Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేసులో సైనా, సింధు, శ్రీకాంత్
- నేటి నుంచి ప్రపంచ చాంపియన్షిప్స్
బసెల్ (స్విట్జర్లాండ్) : ప్రపంచ చాంపియన్షిప్స్లో తిరుగులేని రికార్డు. వరుసగా రెండు కాంస్య పతకాలు, మరోసారి వరుసగా రెండు రజత పతకాలు. రెండేసి సార్లు కాంస్య, రజతాలు అందుకున్న భారత బ్యాడ్మింటన్ సూపర్స్టార్ పి.వి సింధు ఈ ఏడాది స్వర్ణంపై రాకెటేసింది!. 2017 వరల్డ్ చాంపియన్షిప్స్ ఫైనల్లో నజొమి ఒకుహర (జపాన్)తో 110 నిమిషాల చారిత్రక సమరంలో సింధు సిల్వర్కు పరిమితమైంది. తర్వాత ఒలింపిక్ చాంపియన్ కరొలినా మారిన్ (స్పెయిన్) సింధుకు వరల్డ్ చాంపియన్షిప్ స్వర్ణం దూరం చేసింది. ఈ సీజన్లో ఫామ్లో లేకపోయినా, ఇండోనేషియా టైటిల్ పోరుకు చేరుకున్న తెలుగు తేజం స్విట్జర్లాండ్లో బంగారు పతకంపై కన్నేసింది. మహిళల సింగిల్స్లో సింధుకు తొలి రౌండ్లో బై లభించింది. క్వార్టర్ఫైనల్స్ వరకూ ఐదో సీడ్ సింధుకు పెద్ద ప్రమాదం లేదు. మరో ఎండ్లో మాజీ వరల్డ్ నం.1 సైనా నెహ్వాల్ సైతం క్వార్టర్స్ వరకూ ప్రత్యర్థులను చిత్తు చేయగలిగితే తొలిసారి వరల్డ్ చాంపియన్షిప్ సెమీఫైనల్లో భారతీయ షట్లర్లు తలపడే అవకాశం ఉంది. ఎనిమిదో సీడ్ సైనాకు సైతం తొలి రౌండ్లో బై లభించింది. క్వార్టర్ఫైనల్లో ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్, చైనా స్టార్ చెన్ యుఫెరుతో సైనా నెహ్వాల్ తలపడే అవకాశం కనిపిస్తోంది. సైనా, సింధులు మంగళవారం పసిడి వేటను మొదలెట్టనున్నారు.
గాయాల బెడద : పురుషుల సింగిల్స్లో మాజీ వరల్డ్ నం.1, సూపర్ టైటిళ్ల వేటగాడు కిదాంబి శ్రీకాంత్ ఇటీవల దారుణ ఫామ్లో కొనసాగుతున్నాడు. 22 మాసాలుగా అతడు డబ్ల్యూబీఎఫ్ టూర్ టైటిల్ సాధించలేదు. చివరగా మార్చిలో జరిగిన ఇండియా ఓపెన్ ఫైనల్స్కు చేరుకున్నాడు. గాయాల నుంచి కోలుకున్న శ్రీకాంత్ బసెల్లో పూర్తి స్థాయి ఆట ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాడు. మేటి ఆటగాళ్లు ప్రతిష్టాత్మక టోర్నీల్లో, కఠిన ప్రత్యర్థులతో మ్యాచుల్లో పూర్వ వైభవం సాధించటం చూస్తూనే ఉన్నాం. కిదాంబి శ్రీకాంత్ విషయంలోనూ ఇదే జరిగే అవకాశం లేకపోలేదు!. నేడు తొలి రౌండ్లో ఐర్లాండ్ ఆటగాడిని ఎదుర్కొనున్నాడు. మోకాలి గాయం నుంచి కోలుకున్న శ్రీకాంత్కు వరల్డ్ చాంపియన్షిప్ కఠిన సవాల్. సమీర్ వర్మ సైతం భుజం గాయంతో ఇబ్బంది పడుతున్నా.. వరల్డ్ చాంపియన్షిప్స్లో మెరుగైన ప్రదర్శన ఆశిస్తున్నాడు. నేడు సింగపూర్ షట్లర్ లోహ్ కీన్తో వర్మ ఆడనున్నాడు. అర్జున అవార్డు ఉత్సాహంలో ఉన్న బి. సాయిప్రణీత్కు తొలి రౌండ్లో కెనడా షట్లర్ జేసన్ ఆంటోనీ సవాల్ విసరనున్నాడు. ఫిన్లాండ్ ఆటగాడు హీనోతో హెచ్.ఎస్ ప్రణరు ఆడనున్నాడు.
పురుషుల డబుల్స్లో సాత్విక్సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ పోటీ నుంచి వైదొలిగింది. కెరీర్లో తొలి బిడబ్ల్యూఎఫ్ 500 టైటిల్ సాధించిన ఈ జోడీ గాయాలతో వరల్డ్ చాంపియన్షిప్కు దూరమైంది. మను అత్రి, సుమీత్ రెడ్డి జోడీ, ఎం.ఆర్ అర్జున్, రామచంద్రన్లు మెన్స్ డబుల్స్లో పోటీపడుతున్నారు. మహిళల డబుల్స్లో సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప సహా జక్కంపూడి మేఘన, పూజ దండు బరిలో ఉన్నారు. మిక్స్డ్ డబుల్స్లో ప్రణవ్ జెర్రీ చొప్రా, సిక్కి రెడ్డి జంట నేడు తొలి రౌండ్లో అదృష్టం పరీక్షించుకోనుంది.