Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పంత్ ఒత్తిడిపై సన్నీ, గంభీర్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : భారత క్రికెట్లోకి ఎం.ఎస్ ధోని వారసుడిగా అడుగుపెట్టిన యువ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్పై పెరుగుతున్న ఒత్తిడిపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, గౌతం గంభీర్ ఆందోళన వ్యక్తం చేశారు. యువ క్రికెటర్ను చూసుకోవాల్సిన పద్దతి ఇది కాదని గంభీర్ విమర్శించగా.. ఊపిరీ పీల్చుకునే అవకాశం ఇవ్వాలని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. కరీబియన్ పర్యటనలో పంత్ తొలి బంతి ఎదురుదాడి నుంచి తాజా సిరీస్లో షాట్ సెలక్షన్పై విపరీత చర్చ సాగుతోంది. పంత్ నుంచి 'భయం లేని క్రికెట్ కోరుకుంటున్నాం, బాధ్యత లేని బ్యాటింగ్ కాదు' అని నూతన బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ వ్యాఖ్యానించాడు. దీంతో పంత్ ప్రదర్శనపై ఆసక్తి నెలకొనటమే కాదు, క్రీజులో కుర్ర క్రికెటర్పై ఎనలేని ఒత్తిడి వచ్చి పడింది. ' పంత్కు కొంత ఊపిరీ తీసుకునే వెసులుబాటు ఇవ్వాలి. బ్యాటింగ్ లైనప్లో పంత్ను ఐదో స్థానంలో ఆడించాలి. ఆ స్థానంలో సహజంగా బ్యాట్స్మన్ ఎదురుదాడి చేయాలి. పంత్ బ్యాటింగ్ శైలికి అది సరిపోతుంది. బ్యాట్ పట్టుకునే గ్రిప్లో చిన్న సవరణ బ్యాట్స్మన్కు, బంతిని పట్టుకోవటంలో చిన్న మార్పు బౌలర్లకు ఊహకందని విజయాన్ని అందిస్తుంది. బ్యాటింగ్ ఆర్డర్లోనూ ఇది వర్తిస్తుంది. పంత్ను నం.5లో ఆడించాలి. ట్రినిడాడ్లో తొలి బంతి షాట్ను విమర్శించిన వారే, టెస్టు అరంగేట్రంలో రెండో బంతిని సిక్సర్గా మలిచినప్పుడు కీర్తించిన విషయాన్ని మరువకూడదు. బయట వ్యక్తుల అభిప్రాయానికి దూరంగా రిషబ్ పంత్ సహజ శైలిలో ఆడే వాతావరణం ఉండాలని గవాస్కర్ అన్నాడు. ' జట్టు కోసం పరుగులు చేసే స్థితి నుంచి స్థానం కాపాడుకునేందుకు బ్యాటింగ్ చేయాల్సిన స్థితిని కల్పించారు. పంత్ భుజం తట్టి జట్టుకు నీ అవసరం ఉంది అని ధైర్యం చెప్పేవాళ్లు ఇప్పుడు కావాలి. యువ ఆటగాడిని ఇలా ఒత్తిడిలో ఉంచటం ఎంతమాత్రం సరైనది కాదు. పంత్పై కోచ్ విక్రమ్ వ్యాఖ్యలు బాధాకరమని గంభీర్ అభిప్రాయపడ్డాడు.