Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోహిత్, రిషబ్ బ్యాట్తో సాధన
- కెప్టెన్ కోహ్లి ఫిట్నెస్ కసరత్తు
- విశాఖలో భారత జట్టు సాధన
నవతెలంగాణ-విశాఖపట్నం
విశాఖ తీరంలో టీమ్ ఇండియా క్రికెటర్లు సాధనలో మునిగిపోయారు. ఫ్రీడం టెస్టు సిరీస్లో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు ముందు కోహ్లిసేన పూర్తి స్థాయి ట్రైనింగ్ సెషన్లో పాల్గొన్నది. మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2 నుంచి ఆరంభం కానున్న తొలి టెస్టు కోసం భారత జట్టు ఆదివారమే విశాఖపట్నానికి చేరుకుంది. ఆదివారం రెండు ఐచ్ఛిక ట్రైనింగ్ సెషన్లు జరిగినా.. విశాఖ స్టేడియంలో సోమవారం కోహ్లిసేన పూర్తి స్థాయి సాధనలో నిమ్నగమైంది. దక్షిణాఫ్రికా జట్టు సైతం ప్రాక్టీస్ సెషన్లో బిజీబీజీగా గడిపింది. ఉదయం చిరు జల్లులతో షెడ్యూల్ ఆలస్యమైనా.. దక్షిణాఫ్రికా విలువైన సమయం నెట్స్లో గడిపింది. మూడు వార్మప్ మ్యాచ్లో తొలి రోజు వర్షార్పణం కాగా.. ఆదివారం సైతం ఆడేందుకు దక్షిణాఫ్రికా మొగ్గు చూపింది. బీసీసీఐ అందుకు నిరాకరించటంతో, దక్షిణాఫ్రికా జట్టు నిరాశగానే విశాఖకు చేరుకుంది.
కొత్త ట్రైనర్ వెబ్ వచ్చాడు : భారత సీనియర్ జట్టు కొత్త ట్రైనర్ (స్ట్రెంథెనింగ్, కండిషనింగ్) నిక్ వెబ్ సోమవారం జట్టుతో చేరాడు. ఏసీఏ-వైఎస్ఆర్ స్టేడియంలో ఆటగాళ్లందరూ రెగ్యులర్ కసరత్తుల కోసం వృత్తాకారంలో నిల్చోన్న సమయంలో చీఫ్ కోచ్ రవిశాస్త్రి కొత్త ట్రైనర్ నిక్ వెబ్ను జట్టుకు పరిచయం చేశారు. వెబ్ సేవలను వినియోగించటంపై రవిశాస్త్రి విలువైన మాటలు చెప్పగా.. జట్టును ఉద్దేశించి వెబ్ సైతం మాట్లాడాడు. నిక్ వెబ్కు టీమ్ ఇండియా ఆత్మీయ స్వాగతం పలికింది. పరిచయ కార్యక్రమం ముగియగానే కెప్టెన్ విరాట్ కోహ్లి.. వెబ్తో తొలి సంభాషణ చేశాడు. వెబ్తో సంభాషణ పూర్తి కాగానే కాళ్ల బలం బలోపేతం కోసం కోహ్లి కొన్ని కసరత్తులు చేశాడు. స్టేడియానికి కెప్టెన్ కోహ్లి ముందుగానే చేరుకున్నాడు. రెగ్యులర్ వార్మప్ పూర్తి చేసుకుని, కొన్ని డ్రిల్స్ సైతం చేశాడు. ఫిట్నెస్ విషయంలో మరోసారి జట్టుకు ఆదర్శంగా నిలిచాడు.
బ్యాట్తో బిజీ : ఫ్రీడం సిరీస్ ఆరంభం కాకముందే ఇద్దరు ఆటగాళ్లపై ఒత్తిడి నెలకొంది. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్, నయా ఓపెనర్ రోహిత్ శర్మలపైనే అందరి కండ్లూ నెలకొన్నాయి. దీంతో సహజంగానే ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ మైదానంలోకి వచ్చీ రాగానే రెగ్యులర్ కసరత్తులు ముగించుకుని, బ్యాటింగ్ సాధనలో మునిగిపోయారు. ఓపెనర్గా వార్మప్ మ్యాచ్లో రెండో బంతికే డకౌట్ అయిన రోహిత్ శర్మ అసలు పోరులో రాణించగలడా? అనే సందేహాలను లేవనెత్తాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలలో టెస్టు సెంచరీలు సాధించినా రిషబ్ పంత్పై విమర్శలు ఆగటం లేదు. టీ20 సిరీస్లో మెరవని రిషబ్ పంత్.. టెస్టుల్లో లోయర్ ఆర్డర్లో స్వేచ్ఛగా పరుగులు చేసేందుకు ఎదురుచూస్తున్నాడు. అమ్మమ్మ ఊరు విశాఖ వేదికగా కొత్త ఇన్నింగ్స్ మొదలెడుతున్న రోహిత్ శర్మ బుధవారం నాటి పోరుకు సానుకూల దృక్పథంతో సిద్ధమవుతున్నాడు.