Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిగ్గజాల వీడ్కోలు సంశయం
- వీడ్కోలు చౌరస్తాలో ఎం.ఎస్ ధోని
పదేండ్ల వయసులో క్రికెట్ బ్యాట్, బంతి పట్టుకుంటారు. బహుశా 20 ఏండ్లలో అరంగ్రేట సమరం. అవకాశం దొరికిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే ఉండదు. 35 ఏండ్ల వయసులోనూ ఆడేస్తుంటారు. ఈ సమయంలో లెక్క లేనంత సొమ్ము వెనకేసుంటారు. అంత కంటే విలువైన పేరు, ప్రఖ్యాతలు సంపాదిస్తారు. మ్యాచ్ ముగించటంలో ఎనలేని ఆనందాన్ని ఆస్వాదించే దిగ్గజాలు.. కెరీర్ ముగింపు విషయంలో ఎక్కడలేని తడబాటుకు చోటిస్తున్నారు. ఇంకా ఆడాలనే కోరిక, మరింత సంపాదించాలనే ఆశ అనలేం. 25 ఏండ్ల పాటు క్రికెట్తోనే సాగిన జీవనం.. ఇప్పుడేంటి అనేది దిగ్గజాలు తేల్చుకోలేకపోతున్నారు. ముగింపు మాట చెప్పేందుకు సంశయానికి లోనవుతున్నారు!
నవతెలంగాణ క్రీడా విభాగం
క్రీడలు భిన్నత్వానికి ప్రతీక. అందుకే సాధారణ గమ్యాలు ఆనందాన్నిస్తే.. క్రీడల్లో కెరీర్ గమ్యం భిన్నమైన అనుభూతిని మిగులుస్తుంది. పిన్న వయసులోనే క్రీడల్లో అడుగుపెట్టి, ఆటలో ధ్యాసగా, ఆటనే శ్వాసగా కొనసాగుతున్నారు. పసి వయసులోనే అన్ని సరదాలను వదులుకుని జాతీయ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు కఠోరంగా శ్రమిస్తారు. ఓ పదేండ్ల తర్వాత జాతీయ జట్టు జెర్సీలో తొలి ప్రాతినిథ్యం అనుభూతి అప్పటి వరకూ పడిన కష్టాన్ని హాం ఫట్ చేసేస్తుంది. కానీ మరో 10-15 ఏండ్ల తర్వాత ఆట నుంచి వైదొలిగే క్షణం క్రీడాకారుడిని నైరాశ్యంలోకి నెట్టి వేస్తుంది!. ఊహ తెలిసిన నాటి నుంచి ఆట తప్ప మరో ధ్యాస తెలియని క్రీడాకారులు, ఓ సమయాన కెరీర్ ముగించి ఏం చేయాలనే ఆలోచనే వారిని దిక్కు తోచని స్థితిలోకి నెడుతుంది. భారత క్రికెట్లో ఎంతో మంది క్రికెటర్లను అభిమానులు ఈ దశలో చూశారు. తొలినాళ్లలో వీడ్కోలు వేళ ఈ పరిస్థితులు సహజం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నం. ఆటగాళ్లు కెరీర్ ఉజ్వల స్థితిలో కొనసాగుతున్నప్పుడే వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు. కెరీర్ తర్వాత ఏం చేయాలనే దృక్పథం ఆరంభంలోనే ఉంటోంది. అయినా, ఇప్పుడూ వీడ్కోలు మాట చెప్పేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు మరోసారి వీడ్కోలు చర్చ నడుస్తోంది. భారత క్రికెట్ దిగ్గజం మహేంద్రసింగ్ ధోని 38 ఏండ్ల వయసులో వీడ్కోలు ముంగిట నిలిచాడు. ధోని నోట వీడ్కోలు మాట ఎప్పుడెప్పుడా వింటామా అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.
వీడ్కోలు విషయానికి వస్తే లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ కెరీర్ను అత్యంత హుందాగా ముగించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు ఘనమైన వీడ్కోలు లభించినా, వివాదం లేని వీడ్కోలు గవాస్కర్దనే చెప్పాలి. 37 ఏండ్ల వయసులో టెక్నిక్లో, పరుగుల సాధనలో ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొని సునీల్ గవాస్కర్ 1987 పాకిస్థాన్పై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడు. ఆఖరి ఇన్నింగ్స్లోనూ చిన్నస్వామి వేదికగా సన్నీ 96 పరుగులు సాధించాడు. వీడ్కోలు లేకుంటే మరో రెండేండ్ల పాటు గవాస్కర్ సులువుగానే భారత జట్టులో కొనసాగేవాడు. వీడ్కోలు ఎందుకు? అనే ప్రశ్న ఎదురైనప్పుడే తప్పుకోవాలని, వీడ్కోలు ఎప్పుడు? అనే ప్రశ్న ఎదురయ్యే పరిస్థితి దాకా ఎదురుచూడవద్దని గవాస్కర్తో విజరు మర్చంట్ చెప్పిన మాటలను సన్నీ తూచా తప్పకుండా పాటించాడు!. మిగతా దిగ్గజాలు గవాస్కర్ మాదిరి హుందాగా తప్పుకోలేదు. భారత్ను క్రికెట్ దేశంగా మలిచిన దిగ్గజం కపిల్ దేవ్. 1991లో ఆస్ట్రేలియా పర్యటన తర్వాత కపిల్ దేవ్ ప్రభ మసకబారింది. పేస్లో పస లేదు, బ్యాటింగ్లో పదును లేదు. కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కపిల్కు కొన్ని ఓవర్లు ఇచ్చిన తర్వాత వెంటనే స్పిన్నర్ల వైపు చూసేవాడు. భారత ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన జవగళ్ శ్రీనాథ్ ఒకానొక సమయంలో వీడ్కోలు సందేశం ఏ విధంగా తెలియజేయాలో అర్థం కాక మూడేండ్ల పాటు ఎదురుచూశాడని క్రికెట్ వర్గాలు చెబుతాయి.
భారత క్రికెట్ను మరో మెట్టు పైకి తీసుకెళ్లిన నాయకుడు సౌరవ్ గంగూలీ. జాతీయ జట్టు నుంచి ఉద్వాసన లభించిన తర్వాత మేల్కొన్న గంగూలీ.. 2008 ఆస్ట్రేలియా సిరీస్కు ఎంపికైన తర్వాత వీడ్కోలు ప్రకటించాడు. అప్పుడూ వీడ్కోలు ఊసెత్తకుంటే, కొత్త కెప్టెన్ ధోని జట్టులో ఉద్వాసన తప్పదని దాదా భావన. వికెట్ల నడుమ పరుగు తీయటంలో వెనుకున్నారనే కారణంతో వన్డే జట్టు నుంచి రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీలను కెప్టెన్ ధోని సలహాతో సెలక్షన్ కమిటీ తప్పించింది. టెస్టుల్లో సూపర్ ఫామ్తో 2011లో ద్రవిడ్ వన్డే జట్టులోకి ఎంపికయ్యాడు. మరోసారి వేటు పడే అవకాశం ఇవ్వకూడదని నిశ్చయించుకున్న ద్రవిడ్.. ఆ సిరీస్తోనే పరిమిత ఓవర్ల ఫార్మాట్కు గుడ్ బై చెప్పాడు. ఆరు మాసాల తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో మెరుగ్గా రాణించని ద్రవిడ్, ఇంకా కొనసాగేందుకు తనలో ఏం మిగల్లేదని భావించి ఆట నుంచి తప్పుకున్నాడు.
సచిన్ టెండూల్కర్ విషయానికొస్తే అది పూర్తిగా కొత్త కథ. లేటు వయసులోనూ సచిన్ టెండూల్కర్ చురుగ్గా పరుగులు సాధించాడు. కుర్ర తనంలో చేసిన భారీ సెంచరీలు లేకపోయినా.. క్రీజులో సచిన్ టెండూల్కర్ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. వన్డే జట్టు ప్రణాళికల నుంచి సచిన్ను మినహాయిస్తున్నట్టు చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ చెప్పటంతో 2012 డిసెంబర్లోనే సచిన్ వన్డేలను వదిలేశాడు. 2013లో వెస్టిండీస్పై టెస్టు సిరీస్తో సొంత మైదానంలో వాంఖడేలో ఘనమైన వీడ్కోలు పొందాడు. ప్రపంచ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ మాత్రమే ఈ స్థాయి వీడ్కోలు లభించింది.
ధోని పరిస్థితి ఏమిటీ? : నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) పరిధిలోకి బీసీసీఐ రావటంతో ఇప్పుడు ఆటగాళ్లకు సంబంధించి 45 రోజుల షెడ్యూల్ను రూపొందించే పనిలో బోర్డు అధికారులు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఎం.ఎస్ ధోని ప్రస్థానవ రావటం లేదని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. వరల్డ్కప్ తర్వాత ధోని వేతనంతో కూడిన సెలవులో కొనసాగుతున్నాడు. ఆగస్టు తొలి 15 రోజులు సైన్యంలో విధులు నిర్వర్తించిన మహి, ఇప్పుడు కుటుంబ సెలవులో ఉన్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్కు దూరమైన మహి, నవంబర్లో బంగ్లాదేశ్తో సిరీస్కూ అందుబాటులో ఉండటం లేదని సమాచారం. అంటే డిసెంబర్లో వెస్టిండీస్ సిరీస్కు మాత్రమే సెలక్షన్ కమిటీకి ధోని అందుబాటులో ఉంటాడు. ఈ సమయంలో కనీసం దేశవాళీ విజరు హజారే ట్రోఫీలోనూ ధోని ఆడటం లేదు. ఆరు నెలల విరామం తర్వాత నేరుగా జాతీయ జట్టుకు ఎంపిక చేసిన దాఖలాలు లేవు. మరి, ధోని దేశవాళీ ఆడకుండా నేరుగా టీమ్ ఇండియా తలుపు తట్టగలడా? అనే ప్రశ్న ఎదురవుతోంది.
2020 టీ20 ప్రపంచకప్ వరకు ధోని ఆడతాడనే ఊహాగానాలు ఓ వైపు ఉన్నాయి. దీంతో పాటు ఐపీఎల్ ప్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్తో ధోనికి భావోద్వేగ సంబంధం ఉంది. ఐపీఎల్లో చెన్నై తరఫున వీడ్కోలు ముగించుకున్న తర్వాతే, జాతీయ జట్టుతో ఆఖరు ఆట ఆడతాడనే మాటలు వినిపిస్తున్నాయి. నాయకుడిగా తిరుగులేని పొజిషన్లో కొనసాగిన సమయంలోనే టెస్టు కెరీర్ను వదులుకున్న ధోని.. వన్డే, టీ20 కెప్టెన్సీ విషయంలోనూ అదే నియమం పాటించాడు. ఆటగాడిగానూ జాతీయ జట్టులో స్థిరమైన వారసత్వం దొరికిన తర్వాతే వీడ్కోలు పలకాలనే ఆలోచన ధోని మదిలో ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. భారత క్రికెట్లో భిన్న పంథాను అవలభించి, విజయవంతమైన మిస్టర్ కూల్ ఎం.ఎస్ ధోని మరి వీడ్కోలు మాటకు నిజంగానే తడబడుతున్నాడా? బాధ్యతతో ఎదురుచూస్తున్నాడా? కాలమే సమాధానం చెప్పాలి.