Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరీస్ విజయంపై ఆసీస్, భారత్ గురి
- గెలుపుపై పట్టుదలగా కోహ్లిసేన
- మ.1.30 నుంచి స్టార్స్పోర్ట్స్లో..
సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు వరుసగా నాలుగు వన్డేల్లో తలొంచిన కోహ్లిసేన, ఎట్టకేలకు రాజ్కోట్లో గెలుపు బాట పట్టింది. తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో విజయంతో సిరీస్ను 1-1తో సమం చేసిన టీమ్ ఇండియా తుది పోరును చిన్నస్వామికి చేర్చింది. చిన్న బౌండరీల చిన్నస్వామిలో నేడు భారత్, ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఆఖరు పోరాటానికి సిద్ధమయ్యాయి. అన్ని రంగాల్లో అద్భుత బలగంతో కంగారూ శిబిరం సిరీస్ వైపు దూసుకొస్తుండగా.. సొంతగడ్డపై మరో సిరీస్ విడిచిపెట్టే ప్రసక్తే లేదని మెన్ ఇన్ బ్లూ సమరానికి సిద్ధమవుతోంది. భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ నిర్ణయాత్మక సమరం నేడు చిన్నస్వామి మైదానంలో..
నవతెలంగాణ-బెంగళూర్
అగ్ర జట్ల సమరం అంతిమ పోరాటానికి చేరుకుంది. ముంబయిలో ఆస్ట్రేలియా మెరువగా, రాజ్కోట్లో భారత్ మురిసింది. సిరీస్ అందుకునేందుకు ఇరు జట్లు నేడు బెంగళూర్లో బాహాబాహీకి సిద్ధమయ్యాయి. తొలి మ్యాచ్లో పరాజయం చవిచూసి, సిరీస్ విజయాలు అందుకోవటం కోహ్లిసేనకు ఇది కొత్త కాదు. గతంలో ఇంటా, బయటా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొని విజయాలు సాధించింది. ఆధిక్యంలో నిలిచినా, సిరీస్ కోల్పోవటం ఆస్ట్రేలియాకు అలవాటైన పని కాదు. ఈ నేపథ్యంలో బెంగళూర్ నిర్ణయాత్మక పోరు రక్తి కట్టిస్తోంది. క్రికెట్ పవర్ హౌస్ల నడుమ వన్డే సిరీస్ సవాల్ కావటంతో అభిమానులు చిన్నస్వామి మ్యాచ్వైపు ఆసక్తిగా చూస్తున్నారు. రసపట్టులో సాగుతున్న సిరీస్లో ఆఖరి పంచ్ కోహ్లిసేన విసురుతుందేమో చూడాలి.
రోహిత్ మెరవాలి : భారత బ్యాటింగ్ లైనప్లో అరివీర విధ్వంసకారుడు రోహిత్ శర్మ వాంఖడె, రాజ్కోట్లో నిరాశపరిచాడు. ఆసీస్ బౌలర్లను ఊచకోత కోసిన రికార్డు రోహిత్ సొంతం. టాప్-4 బ్యాట్స్మెన్లో శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి సిరీస్లు సత్తా చాటారు. ఈ బృందంలో రోహిత్ శర్మ ఒక్కడే భారీ ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. అమీతుమీ తేల్చుకోవాల్సిన సమరంలో రోహిత్ శర్మ నుంచి భారత్ బలమైన ఇన్నింగ్స్ ఆశిస్తోంది. రోహిత్ రాణిస్తే, ప్రత్యర్థి ఆశించటానికి ఇంక ఏమీ మిగలదనే సంగతి డ్రెస్సింగ్రూమ్కు బాగా తెలుసు. ఒత్తిడిలో పునరాగమనం చేసిన శిఖర్ ధావన్ కండ్లుచెదిరే ప్రదర్శన చేస్తున్నాడు. కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి జోరుమీదున్నారు. యువ బ్యాట్స్మన్ శ్రేయాష్ అయ్యర్, మనీశ్ పాండేలు తమదైన ఇన్నింగ్స్ ఆడేందుకు ఎదురుచూస్తున్నారు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తుది జట్టులో చోటు తగిన న్యాయం చేయాల్సి ఉంది. కేదార్ జాదవ్ మరోసారి బెంచ్కు పరిమితం కాకతప్పదు. బ్యాకప్ వికెట్ కీపర్ భరత్కు బెంగళూర్ మ్యాచ్లో అవకాశం లేదనే చెప్పాలి.
కంగారు లేకుండా.. : సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో ఆస్ట్రేలియా ఎటువంటి కంగారు లేకుండా బరిలోకి దిగుతోంది. ముంబయిలో ఊరించే లక్ష్యాన్ని ఓపెనర్లే ఊదేయగా.. రాజ్కోట్ ఛేదనలోనూ ఆసీస్ రేసులోనే నిలిచింది. మార్నస్ లబుషేన్ రాజ్కోట్లో ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు. అరంగ్రేట ఇన్నింగ్స్లోనే 47 బంతుల్లో 46 పరుగులు చేశాడు. స్టీవ్ స్మిత్ మరోమారు భారత్పై అదరగొట్టే ఇన్నింగ్స్తో తాజా ఫామ్లో ఉన్నాడు. గత పర్యటనలో మెరిసిన క్యారె, టర్నర్, ఆగర్లు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. నిర్ణయాత్మక మ్యాచ్లో ఆసీస్ బ్యాటింగ్ లైనప్ చెలరేగే అవకాశం ఉంది. బౌలింగ్ విభాగం బలంగా ఉంది. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, కేన్ రిచర్డ్సన్లు కోహ్లిసేనకు గట్టి సవాల్ విసురుతున్నారు. స్పిన్నర్ ఆడం జంపా భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి కొరకరాని కొయ్యగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆఖరి పోరాటంలోనూ జంపా వర్సెస్ కోహ్లి సమరం ఆసక్తి రేపుతోంది. 2019లో టీ20, వన్డే సిరీస్లు గెల్చుకున్న ఆస్ట్రేలియా.. 2020లో వన్డే సిరీస్ను ఎత్తుకెళ్లాలని కృత నిశ్చయంతో ఉంది.
బుమ్రాపై ఫోకస్ : రాజ్కోట్ వన్డేలో భారత్ గెలిచినా, స్టార్ పేసర్ జశ్ప్రీత్ బుమ్రా ప్రదర్శన భారత్కు ఆందోళన కలిగిస్తోంది. 9.1 ఓవర్లలో బుమ్రా కేవలం ఒక్క వికెటే తీయగలిగాడు. కొత్త బంతితో ఫించ్, వార్నర్లను కట్టడి చేయగలిగిన బుమ్రా, డెత్ ఓవర్లలో కెప్టెన్కు గొప్ప ఊరట కల్పించాడు. అయినా, గణాంకాలు ఆ విషయాలను తెలియజేయవు. శ్రీలంకతో సిరీస్లో ప్రభావం చూపని బుమ్రా వాంఖడెలో తేలిపోయాడు. రాజ్కోట్లో ఫర్వాలేదనిపించాడు. ఇప్పుడు చిన్నస్వామి మ్యాచ్లో బుమ్రా ప్రదర్శనపై ఫోకస్ కనిపిస్తోంది. నవదీప్ సైని, మహ్మద్ షమిలు మరోమారు బుమ్రాతో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. బ్యాటింగ్ మెరుపుల అదనపు హంగులు షార్దుల్ ఠాకూర్కు తుది జట్టులో చోటు ఖాయం చేయటంలో విఫలమైంది.
ఓపెనర్లు సిద్ధం! : రాజ్కోట్ వన్డేలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లు గాయపడ్డారు. శిఖర్ ధావన్ పక్కటెముకల నొప్పి నుంచి పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తోంది. నిర్ణయాత్మక వన్డేకు ధావన్కు సిద్ధమని జట్టు మేనేజ్మెంట్ వర్గాల సమాచారం. హిట్మ్యాన్ రోహిత్ శర్మ భుజం గాయంపై స్పష్టత రావాల్సి ఉంది. న్యూజిలాండ్ పర్యటన దృష్ట్యా రోహిత్తో ప్రయోగానికి భారత్ పునరాలోచిస్తుంది. తల అదరటంతో నేషనల్ క్రికెట్ అకాడమీకి చేరుకున్న రిషబ్ పంత్ ఫిట్నెస్లో ఎటువంటి పురోగతి కనిపించటం లేదు!. మణికట్టు మాయగాడు చాహల్ను కాదని చైమామన్ కుల్దీప్ యాదవ్ మరోసారి తుది జట్టులోకి రానున్నాడు.
పిచ్ రిపోర్టు : భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో మరో పరుగుల పండుగ. బెంగళూర్ చిన్నస్వామి స్టేడియంలో రెండో ఇన్నింగ్స్కు మంచు ప్రభావం కనిపించనుంది. చిన్న బౌండరీలు, భారీ హిట్టర్లకు అనువైన స్టేడియం. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్కు వాతావరణం సైతం సహకరించే వీలుంది. స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో కీలక పాత్ర పోషించనున్నారు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాష్ అయ్యర్, కెఎల్ రాహుల్, మనీశ్ పాండే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైని, మహ్మద్ షమి, జశ్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా : అరోన్ ఫించ్, డెవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారె, అష్టన్ టర్నర్, ఆష్టన్ ఆగర్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్సన్, ఆడం జంపా.