Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెస్టుల్లో రాణిస్తున్న కాకినాడ కుర్రాడు
నవతెలంగాణ క్రీడా విభాగం
కాకినాడకు చెందిన హనుమ విహారి ఇటీవల వెస్టిండీస్తో ముగిసిన రెండు టెస్ట్ల సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనకు బిసిసిఐ టీ20, వన్డే, టెస్టులకు విడి విడిగా మూడు జట్లను ఎంపిక చేసి కొత్త ప్రయోగానికి నాంది పలికింది. టెస్టుల్లో మాత్రమే చోటు దక్కించుకున్న మన విహారి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్గా బరిలోకి దిగి 96.53 సగటుతో 289(32, 93, 111, 53) పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, మరో రెండు అర్ధశతకాలున్నాయి. ఇక వైస్ కెప్టెన్ అజింక్యా రహానె 271(81, 102, 24, 64) పరుగులు చేసి రెండోస్థానంలో నిలిచాడు. విండీస్తో రెండోటెస్టులో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికైన విహారిపై కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. రెండో టెస్ట్ రెండు ఇన్నింగ్స్లోనూ టాప్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకొచ్చాడు. విహారికి ఎంతో భవిష్యత్తు ఉందని, బిసిసిఐ టెస్టుల్లోకి తీసుకోవడంతో విహారి తన ఆటతో సమాధానం చెప్పాడని ప్రశంసల్లో ముంచెత్తాడు. దీంతో విహారి పేరు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కడంతోపాటు టెస్టుల్లో విహారి ఎంపిక సరైందనని బ్యాట్తో సమాధానం చెప్పాడు.
ఎమెస్కే సలహాతో ఆంధ్రాకు...
హైదరాబాద్ తరఫున నిలకడగా ఆడిన విహారి ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సూచన మేరకు ఆంధ్రాకు మారాడు. ఆంధ్ర జట్టు తరఫున కోచ్ భరత్ అరుణ్ పర్యవేక్షణలో అండర్-19 జట్టులో ఆడాడు. హైదరాబాద్లో మాత్రం ఆర్. శ్రీధర్వద్ద శిక్షణ తీసుకున్నాడు. 12ఏళ్ల వయసులోనే నాన్న చనిపోవడంతో హైదరాబాద్లో స్థిరపడాల్సి వచ్చింది. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో హైదరాబాద్లోని సెయింట్ జాన్స్ స్కూల్ యాజమాన్యం ఒక్క పైసా ఫీజు తీసుకోకుండా విద్యాభ్యాసం పూర్తి చేయించింది. కాలేజీ చదివే రోజుల్లో క్రికెట్, చదువు రెండూ భారం కావడంతో చదువును ప్రక్కన పెట్టేసి క్రికెట్పైనే విహారి ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లోకి 17 ఏళ్ల ప్రాయంలోనే అరంగేట్రం చేసిన విహారి తొలుత ఫిట్నెస్పైనే దృష్టి సారించాడు. రంజీల్లో ప్రతి ఏడాది వెయ్యికి పైగా పరుగులు సాధిస్తూనే ఉన్నాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 59.30 యావరేజ్తో 18 శతకాలు 29 అర్ధశతకాలతో 6,108 పరుగులు చేశాడు.
టెస్టుల్లో గత ఏడాది సెప్టెంబర్లో ఇంగ్లండ్పై అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకూ కెరీర్లో కేవలం 6 టెస్టులు మాత్రమే ఆడిన విహారి తొలి నాలుగు టెస్టుల్లో అంతగా రాణించలేకపోయాడు. ముందు ఆడిన నాలుగు టెస్టుల్లో కేవలం ఒక్క అర్ధశతకం మాత్రమే సాధించగలిగాడు. కానీ వెస్టిండీస్ పర్యటనలో రెండు అర్ధశతకాలు, ఒక సెంచరీ బాదాడు. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున 2013, 2015 సీజన్లలో ఆడిన విహారి 2019లో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్కు ఎంపికయ్యాడు.