Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హ్యాట్రిక్తో సహా ఏడు పరుగులకు ఆరు వికెట్లు
- సరికొత్త ప్రపంచ రికార్డు
- లక్ష్య సాధనలో బంగ్లా బోల్తా
- చివరి మ్యాచ్లో భారత్ ఘన విజయం
నాగ్పూర్ : బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత్ 2-1తో గెలుచుకుంది. ఆదివారం జరిగిన నిర్ణయాత్మక చివరి మ్యాచ్లో 30 పరుగులతో భారత్ విజయం సాధించింది. భారత్ విధించిన 175 పరుగుల లక్ష్య సాధనలో బంగ్లాదేశ్ 19.2 144 పరుగులకే ఆలౌటయింది. బంగ్లాదేశ్ జట్టులో ఓపెనర్ మొహమ్మద్ నైమ్ 81 పరుగులతో (48 బంతుల్లో రెండు సిక్స్లు, 10 ఫోర్లు) ఒక్కడే పోరాటం చేశాడు. మొహమ్మద్ మిథున్ 27 పరుగులు (29 బంతుల్లో సిక్స్, రెండు ఫోర్లు) చేశాడు. మిగిలిన బ్యాట్స్మెన్లు పూర్తిగా నిరాశపర్చారు. టీ20ల్లో నైమ్కు ఇదే తొలి అర్ధ సెంచరీ కావడం విశేషం. ఇక భారత బౌలర్లలో దీపక్ చాహర్ కేవలం ఏడు పరుగులకే 6 వికెట్ల సాధించాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలో కీలక బ్యాట్స్మెన్లు లింట్డాస్, సౌమ్య సర్కార్లను, ప్రమాదకరంగా మారుతున్న మిథున్ను పెవిలియన్ చేర్చిన చాహర్ ఇన్నింగ్స్ చివరిలో 18 ఓవర్ చివరి బంతికి షాఫుల్ ఇస్లామ్ను, 20 ఓవర్లో తొలి బంతికి రహ్మాన్, రెండో బంతికి అమినుల్ ఇస్లామ్ను అవుట్ చేసి హ్యాట్రిక్ను సాధించాడు. దీంతో టీ20ల్లో హ్యట్రిక్ సాధించిన తొలి ఇండియన్ నిలిచాడు. అంతేకాకుండా 2012లో జింబాబ్వేపై 8 పరుగులకు 6 వికెట్లతో శ్రీలంక బౌలర్ అజంతా మెండిస్ నెలకొల్పిన రికార్డును కూడా చాహర్ తిరగరాసాడు. శివమ్ దుబే 3 వికెట్లు, యుజ్వేందర్ చాహల్ ఒక్క వికెట్ దక్కించుకున్నారు.టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టులో కేఎల్ రాహుల్ (52 పరుగులు, 35 బంతుల్లో 7ఫోర్లు), శ్రేయాస్ అయ్యార్ (62 పరుగులు, 33 బంతుల్లో 3 ఫోర్లు, 5సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించగా, మనీశ్ పాండే 22 పరుగులు (13 బంతుల్లో 3ఫోర్లు)తో అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో షఫీల్ ఇస్లామ్, సౌమ్య సర్కార్ తలో రెండు వికెట్లు పడగొట్టగా, అల్ అమీన్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు.
నిరాశ పర్చిన రోహిత్
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగలింది. సూపర్ ఫామ్లో ఉన్న రోహిత్ శర్మ (2 పరుగులు) ను రెండో ఓవర్లోనే షఫీల్ క్లీన్బౌల్డ్ చేశాడు. అనంతరం ధావన్(19) కూడా 6వ ఓవర్లో నిష్క్రమించాడు. దీంతో 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ఈ దశలో రాహుల్, అయ్యార్ జాగ్రత్తగా ఆడారు. తొలుత ఆచితూచి ఆడిన వీరిద్దరూ ఒక్కసారి క్రీజులో సెటిల్ అయ్యాక బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇదే క్రమంలో రాహుల్ అర్దసెంచరీ సాధించాడు. ఇక రాహుల్ ఔటయ్యాక అయ్యర్ విశ్వరూపం ప్రదర్శించాడు. అఫిఫ్ బౌలింగ్లో వరుసగా మూడు భారీ సిక్సర్లు సాధించాడు. దీంతో టీ20ల్లో తొలి అర్దసెంచరీ సాధించాడు. అయితే రాహుల్ అవుట్తో క్రీజ్లోకి వచ్చిన పంత్(6) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే చివరిలో మనీష్ పాండే దాటిగా ఆడాడు. దూబే 9 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆదివారం మ్యాచ్లో ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాపై వేటు పడింది. అతడి స్థానంలో బ్యాట్స్మన్ మనీశ్ పాండేను తుది జట్టులోకి తీసుకున్నారు. అలాగే బంగ్లాదేశ్లో తుది జట్టు నుంచి ఆఫ్ స్పిన్నర్ మొసద్దిక్ హుస్సేన్ను తప్పించి మిథున్ను తీసుకున్నారు.