Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధర్మశాల : స్వదేశంలో చాలాకాలం తర్వాత ఓ అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలని అభిలషించిన ఆటగాళ్లకు, ప్రత్యక్షంగా వీక్షించాలని ఆశపడ్డ ప్రేక్షకులకు మధ్య వరణుడు అడ్డుగా నిలిచాడు. ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా టాస్ వేయకుండానే రద్దు అయ్యింది. మధ్యాహ్నం నుంచి మ్యాచ్ ప్రారంభమయ్యే వరకూ జోరున వర్షం కురుస్తుండడంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. సాయంత్రం కొంతసేపు వరణుడు కరుణించడంతో మైదాన సిబ్బంది రంగంలోకి దిగి మ్యాచ్కు సిద్ధం చేయడానికి ప్రయత్నించారు. కానీ మరోసారి భారీ వర్షం కురవడంతో అంపైర్లు తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్టు రాత్రి 8 గంటలకు ప్రకటించారు. దీంతో మూడు టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా... మిగతా రెండు టీ20లు 18న మొహాలీలో, 22న విశాఖపట్నంలో జరగనున్నాయి.
చాహల్, కుల్దీప్ను ఎందుకు తీసుకోలేదంటే? : కోహ్లీ
అలాగే టీ20 సిరీస్కు భారత స్పిన్నర్లయిన కుల్దీప్, చాహల్లను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరణ ఇచ్చాడు. శనివారం రాత్రి ధర్మశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ను బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే వారికి అవకాశం కల్పించలేదని చెప్పుకొచ్చాడు. అంతేగాక ఐపీఎల్లో సత్తా చాటిన యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోనే వీరిని పక్కన పెట్టినట్టు చెప్పాడు. వచ్చే ఏడాది టీ20 సిరీస్కు ముందు భారత్ సుమారు 30 టీ20 మ్యాచ్లు ఆడే అవకాశం ఉందనీ, అందువల్లే యువ ఆటగాళ్లను పరీక్షించాలనే ఉద్దేశంతోనే వీరిని పక్కన పెట్టినట్టు చెప్పాడు.