Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయిలో మే 24న టైటిల్ పోరు
నవతెలంగాణ, ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సరికొత్త మార్పులను చూడబోతుంది. వారాంతపు రోజుల్లో రెండు మ్యాచులతో కూడిన షెడ్యూల్ సీజన్ 13 నుంచి మారనుంది. 2020 ఐపీఎల్ షెడ్యూల్ను ప్రాథమికంగా సిద్ధం చేశారు. డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ సొంత మైదానం వాంఖడె (ముంబయి) ఆరంభ, తుది మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 29న ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోరుతో సీజన్ 13 ఆరంభం కానుంది. అదే మైదానంలో మే 24న టైటిల్ పోరు జరుగనుంది. ఇప్పటివరకూ 45 రోజుల టోర్నీగా ఉన్న ఐపీఎల్ 2020 నుంచి 57 రోజులకు పెరుగనుంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. మ్యాచ్ వేళల్లో సైతం కీలక మార్పు చోటుచేసుకోనుందని సమాచారం. ' ఐపీఎల్ 13 షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. మే 24న ఫైనల్ మ్యాచ్, మార్చి 29న తొలి మ్యాచ్ జరిగేలా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నాం. గతంలో 45 రోజుల టోర్నీ ఉండేది, ఇప్పుడు టోర్నీ నిడివి 57 రోజులకు పెరుగనుంది. దీంతో రోజుకో మ్యాచ్ కేటాయించటంలో ఎటువంటి ఇబ్బంది ఉండబోదు' అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
మ్యాచ్ సమయం 7.30 : మ్యాచ్ వేళలు, వారాంతపు రోజుల్లో రెండు మ్యాచుల కారణంగా ప్రసారదారులకు టీఆర్పీ, రెవెన్యూ సమస్యలు వస్తున్నాయి. దీంతో మ్యాచ్ వేళల్లో మార్పు చేయాలని స్టార్స్పోర్ట్స్ గత సీజన్కు ముందు గట్టి ప్రయత్నమే చేసింది. ఈ ఏడాది టోర్నీ నిడివి పెరగనుండటంతో మ్యాచ్ వేళల్లో మార్పు కోసం స్టార్స్పోర్ట్స్ డిమాండ్ చేయనుంది. ' 8 గంటల మ్యాచ్ కచ్చితంగా ప్రసారదారుకు టీఆర్పీ సమస్య. ఇదే సమయంలో 8 గంటల మ్యాచ్ తర్వాత అభిమానులు ఇంటికి చేరుకోవటం సైతం ఓ సమస్యగా తయారైంది. 7.30 గంటలకు మ్యాచ్ మొదలైతే టీఆర్పీ సహా అభిమానుల సమస్యకూ పరిష్కారం లభిస్తుంది' అని ప్రసారదారు వర్గాలు చెబుతున్నాయి. వారాంతపు రోజుల్లో 4 గంటలకు మొదలయ్యే మ్యాచ్ ఇక చరిత్రే కానుంది. 57 రోజుల టోర్నీలో ప్రతి రోజు ఒక్క మ్యాచే నిర్వహించే వెసులుబాటు నిర్వాహకులకు లభించనుంది. 4 గంటల మ్యాచ్ ప్రసారదారులకు తలనొప్పిగా మారగా, స్టేడియం నింపేందుకు ప్రాంఛైజీలు అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో ఈ రెండు సమస్యలకు చెక్ పెట్టేందుకు 4 గంటల మ్యాచ్ను ఎత్తివేసేందుకు బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. త్వరలోనే భేటీ కానున్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయాలు చర్చకు రానున్నాయి.