Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓపెనర్గా రోహిత్ శర్మ నయా ఇన్నింగ్స్
శ్రీనివాస్ దాస్ మంతటి
భారత టాప్ ఆర్డర్ పటిష్టంగా లేదని అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన ఓ వినూత్న ఆలోచన టెస్టు క్రికెట్లో టీమ్ ఇండియా రాతను మార్చేసింది. అప్పటికే వన్డేల్లో ఓపెనర్గా నిలదొక్కుకున్న వీరెందర్ సెహ్వాగ్ను గంగూలీ టెస్టుల్లోనూ ఓపెనర్గా బరిలోకి దింపాడు. ఇప్పుడు మిడిల్ ఆర్డర్లో చోటు లేదని, టాప్ ఆర్డర్లో ఓపెనింగ్ను బలోపేతం చేయాలని జట్టు మేనేజ్మెంట్, సెలక్షన్ కమిటీ మరో ప్రయోగానికి సిద్ధమయ్యాయి. వన్డేలు, టీ20ల్లో విధ్వంసక ఇన్నింగ్స్లతో ఓపెనర్గా నిలదొక్కుకున్న రోహిత్ శర్మ.. విశాఖ టెస్టుతో ఓపెనర్గా కొత్త అవతారానికి సిద్ధమవుతున్నాడు. మరి సెహ్వాగ్ స్థాయిలో రోహిత్ శర్మ రెచ్చిపోతాడా?
మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ టెస్టుల్లో ఓపెనర్ అవతారం ఎత్తటం ఇది కొత్త కాదు. భారత విధ్వంసక ఓపెనర్ వీరెందర్ సెహ్వాగ్ సహా టీమ్ ఇండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి సైతం మిడిల్ ఆర్డర్ నుంచి ఓపెనర్గా కొత్త ఇన్నింగ్స్ ఆరంభించారు. సక్సెస్ఫుల్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సనత్ జయసూర్య (శ్రీలంక), సైమన్ కటిచ్ (ఆస్ట్రేలియా) సైతం మిడిల్ ఆర్డర్ నుంచి టాప్ ఆర్డర్కు వచ్చి ఇన్నింగ్స్ను మొదలుపెట్టిన వారే. భారత క్రికెట్ మరోసారి ఓ ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. అజింక్య రహానె, హనుమ విహారిలు మిడిల్ ఆర్డర్లో కుదురుకోవటంతో రోహిత్ శర్మ వరుసగా బెంచ్కు పరిమితం అవుతున్నాడు. నాణ్యమైన బ్యాట్స్మన్ బెంచ్కు పరిమితం కావటం అగ్రశ్రేణి జట్టుకు మేలు చేయదు. ఇదే సమయంలో ఓపెనింగ్లో సరైన బ్యాట్స్మన్ దొరకటం లేదు. దీంతో రోహిత్ శర్మను ఓపెనర్గా బరిలోకి దింపేందుకు రంగం సిద్ధమైంది. అమ్మమ్మ ఊరు విశాఖపట్నం వేదికగా రోహిత్ శర్మ నయా అవతార్లో మెరుస్తాడా?
వీరూ వీరోచితం : మిడిల్ ఆర్డర్ నుంచి ఓపెనర్గా మారి సూపర్ సక్సెస్ సాధించిన జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది నజఫ్గడ్ నవాబ్ వీరెందర్ సెహ్వాగ్. మిడిల్ ఆర్డర్లో వీరూ నిజానికి మెరుగైన గణాంకాలు నమోదు చేయలేదు. అరంగేట్ర టెస్టులోనే శతకం నమోదు చేసి మెప్పించినా..ఓపెనర్గానే బౌలర్లకు సింహస్వప్నమయ్యాడు. మిడిల్ ఆర్డర్లో పది ఇన్నింగ్స్ల్లో సెహ్వాగ్ 37.9 సగటుతో 379 పరుగులు చేశాడు. ఓపెనర్గా 170 ఇన్నింగ్స్ల్లో 50.04 సగటుతో 8207 పరుగులు బాదాడు. ఓపెనర్గా లార్డ్స్లో 84 బంతుల్లోనే 96 బాదిన వీరూ..నాటింగ్హామ్లో ఇంగ్లాండ్పై శతకం, ముంబయిలో వెస్టిండీస్పై 147, ఆస్ట్రేలియాపై మెల్బోర్న్లో తొలి రోజే 194 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్తో చెలరేగిన సెహ్వాగ్.. ముల్తాన్లో పాకిస్థాన్పై ట్రిపుల్ సెంచరీతో నయా శకానికి నాంది పలికాడు. ఓపెనర్గా సెహ్వాగ్ కండ్లుచెదిరే ఇన్నింగ్స్లతో టెస్టు క్రికెట్లో భారత భారీ లక్ష్యాలను ఛేదించింది. గౌతం గంభీర్ తోడుగా సెహ్వాగ్ ప్రపంచ క్రికెట్లోనే నం.1 ఓపెనింగ్ జోడీగా నిలిచాడు. ధోనీసేన టెస్టుల్లో వరల్డ్ నం.1గా నిలువటంలో ఓపెనర్గా సెహ్వాగ్ కీలక పాత్ర పోషించాడు.
సమస్యలు అధిగమిస్తాడా? : భారత క్రికెట్లో ఓపెనర్లకు ఇది గడ్డు కాలం. 2019లో ఓపెనర్లు ఎవ్వరూ రాణించలేదు. ఈ సమయంలో ఓపెనర్గా రావటం కష్టమైన విషయమే. కానీ రోహిత్ శర్మకు మరో దారి లేదు. టెస్టుల్లో రెగ్యులర్ ఆటగాడిగా నిలిచేందుకు ఇదే సరైన సమయం. 2013లో తొలి టెస్టు ఆడిన రోహిత్ శర్మ.. 2016 నుంచి పెద్దగా అవకాశాలు అందిపుచ్చుకోవటం లేదు. 2016 నుంచి భారత్ 40 టెస్టుల్లో ఆడగా రోహిత్ కేవలం 11 టెస్టుల్లోనే నిలిచాడు. చివరి టెస్టు నిరుడు ఆస్ట్రేలియాతో సిరీస్లో ఆడాడు. మిడిల్ ఆర్డర్లో 47 ఇన్నింగ్స్ల్లో 39.62 సగటుతో 1585 పరుగులు చేశాడు. ఓపెనర్గా స్వదేశీ పిచ్పై రానుండటం రోహిత్కు అనుకూలం. కానీ విశాఖలో ఐదు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. పిచ్ సీమ్, స్వింగ్కు అనుకూలించే అవకాశం ఉంది. ఇదే సమయంలో సఫారీ సీమర్లు కగిసో రబాడ, ఫిలాండర్లపై రోహిత్కు మెరుగైన రికార్డు. ఈ ఇద్దరు చెరో మూడు సార్లు రోహిత్ వికెట్ కూల్చారు. టెస్టుల్లో ఫిలాండర్పై 50 బంతులాడిన రోహిత్ 19 పరుగులు చేసి, మూడు సార్లు వికెట్ కోల్పోయాడు. కగిసో రబాడపై 58 బంతుల్లో 27 పరుగులు చేసి, మూడు సార్లు అవుటయ్యాడు. తాజా సిరీస్లో సఫారీకి ఈ ఇద్దరు సీమర్లు కీలకం. రెండు వైపులా నాణ్యమైన సీమర్లను ఎదుర్కొవటం రోహిత్ శర్మకు సవాల్. రబాడ, ఫిలాండర్లు మరోసారి ఇబ్బంది పెడితే.. టెస్టుల్లో రోహిత్ శర్మ టెక్నిక్ ప్రశ్నార్థకం కానుంది. ఓపెనర్గా రాణించాలంటే బ్యాటింగ్ శైలిలో ఫ్రంట్ ఫుట్ ఫుట్వర్క్ అవసరం. మరి రోహిత్ శర్మ అందుకు సిద్ధంగా ఉన్నాడా? చూడాలి.