Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో వన్డేలో 36 పరుగులతో భారత్ గెలుపు
- ధావన్, స్మిత్ సెంచరీలు మిస్
రాజ్కోట్లో కోహ్లీసేన అదరగొట్టింది. నిర్ణయాత్మక రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 341 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఆసీస్ 304 పరుగులకే చతికిలపడింది. శిఖర్ ధావన్(96), కోహ్లీ(78), రాహుల్(80) రాణించగా... ఆసీస్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్(98) సెంచరీకి దగ్గర్లో ఔటయ్యారు. ఈ విజయంతో ఇరుజట్లు మూడు వన్డేల సిరీస్లో 1-1తో సమంగా నిలిచాయి. నిర్ణయాత్మక మూడో వన్డే 19న బెంగళూరు వేదికగా జరగనుంది.
రాజ్కోట్: తాడో పేడో తేల్చుకోవాల్సిన రెండో వన్డేల్లో టీమిండియా సమిష్టిగా రాణించింది. తొలుత శిఖర్ ధావన్(96), విరాట్ కోహ్లి(78), కెఎల్ రాహుల్(80), రోహిత్ శర్మ(42) రాణించడంతో టీమిండియా 340 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం షమి(3/77), సైనీ(2/62), జడేజా(2/58), కుల్దీప్(2/65) సమిష్టిగా రాణించడంతో ఆస్ట్రేలియాను 304 పరుగులకే పరిమితం చేసి 36 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.దాంతో టీమిండియా ఇన్నింగ్స్ను రోహిత్-శిఖర్ ధావన్లు ఆరంభించారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళుతున్న క్రమంలో రోహిత్ తొలి వికెట్గా ఔటయ్యాడు. ఈ జోడి మొదటి వికెట్కు 81 పరుగులు జత చేసింది. ఆపై ధావన్కు కోహ్లి జతకలిసి ఇన్నింగ్స్ను నడిపిం చాడు. ఈ క్రమంలోనే ధావన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి 103 పరుగులు జత చేసిన తర్వాత ధావన్ రెండో వికెట్గా ఔటయ్యాడు. కాసేపటికే శ్రేయస్ అయ్యర్(7) కూడా పెవిలియన్కు చేరిపోయాడు. జంపా బౌలింగ్లో భారీ షాట్ ఆడబోగా అది మిస్ కావడంతో శ్రేయస్ బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ కోహ్లీతో జతకట్టిన కెఎల్ రాహుల్ అద్భుతంగా రాణించాడు. గత మ్యాచ్లో విఫలమైన కోహ్లి ఈ మ్యాచ్లో సత్తా చాటాడు. ఆఖరికి ఆడమ్ జంపా వేసిన 44 ఓవర్ తొలి బంతిని భారీ షాట్ ఆడిన కోహ్లి పెవిలియన్ చేరాడు. బౌలర్ ఎండ్ వైపు నేరుగా కోహ్లి భారీ షాట్ కొట్టగా, అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఆగర్ ఆ బంతిని బౌండరీ లైన్కు కాస్త వెలుపల పట్టుకుని దాన్ని మరో ఫీల్డర్ స్టార్క్కు విసిరేశాడు. ఇది ఆగర్ బౌండరీ లైన్ను దాటకముందే స్టార్క్ కు అందివ్వడంతో కోహ్లి పెవిలియన్కు చేరాల్సి వచ్చింది. ఆపై వచ్చిన మనీష్ పాండే(2) స్వల్ప వ్యవధిలోనే ఔటయ్యాడు. ఆ తరుణంలో కెఎల్ రాహుల్కు జత కలిసిన రవీంద్ర జడేజా(20; 16 బంతుల్లో 1 ఫోర్) ఫర్వాలేదనిపించాడు. ఈ జోడి 58 పరుగులు జత చేసిన తర్వాత రాహుల్ రనౌటయ్యాడు. అది చివరి ఓవర్ కావడంతో స్కోరును పెంచే క్రమంలో రాహుల్ రనౌట్గా నిష్క్రమించాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపాకు మూడు, కేన్ రిచర్డ్సన్ రెండు వికెట్లు దక్కాయి.
భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ జట్టుకు శుభారంభం దక్కలేదు. వార్నర్(15) నిరాశపరిచాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ ఫించ్(33) కూడా రాణించకపోవడంతో కంగారూ జట్టు 82 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. ఆ తర్వాత స్టీవ్ స్మిత్(98), లబూషేన్(46) అద్భుతంగా పోరాడి 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆసీస్ను ఒడ్డున పడేశారు. ఆ దశలో లబూషేన్ను జడేజా ఔట్ చేయడంతో ఆస్ట్రేలియా కష్టాలు మొదలయ్యాయి. ఆ వెంటనే క్యారీ కూడా ఔటవ్వడం, స్మిత్ సెంచరీకి దగ్గర్లో ఔట్ కావడంతో ఆసీస్ ఔటమి ఖాయమైంది. షమికి మూడు, కుల్దీప్, జడేజా, సైనీకి రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కెఎల్ రాహుల్కు దక్కగా, నిర్ణయాత్మక మూడో, చివరి వన్డే బెంగళూరు వేదికగా ఆదివారం జరగనుంది.
స్కోర్బోర్డు...
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బి) జంపా 42, ధావన్ (సి) స్టార్క్ (బి) రిచర్డుసన్ 96, కోహ్లీ (సి) స్టార్క్ (బి) జంపా 78, శ్రేయస్ అయ్యర్ (బి) జంపా 7, కెఎల్ రాహుల్ (రనౌట్) క్యారీ 80, మనీష్ పాండే (సి) అగర్ (బి) రిచర్డుసన్ 2, జడేజా (నాటౌట్) 20, షమి (నాటౌట్) 1, అదనం 14. (50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 340 పరుగులు.
వికెట్ల పతనం: 1/81, 2/184, 3/198, 4/276, 5/280, 6/338
బౌలింగ్: కమిన్స్ 10-1-53-0, స్టార్క్ 10-0-78-0, రిచర్డుసన్ 10-0-73-2, జంపా 10-0-50-3, అగర్ 8-0-63-0, లబూషేన్ 2-0-14-0
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) పాండ్యా (బి) షమి 15, ఫించ్ (స్టంప్) రాహుల్ (బి) జడేజా 33, స్మిత్ (బి) కుల్దీప్ 98, లబూషేన్ (సి) షమి (బి) జడేజా 46, క్యారీ (సి) కోహ్లీ (బి) కుల్దీప్ 18, టర్నర్ (బి) షమి 13, అగర్ (ఎలబి) సైనీ 25, కమిన్స్ (బి) షమి 0, స్టార్క్ (సి) రాహుల్ (బి) సైనీ 6, రిచర్డుసన్ (నాటౌట్) 24, జంపా (సి) రాహుల్ (బి) బుమ్రా 6, అదనం 20. (49.1 ఓవర్లలో ఆలౌట్) 304 పరుగులు.
వికెట్ల పతనం: 1/20, 2/82, 3/178, 4/220, 5/221, 6/259, 7/259, 8/274, 9/275, 10/304.
బౌలింగ్: బుమ్రా 9.1-2-32-1, షమి 10-0-77-3, సైనీ 10-0-62-2, జడేజా 10-0-58-2, కుల్దీప్ 10-0-65-2.