.
2019 జాతీయ క్రీడా పురస్కారాలు :
రాజీవ్ గాంధీ ఖేల్రత్న : బజరంగ్ పూనియా (రెజ్లింగ్), దీప మాలిక్ (పారా అథ్లెటిక్స్)
ద్రోణాచార్య అవార్డు : విమల్ కుమార్ (బ్యాడ్మింటన్), సందీప్ గుప్తా (టేబుల్ టెన్నిస్), మోహిందర్ సింగ్ థిల్లాన్ (అథ్లెటిక్స్). మెర్బాజ్ పటేల్ (హాకీ), రాంబిర్ సింగ్ (కబడ్డీ), సంజరు భరద్వాజ్ (క్రికెట్) (జీవన సాఫల్య విభాగం).
అర్జున అవార్డు : తజిందర్పాల్ సింగ్ (అథ్లెటిక్స్), మహ్మద్ అనాస్ (అథ్లెటిక్స్), భాస్కరన్ (బాడీ బిల్డింగ్), సోనియా లాథర్ (బాక్సింగ్), రవీంద్ర జడేజా (క్రికెట్), చింగల్సన సింగ్ (హాకీ), అజరు ఠాకూర్ (కబడ్డీ), గౌరవ్ సింగ్ గిల్ (మోటార్ స్పోర్ట్స్), ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్, పారా), అంజుమ్ మోద్గిల్ (షూటింగ్), పూజ దండ (రెజ్లింగ్), మిర్జా (ఈక్వేస్ట్రియన్), గుర్ప్రీత్ సింగ్ సంధూ (ఫుట్బాల్), పూనమ్ యాదవ్ (క్రికెట్), స్వప్న బర్మన్ (అథ్లెటిక్స్), సుందర్ సింగ్ గుర్జార్ (అథ్లెటిక్స్, పారా), బి. సాయిప్రణీత్ (బ్యాడ్మింటన్), సిమ్రన్ సింగ్ (పోలో).
ధ్యాన్చంద్ అవార్డు : మాన్యూల్ ఫ్రెడ్రిక్స్ (హాకీ), అరూప్ బసక్ (టేబుల్ టెన్నిస్), మనోజ్ కుమార్ (రెజ్లింగ్), నితిన్ (టెన్నిస్), లాల్రెంసంగా (ఆర్చరీ).
రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహక పురస్కారం : రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్), గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ బడ్డింగ్ అండ్ యంగ్ టాలెంట్ ఫౌండేషన్, గో స్పోర్ట్స్.