Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, దక్షిణాఫ్రికా తొలి టీ20 నేడు
- హాట్ ఫేవరెట్గా టీమ్ ఇండియా
- కొత్త రక్తంతో సఫారీ నూతనోత్తేజం
- పొంచి ఉన్న వరుణుడి ముప్పు!
- రాత్రి 7 నుంచి స్టార్స్పోర్ట్స్లో..
నవతెలంగాణ-ధర్మశాల
2020 టీ20 ప్రపంచకప్ సన్నాహకం దిశగా టీమ్ ఇండియా అప్పుడే ఓ పరీక్ష ముగించుకుంది. కరీబియన్ పర్యటనలో టీ20 సిరీస్లో తుది జట్టు ఎలా ఉండాలనే విషయంపై ఓ ట్రయల్ వేసింది. నాయకత్వ మార్పుతో మొదలైన సఫారీ ప్రక్షాళన, 2020 పొట్టి ప్రపంచకప్ దిశగా వేగంగా సాగుతోంది. ధర్మశాలలో ధనాధన్ సమరానికి భారత్, దక్షిణాఫ్రికా సిద్ధమవుతున్నా మనసంతా 2020 ప్రపంచకప్పైనే నెలకొంది!.
వన్డే క్రికెట్లో భాగంగా టీ20ని పరిగణించిన టీమ్ ఇండియా, అందుకు 2016 టీ20 ప్రపంచకప్లో భారీ మూల్యం చెల్లించుకుంది. బౌండరీల కంటే వికెట్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ఓటమిని కౌగిలించుకుంది. ఇప్పుడు ఆ మూస వైఖరి నుంచి కోహ్లిసేన బయటకు వచ్చేందుకు బలమైన ప్రయత్నం చేస్తోంది. ధనాధన్లో వేగం పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. నేడు భారత్, దక్షిణాఫ్రికా తొలి టీ20 పోరు.
2019 ప్రపంచకప్ ఓటమి నుంచి తేరుకున్న టీమ్ ఇండియా..కరీబియన్ పర్యటనలో క్లీన్స్వీప్ విజయాలతో జోరందుకుంది. మరోవైపు ప్రపంచకప్లో ఊహించని పరాభవాన్ని చవిచూసిన దక్షిణాఫ్రికా, భవిష్యత్ దిశగా నిర్మాణాత్మక అడుగులు వేసేందుకు ఇప్పుడిప్పుడే సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికాకు యువ ఆటగాడు క్వింటన్ డికాక్ నాయకత్వం వహించనున్నాడు. వచ్చే రెండేండ్లలో రెండు ప్రపంచకప్లకు నాయకత్వం వహించేందుకు రంగం సిద్ధం చేసుకున్న డికాక్, తన సైన్యాన్ని ఎంచుకునేందుకు భారత్తో సిరీస్ను వేదికగా మలచుకోనున్నాడు. పొట్టి ఫార్మాట్లో ఎదురులేని జట్టు వెస్టిండీస్ను చిత్తు చిత్తుగా ఓడించిన కోహ్లిసేన సొంతగడ్డపై కోరల్లేని దక్షిణాఫ్రికాపై హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. మూడు మ్యాచుల టీ20 సిరీస్లో నేడు ధర్మశాల వేదికగా తొలి ధనాధన్ సమరం.
మార్పు కోసం మార్పు! : వన్డే క్రికెట్లో భారత టాప్ ఆర్డర్కు తిరుగులేదు. కానీ టీ20ల్లో టాప్ ఆర్డర్ అవసరమైన వేగం అందుకోవటం లేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్లు ఒకే శైలిలో ఆడుతున్నారు. ఆరంభంలో చాలా నెమ్మదిగా పరుగులు చేస్తున్నారు. భారీ ఇన్నింగ్స్లు ఆడితేనే వీరి స్ట్రయిక్ రేట్ మెరుగైన స్థాయిలో ఉంటుంది. ఐపీఎల్లో గత ఐదేండ్లుగా కోహ్లి, రోహిత్, ధావన్ స్ట్రయిక్ రేట్ వరుసగా 127.67, 127.33, 126.17. టీ20 ఫార్మాట్లో టాప్ ఆర్డర్ నెమ్మదిగా ఆడుతుండటం భారీ స్కోర్ల సాధనపై ప్రభావం చూపుతోంది. క్రీజులో నిలిచిన వేళ రోహిత్, కోహ్లి మెగా ఇన్నింగ్స్లు ఆడుతున్నారు. అది వీలుకాని వేళ భారత స్కోరు దారుణంగా పడిపోతుంది. మిడిల్ ఆర్డర్లో రిషబ్ పంత్, మనీశ్ పాండే, శ్రేయాష్ అయ్యర్, కెఎల్ రాహుల్ ఉన్నారు. వీరూ ఐపీఎల్లోనే కాదు అంతర్జాతీయ మ్యాచుల్లోనూ అదే వేగం చూపించగలరు. లోయర్ ఆర్డర్లో హార్దిక్ పాండ్య విధ్వంసక సామర్థ్యం భారత్కు మరింత సానుకూలం. టాప్ ఆర్డర్లో రోహిత్, కోహ్లి, ధావన్లలో ఒకరు తమ శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ముగ్గురులో ఏ ఒక్కరైనా తొలి బంతి నుంచీ ఊచకోత మొదలెట్టాలి. అప్పుడే టీ20 శైలికి తగిన రీతిలో టీమ్ ఇండియా స్కోరు ఉంటుంది. బౌలింగ్ విభాగంలో ప్రస్తుతానికి భారత్ యువ ఆటగాళ్లను ప్రయోగిస్తుంది. ప్రపంచకప్లో వీరు ఆడతారా? లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. స్టార్ సీమర్ జశ్ప్రీత్ బుమ్రా, సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్లు జట్టులో లేరు. ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ షైనిలు కరీబియన్ పర్యటనలో ఆకట్టుకున్నారు. రాహుల్ చాహర్, వాషింగ్టన్ సుందర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. హార్దిక్ పాండ్య రాకతో ఆల్రౌండర్ల ఎంపికలో కొలమానం మారనుంది. రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్యలలో ఒకరు బెంచ్కు పరిమితం కావాల్సిందే.
సఫారీ కొత్త అడుగు : ప్రపంచకప్ దారుణ ఓటమి తర్వాత దక్షిణాఫ్రికా టీ20 జట్టులో కీలక మార్పులు చేసింది. సీనియర్ ఆటగాళ్లను పొట్టి ఫార్మాట్ నుంచి తప్పించింది. డికాక్ సారథ్యంలో సఫారీ టీ20 సవాల్కు సిద్ధమవుతోంది. సీనియర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ డెవిడ్ మిల్లర్ సహకారం డికాక్కు లభించనుంది. తంబ బవుమా, హెన్రిక్స్, వాన్డర్ డసెన్లు బ్యాటింగ్ లైనప్లో కీలకం. బంతితో మెరుపు సీమర్ కగిసో రబాడ భారత్కు సవాల్ విసరనున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున విశేషంగా రాణించిన రబాడ టీ20 సిరీస్లో అదే వేడి చూపించాలని ఆశిస్తున్నాడు. జూనియర్ డలా అంతర్జాతీయ వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రిటోరియస్, ఫెలుక్వయో, షంషి రూపంలో దక్షిణాఫ్రికాకు మెరుగైన బౌలింగ్ బృందం అండ ఉంది.
పిచ్, వాతావరణం : ధర్మశాల సహజంగా పేస్ అనుకూల వికెట్. ఇక్కడ సంప్రదాయ పేస్, స్వింగ్కు గొప్ప సహకారం లభిస్తుంది. అనూహ్యంగా స్పిన్న ర్లకూ సహకరించే గుణం ధర్మశాల వికెట్ సొంతం. ప్రస్తుతం ఇక్కడ వర్షాలు కురుస్తున్నాయి. పిచ్పై ఎక్కువగా సూర్యరశ్మి పడలేదు. దీంతో నేటి మ్యాచ్లో సీమర్లకు మరింత దండిగా సహకారం లభించనుంది. తొలుత బ్యాటింగ్ చేయటమే మేలు. కానీ ఇక్కడ 200 లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన రికార్డు దక్షిణాఫ్రికా సొంతం.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, మనీశ్ పాండే, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, నవదీప్ షైని, ఖలీల్ అహ్మద్.
దక్షిణాఫ్రికా : క్వింటన్ డికాక్, తంబ బవుమా, రీజా హెన్రిక్స్, డెవిడ్ మిల్లర్, వాన్డర్ డసెన్, కగిసో రబాడ, ఫెలుక్వయో, షంషి, జూనియర్ డలా, జెజె స్మట్స్, ప్రిటోరియస్.