Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ మెజార్టీతో ఎన్నికైన మాజీ కెప్టెన్
- అజహరుద్దీన్ ప్యానల్ ఘన విజయం
నవతెలంగాణ-హైదరాబాద్
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడిగా భారత మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ (లోక్సభ) మొహమ్మద్ అజహరుద్దీన్ ఎన్నికయ్యారు. నూతన రాజ్యాంగం ప్రకారం మాజీ ఎన్నికల సంఘం అధికారి విఎస్ సంపత్ శుక్రవారం హెచ్సీఏ ఎన్నికలు నిర్వహించారు. రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని హెచ్సీఏ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో మొహమ్మద్ అజహరుద్దీన్ ప్యానల్ ఘన విజయం సాధించింది. 223 ఓట్లలో అజహరుద్దీన్కు 147 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి ప్రకాశ్ జైన్కు 73 ఓట్లు రాగా, దిలిప్ కుమార్కు మూడు ఓట్లు పోలైయ్యాయి. 2017లో హెచ్సీఏ అధ్యక్ష పదవికి అజహరుద్దీన్ నామినేషన్ దాఖలు చేసినా.. జీవిత కాల నిషేధంపై బీసీసీఐ నుంచి స్పష్టత లేకపోవటంతో ఎన్నికల అధికారి నామినేషన్ను తిరస్కరించారు. తాజాగా బీసీసీఐ నుంచి లైన్ క్లియర్ చేసుకున్న అజహరుద్దీన్ హెచ్సీఏ అధ్యక్షుడిగా క్రికెట్ పరిపాలకుడిగా అధికారికంగా రంగప్రవేశం చేశారు. మరోవైపు సౌరవ్ గంగూలీ రెండోసారి బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జగన్మోహన్ దాల్మియా అనంతరం 2015లో క్యాబ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన గంగూలీ, 2020 జులై వరకు పదవిలో కొనసాగుతాడు. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఆరేండ్ల తర్వాత మూడేండ్ల విరామం తీసుకోవాలి.
కొత్త ఇన్నింగ్స్ : టెస్టు క్రికెట్ అరంగేట్రంలో తొలి మూడు టెస్టుల్లో శతకాలతో వార్తల్లో నిలిచిన మొహమ్మద్ అజహరుద్దీన్, అదే ఒరవడి కెరీర్ సాంతం కొనసాగించాడు. భారత్కు 99 టెస్టులు, 334 వన్డేలు ఆడిన అజహరుద్దీన్ 2000లో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కున్నాడు. బుకీల నుంచి అజహరుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ కోసం డబ్బులు తీసుకున్నాడని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తన నివేదికలో పేర్కొన్నది. దీంతో బీసీసీఐ అజహరుద్దీన్పై జీవిత కాల నిషేధం విధించింది. బీసీసీఐ నిషేధంపై న్యాయ పోరాటం చేసిన అజహరుద్దీన్ 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున యూపీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యాడు. అజహరుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ దర్యాప్తు పారదర్శకంగా జరుగలేదని, అతడిపై జీవిత కాల నిషేధం న్యాయబద్దం కాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పటంతో, మాజీ కెప్టెన్కు గొప్ప ఊరట లభించింది. బీసీసీఐ జీవిత కాల నిషేధం ఎత్తివేసినా.. క్రికెట్ సర్క్యూట్లో అజహరుద్దీన్ ఫిక్సర్గానే ఉండిపోయాడు. ఇటీవల వెస్టిండీస్, భారత్ టీ20 మ్యాచ్కు ఈడెన్ గార్డెన్స్లో బెల్ కొట్టేందుకు అజహరుద్దీన్ను ఆహ్వానించాడు క్యాబ్ అధ్యక్షుడు గంగూలీ. ఓ మ్యాచ్ ఫిక్సర్ను ఏ విధంగా ఆహ్వానిస్తారని గౌతం గంభీర్, సంజరు మంజ్రేజర్ తీవ్ర విమర్శలు చేశారు. రెండేండ్ల తర్వాత హెచ్సీఏ అధ్యక్ష పదవి కల నేరవేర్చుకున్న అజహరుద్దీన్ ఇక బీసీసీఐ అధికారంపై దృష్టి సారించనున్నాడు. తమిళనాడు క్రికెట్ సంఘంలో ఎన్.శ్రీనివాసన్ తరహా బలమైన కోటరికి అజహరుద్దీన్ ప్రయత్నాలు చేయనున్నాడు!. అజహరుద్దీన్ ప్యానల్కు చెందిన ఆర్. విజయానంద్ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. తొలిసారి హెచ్సీఏ ఎన్నికల్లో మాజీ క్రికెటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, వెంకటపతి రాజు సహా తొమ్మిది మంది మాజీ అంతర్జాతీయ క్రికెటర్లు హెచ్సీఏ ఎన్నికల్లో ఓటు వేశారు.