Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళల క్రికెట్ అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు మన మిథాలీరాజ్ది. మహిళల క్రికెట్కు ఏమాత్రం గుర్తింపులేని రోజుల్లో భారత మహిళల క్రికెట్లో ఎన్నో రికార్డులను తనపేర లిఖించుకోవడమే గాకుండా అంతర్జాతీయస్థాయిలో గుర్తింపునూ సంపాదించిపెట్టారు. ఆ తర్వాత మరెందరో మహిళా క్రికెటర్లు వెలుగులోనికి వచ్చినా మిథాలీ స్థానాన్ని పెద్దగా ఎవ్వరూ భర్తీచేయలేకపోయారు. కానీ అనుకోని కారణాలవల్ల ఓ ఫార్మాట్నుంచి అర్ధాంతరంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు మిథాలీరాజ్.
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్కు అందుబాటులో ఉంటానని చెప్పిన మిథాలీరాజ్ వారం తిరగకుండానే తాను ఆ ఫార్మాట్కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత్ జట్టును ప్రకటించడానికి ముందుగానే మిథాలీ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. భారత్ తరఫున 89 టీ20 మ్యాచ్లు ఆడిన మిథాలీ... 32 మ్యాచ్లకు కెప్టెన్గానూ వ్యవహరించారు. అంతేగాక మూడు టీ20 ప్రపంచకప్లలోనూ మిథాలీరాజ్ పాల్గొన్నారు. 2012 ప్రపంచకప్తో పాటు, 2014, 2016 వరల్డ్కప్లకు ఆమె సారథిగా పనిచేశారు. ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్తో జరిగిన టీ20 మ్యాచ్ మిథాలీకి చివరిది. ఆ మ్యాచ్లో మిథాలీ రాజ్ 32 బంతుల్లో అజేయంగా 30 పరుగులు చేశారు. మొత్తంగా టీ20ల్లో మిథాలీ రాజ్ 2,364 పరుగులు చేశారు. ఇందులో 17 అర్ధ సెంచరీలున్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో ఆమె అత్యుత్తమ స్కోరు 97 నాటౌట్. రిటైర్మెంట్పై మిథాలీ మాట్లాడుతూ.. '2006 నుంచి భారత్ తరఫున టీ20లు ఆడుతున్నా. టీ20లతో పనిభారం ఎక్కువగా ఉండటంతో రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నా. 2021 వన్డే వరల్డ్కప్కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడంపైనే దృష్టి సారించా. భారత్కు వరల్డ్కప్ను అందించడమే నా కల. ఇందుకోసం నా శాయశక్తులా కష్టపడతా. టీ20 సిరీస్కు సిద్ధమవుతున్న భారత జట్టుకు ఇవే నా శుభాకాంక్షలు' అని మిథాలీ పేర్కొన్నారు.
మిథాలీ ఎందుకిలా?
వారం రోజుల క్రితం తాను దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్కు అందుబాటులో ఉంటానని ప్రకటించారు మిథాలీ. మరి ఇంతలోనే మిథాలీ టీ20లకు గుడ్ బై చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. అయితే యువ క్రీడాకారిణులకు పెద్ద పీట వేయాలనే ఆలోచనలో ఉన్న మహిళా టీమ్ మేనేజ్మెంట్.. సఫారీలతో సిరీస్కు మిథాలీని ఎంపిక చేసేందుకు సుముఖంగా లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దాంతో మిథాలీ ముందుగానే ఉన్నపళంగా రిటైర్మెంట్ ప్రకటించి ఉండవచ్చని తెలుస్తోంది.