Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రాండ్స్లామ్ టోర్నీలో 33వ సారి సెమీస్కు
న్యూయార్క్: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ యుఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో రెండో సీడ్ నాదల్ 6-4, 7-5, 6-2 తేడాతో డీగో స్వాట్జ్మన్(అర్జెంటీనా)పై గెలిచిసెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. తొలి సెట్ను గెలిచిన నాదల్కు రెండో సెట్లో కఠినపరీక్ష ఎదురైంది. ఆ సెట్లో స్వాట్జ్మన్ అద్భుతమైన ఏస్లు, రిటర్న్ షాట్లతో చెలరేగిపోయాడు. ఫలితంగా రెండోసెట్ హోరాహోరీగా సాగింది. ఇక మూడోసెట్లో దూకుడుగా ఆడిన నాదల్.. స్వాట్జ్మన్కు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. వరుస పాయింట్లు సాధించి మూడో సెట్ను సునాయాసంగా గెలవడమే కాకుండా మ్యాచ్ను సొంతం చేసుకుని సెమీస్లోకి ప్రవేశించాడు. దాంతో నాదల్ గ్రాండ్స్లామ్ టోర్నీల్లో 33వసారి సెమీఫైనల్కు చేరినట్లైంది. ఓవరాల్గా అత్యధికసార్లు గ్రాండ్స్లామ్ సెమీ ఫైనల్స్కు చేరిన జాబితాలో రోజర్ ఫెదరర్(45) అగ్రస్థానంలో ఉండగా, నొవాక్ జొకోవిచ్(36) రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో నాదల్ నిలిచాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇప్పటికే రోజర్ ఫెడరర్, జొకోవిచ్లు ఇంటిదారి పట్టడంతో నాదల్ మరో గ్రాండ్స్లామ్ టైటిల్ రేసులో ముందంజలో ఉన్నాడు. ఇప్పటివరకూ మూడుసార్లు యూఎస్ ఓపెన్ను గెలిచిన నాదల్ శనివారం జరిగే సెమీఫైనల్లో మాట్టే బెర్టెన్స్(ఇటలీ)తో తలపడనున్నాడు. ఇతర క్వార్టర్ఫైనల్ పోటీల్లో ఇటలీకి చెందిన 24వ సీడ్ బెర్రెట్టిని 3-6, 6-3, 6-2, 3-6, 7-6(7-5)తో మోన్ఫీల్(ఫ్రాన్స్)పై చెమటోడ్చి నెగ్గాడు.
ఇక మహిళల సింగిల్స్లో 13వ సీడ్ బెన్సిక్(ఇంగ్లండ్) 7-6(7-5), 6-3తో వేకిక్(క్రొయేషియా)పై గెలుపొందగా... 8వ సీడ్ అమెరికాకు చెందిన సెరేనా 6-1, 6-0తో వాంగ్(చైనా)ను చిత్తుచేసింది. హోరాహోరీగా సాగిన నాల్గో క్వార్టర్ఫైనల్ పోటీలో ఆండ్రెస్కూ(కెనడా) 3-6, 6-2, 6-3తో బెల్జియంకు చెందిన మెర్టెన్స్ను చిత్తుచేసి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది.