Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: టీమిండియా బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన అనంతరం సంజయ్ బంగర్ ప్రవర్తించిన తీరు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)కి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మిగతా కోచింగ్ సిబ్బందికి పొడిగింపు ఇచ్చి తనను విస్మరించినందుకు రగిలిపోయిన బంగర్ ఇటీవలి వెస్టిండీస్ పర్యటనలో జట్టుతో పాటు ఉన్న జాతీయ సెలక్టర్ దేవాంగ్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. హోటల్లోని దేవాంగ్ గాంధీ గదికి వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఈ విషయమంతా బోర్డు దృష్టికి వచ్చింది.దీంతో బంగర్ ను ప్రశ్నించాలని బిసిసిఐ నిర్ణయించింది. అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ సునీల్ సుబ్రమణియన్, చీఫ్ కోచ్ రవిశాస్త్రిలను ఘటనపై నివేదిక కోరింది. బంగర్ ఆవేదనలో అర్థం ఉన్నా సెలక్టర్లను ప్రశ్నించే హక్కు అతడికి లేదని స్పష్టంచేసింది. 'రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ల పనితీరు బాగున్నం దుకే కొనసాగింపు ఇచ్చాం. అదేమీ లేని బంగర్ మళ్లీ అవకాశం దక్కుతుందని ఎలా అనుకుంటాడు? ఎవరైనా సరే నిబంధనలు పాటించాల్సిందే. జట్టు మేనేజ్మెంట్ నివేదిక వచ్చాక దానిని క్రికెట్ పాలకుల కమిటీ (సిఒఏ) ముందుంచుతాం' అని బోర్డు అధికారి ఒకరు స్పష్టం చేశారు.
బిసిసిఐని నిలదీసిన సౌరాష్ట్ర క్రికెటర్
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ)ను ప్రశ్నించడం లేదంటూనే బోర్డుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు సౌరాష్ట్ర రంజీ క్రికెటర్ షెల్డాన్ జాక్సన్. కొన్నేళ్లుగా సౌరాష్ట్ర ఆటగాళ్లు నిలకడైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ తమ జట్టు నుంచి ఏ ఒక్క ఆటగాడ్ని దులీప్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టాడు. 'మీకు మా ఆటగాళ్లు ప్రదర్శన కనబడలేదా.. లేక చిన్న జట్టే కదా అని మాపై చిన్నచూపా. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో ఫైనల్కు చేరాం. కానీ మా జట్టు నుంచి ఏ ఒక్క ఆటగాడ్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. కనీసం 'ఏ' సిరీస్లకు కూడా మమ్మల్ని ఎంపిక చేయడం లేదు. ఇదేనా మీరు రంజీ ట్రోఫీ ఫైనల్స్కు ఇచ్చే ప్రాముఖ్యత అని బిసిసిఐపై ధ్వజమెత్తాడు. సౌరాష్ట్ర తరఫున ప్రతిభ చాటుకుంటున్న క్రికెటర్లలో జాక్సన్ ఒకడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 50.00 సగటుతో దూసుకుపోతున్నాడు. స్వతహాగా వికెట్కీపర్ మరియు బాట్స్మన్ అయిన జాక్సన్.. కోల్కతా నైట్రైడర్స్ తరఫున ఐపీఎల్ కూడా ఆడాడు.