Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓపెనర్గా రోహిత్కు అవకాశం
- కెఎల్ రాహుల్పై సెలక్టర్ల వేటు
- ఫ్రీడం సిరీస్కు భారత జట్టు ప్రకటన
నవతెలంగాణ-ముంబయి
భారత క్రికెట్ భవిష్యత్ కెరటం, వర్థమాన ఆటగాళ్లలో అత్యంత ప్రతిభావంతుడు, పంజాబ్ యువ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్కు తొలి పిలుపు అందింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో లోపరహిత ఇన్నింగ్స్లతో చెలరేగుతున్న యువ బ్యాట్స్మన్కు సెలక్షన్ కమిటీ రికార్డు అందించింది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడనున్న మూడు టెస్టుల ఫ్రీడం సిరీస్కు శుభ్మన్ గిల్ను ఎంపిక చేసింది. దేశవాళీ క్రికెట్లో తిరుగులేని ప్రదర్శనలతో కరీబియన్ పర్యటనలోనే జట్టులో చోటు ఆశించిన గిల్, అప్పుడు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తిరువనంతపురంలో దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో నాలుగు రోజుల అనధికార టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 90 పరుగులు చేసి శుభ్మన్ గిల్, తొలిసారి భారత టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. అవకాశాలు లభించినా, నిలకడ లేని ప్రదర్శనలతో నిరాశపరుస్తున్న ఓపెనర్ కెఎల్ రాహుల్ స్థానంలో శుభ్మన్ గిల్ టీమ్ ఇండియాకు ఎంపికయ్యాడు. టెస్టుల్లో లోయర్ ఆర్డర్ బ్యాట్స్మన్గానే పరిగణించబడుతున్న రోహిత్ శర్మకు, ఇన్నింగ్స్ ఆరంభించేందుకు ఓ అవకాశం ఇవ్వాలని సెలక్షన్ కమిటీ భావించింది. ఈ నేపథ్యంలో ఓపెనర్ రాహుల్ స్థానంలో ఎంపికైనా శుభ్మన్ గిల్కు నేరుగా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పలేం. మూడో ఓపెనర్గా, మిడిల్ ఆర్డర్ బ్యాకప్ బ్యాట్స్మన్గా శుభ్మన్ గిల్ ఉపయుక్తంగా ఉంటాడని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యానించాడు. అక్టోబర్ 2 నుంచి గాంధీ-మండేలా ఫ్రీడం సిరీస్ విశాఖపట్నం టెస్టుతో ఆరంభం కానుంది. పుణె, రాంచీ వేదికగా చివరి రెండు టెస్టులు జరుగనున్నాయి. మూడు మ్యాచుల టెస్టు సిరీస్లో పాల్గొనే 15 మందితో కూడిన భారత జట్టును సీనియర్ సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది.
రోహిత్కు ఓ అవకాశం : ఐదు రోజుల ఆటలో 2010లోనే అరంగేట్రం చేయాల్సిన రోహిత్ శర్మ, అనూహ్య చీలమండ గాయంతో తొలి ఆట మూడేండ్లకు వాయిదా పడింది. సచిన్ టెండూల్కర్ వీడ్కోలు సిరీస్లో వెస్టిండీస్పై అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ.. ఎర్ర బంతిపై వస్తూనే శతకాల మోత మోగించాడు. ఐదు రోజుల ఆటకు సిద్ధమేనని తిరుగులేని ఇన్నింగ్స్లతోనే చాటిచెప్పాడు. కానీ స్వింగ్ బంతిపై మెరుగ్గా ఆడలేని అసక్తత రోహిత్ శర్మను 27 టెస్టులకే పరిమితం చేసింది. టెస్టుల్లో 47 ఇన్నింగ్స్ల్లో 39.62 సగటుతో 1585 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. కరీబియన్ పర్యటనలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్గా అజింక్య రహానె, హనుమ విహారిలతో తుది జట్టులో చోటు కోసం పోటీపడ్డాడు. వెస్టిండీస్పై రహానె, విహారి కండ్లుచెదిరే ప్రదర్శన చేశారు. రోహిత్ శర్మ బెంచ్కు పరిమితం అయ్యాడు. ఇదే సమయంలో ఓపెనింగ్లో భారత్ సమస్యలు చవిచూసింది. నాలుగు ఇన్నింగ్స్ల్లోనూ కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఆశించిన ఆరంభాలను అందించలేదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో తిరుగులేని ఓపెనర్ రోహిత్ శర్మను, టెస్టుల్లోనూ ఓపెనర్గా ఎందుకు ఉపయోగించకూడదు? అని సెలక్షన్ కమిటీ భావించింది. అందుకే దక్షిణాఫ్రికాతో సిరీస్లో రోహిత్ శర్మకు ఓపెనర్గా ఓ అవకాశం ఇవ్వాలని సెలక్షన్ కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చినట్టు చీఫ్ సెలక్టర్ ప్రసాద్ వెల్లడించారు.
శుభ్మన్కు శుభవార్త : భారత అండర్-19 ప్రపంచ కప్ విజయ నిర్మాత, ప్రతిభావంతుడైన బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్ తొలిసారి టెస్టు జట్టులోకి ఎంపికయ్యాడు. వన్డేల్లో రెండు మ్యాచుల్లో ప్రాతినిథ్యం వహించిన గిల్, అంచనాలను అందుకోలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో నిలకడగా కండ్లుచెదిరే ప్రదర్శన చేస్తున్న గిల్కు సెలక్టర్లు ఐదు రోజుల ఆటలో ఆడే అవకాశం అందించారు. 14 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో గిల్ 1443 పరుగులు చేశాడు. 72.15 సగటు, 74.84 స్ట్రయిక్ రేట్తో విశేషంగా ఆకట్టుకున్నాడు. 2018-19 రంజీ సీజన్లో పంజాబ్ తరఫున ఐదే మ్యాచులు ఆడినా.. ఏకంగా 104 సగటుతో 728 పరుగులు చేశాడు. వెస్టిండీస్ పర్యటనలో భారత్-ఏ తరఫున 268 పరుగులతో కెరీర్ తొలి ద్వి శతకం నమోదు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో నాలుగు సెంచరీలు, ఎనిమిది అర్ధ సెంచరీలతో సత్తా చాటాడు. టాప్ ఆర్డర్లో ఓపెనింగ్ జోడీ మార్పుతో మూడో ఓపెనర్గా శుభ్మన్ గిల్ ఉపయుక్తమైన బ్యాట్స్మన్ అవుతాడని చీఫ్ సెలక్టర్ ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. మిడిల్ ఆర్డర్లోనూ గిల్ ప్రయోజకరమైన ఆటగాడని కితాబిచ్చాడు.
తొలి ప్రాధాన్య వికెట్ కీపర్గా రిషబ్ పంత్ చోటు నిలుపుకున్నాడు. సీనియర్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా సైతం జట్టులో కొనసాగుతున్నాడు. బౌలింగ్ బృందంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లు చోటు నిలుపుకున్నారు. టెస్టు సిరీస్కు ఆతిథ్య వేదికలు వైజాగ్, పుణె, రాంచీలు స్పిన్కు అనుకూలం. దీంతో ముగ్గురు స్పిన్నర్లు కీలక భూమిక వహించనున్నారు. పేస్ విభాగంలో జశ్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మలు కొనసాగటంతో ఉమేశ్ యాదవ్కు నిరాశ తప్పలేదు. కరీబియన్ పర్యటనకు విశ్రాంతి పొందిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు, తాజా టెస్టు జట్టులో చోటు దక్కకపోవటం గమనార్హం.
దక్షిణాఫ్రికాతో ఫ్రీడం సిరీస్కు భారత టెస్టు జట్టు : విరాట్ కోహ్లి (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజార, అజింక్య రహానె (వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వృద్దిమాన్ సాహా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, జశ్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి.
దక్షిణాఫ్రికా-ఏతో టెస్టు కోసం తిరువనంతపురంలో ఉన్నాను. రూమ్లోకి రాగానే, ఈ వార్త చెప్పారు. వెంటనే ఫోన్ చూసుకున్నాను. అది మెసెజ్లు, ఫోన్ కాల్స్తో పోటెత్తింది. ఇప్పుడెంతో సంతోషంగా ఉంది. అవకాశం లభిస్తే, నా ఉత్తమ ప్రదర్శన కనబరుస్తా. కోహ్లి సారథ్యంలో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాను. ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాను. కరీబియన్ పర్యటనకు మిస్ అయ్యానని తెలుసు. కానీ ఇది పెద్ద అవకాశం. సెలక్టర్లుకు ధన్యవాదాలు. ఏ స్థానంలో ఆడాలనే ఆలోచన లేదు. జట్టు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఆడేందుకు సిద్ధం. ఓపెనర్గా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్గా ఎక్కడ కోరినా ఆడతాను'
- శుభ్మన్ గిల్
అవును, రోహిత్ శర్మను ఓపెనర్గా చూడాలని అనుకుంటున్నాం. అందుకు అతడికి ఓ అవకాశం ఇవ్వాలని నిర్ణయించాం. రోహిత్ సైతం అందుకు ఆసక్తిగా ఉన్నాడు, సెలక్షన్ కమిటీ అంతే ఉత్సుకతతో ఉంది. బ్యాటింగ్ లైనప్లో అతడికి ముందుకు పంపించి, కొన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటాం. వన్డే, టీ20ల్లో 2013 నుంచి ఓపెనర్గా ఆడుతున్నాడు. టెస్టుల్లోనూ ఓపెనర్గా రాణించే సత్తా రోహిత్కు ఉందని సెలక్షన్ కమిటీ భావించింది. వార్మప్ మ్యాచుల్లో ప్రదర్శన రోహిత్ శర్మకు ఆత్మ విశ్వాసం అందిస్తుందని అనుకుంటున్నాం.
- రోహిత్ శర్మపై చీఫ్ సెలక్టర్ ప్రసాద్
శుభ్మన్ గిల్ ఓపెనర్గా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్గా చక్కగా రాణిస్తున్నాడు. ఈ రెండు విభాగాలకూ గిల్ బ్యాకప్ బ్యాట్స్మన్గా ఉపయుక్తం
- గిల్పై చీఫ్ సెలక్టర్ ప్రసాద్
కెఎల్ రాహుల్కు చాలినన్ని అవకాశాలు ఇచ్చాం. అయినా, నిలకడగా రాణించలేదు. అందుకే అతడిని తప్పించాం. ధావన్, విజయ్ జట్టుకు దూరమయ్యారు. ఈ సమయంలో ఇద్దరు ఓపెనర్లను మార్చటం మంచిది కాదు. రాహుల్ మూడు ఫార్మాట్ల ఆటగాడు, మెరుగ్గా ఆడితే అతడు మళ్లీ అవకాశం అందుకుంటాడు. ఫామ్లో ఉండగా రాహుల్ చూడచక్కని ఆటగాడు. వైఫల్యంలోనూ రాహుల్ను దన్నుగా నిలిచాం. అన్ని విభాగాల్లోనూ రిజర్వ్ బలాన్ని బలోపేతం చేయాలని భావిస్తున్నాం.
- రాహుల్పై చీఫ్ సెలక్టర్ ప్రసాద్