Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 నేడు
- వరల్డ్కప్ సన్నద్ధతపై కోహ్లిసేన ఫోకస్
- సొంతగడ్డపై ఫేవరెట్గా విలియమ్సన్ బృందం
- మ. 1.20 నుంచి స్టార్స్పోర్ట్స్లో..
బెంగళూర్లో ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ ఆడిన నాలుగు రోజుల్లోనే, ఆక్లాండ్లో న్యూజిలాండ్తో టీ20 సమరానికి టీమ్ ఇండియా సిద్ధమైంది. బెంగళూర్, ఆక్లాండ్ మధ్య సమయ వ్యత్యాసం ఏడు గంటలు, సుదీర్ఘ ప్రయాణ బడలిక అనంతరం కోహ్లిసేన కివీస్ గడ్డపై కాలుమోపింది. 2020 సెప్టెంబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్పై కన్నేసిన కోహ్లిసేన.. మెగా ఈవెంట్ ప్రిపరేషన్ను దృష్టిలో ఉంచుకుని న్యూజిలాండ్తో ఐదు టీ20 సవాల్కు రెఢ అవుతోంది. భారత్, న్యూజిలాండ్లను గాయాల బెడద వేధిస్తున్నా, చిన్న బౌండరీల మైదానాల్లో పరుగుల వరద సిరీస్ సమరంపై ఆసక్తి పెంచుతోంది. భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 పోరు ఈడెన్పార్క్లో నేడు.
నవతెలంగాణ-ఆక్లాండ్
మైదానంలో అడుగుపెట్టిన ప్రతీ మ్యాచ్లో టీమ్ ఇండియా ధ్యాస టీ20 వరల్డ్కప్పైనే కనిపిస్తోంది. న్యూజిలాండ్ పర్యటన అందుకు ఎంతమాత్రం మినహాయింపు కాదు. ప్రపంచకప్ విజయాన్ని ధ్యేయంగా పెట్టుకున్న కోహ్లిసేన 2020 సెప్టెంబర్లో వరల్డ్కప్ నిరీక్షణకు తెరదించాలని భావిస్తోంది. ఆస్ట్రేలియా పరిస్థితులను పోలివుండే న్యూజిలాండ్ పిచ్లపై వరల్డ్కప్ సన్నద్ధత మెరుగ్గా ఉంటుందని జట్టు మేనేజ్మెంట్ విశ్వసిస్తోంది. వరల్డ్కప్ ప్రణాళికల్లో భాగంగానే న్యూజిలాండ్తో ఐదు టీ20 సిరీస్ ఆడుతోంది. గాయాలు ఇరు జట్ల తుది కూర్పును గట్టి దెబ్బ తీశాయి. శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్య, దీపక్ చాహర్లు లేకుండా భారత్ బరిలోకి దిగుతోంది. మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గుసన్ వంటి వరల్డ్ సీమర్ల సేవలు లేకుండానే కివీస్ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆస్ట్రేలియా చేతిలో 0-3 దారుణ టెస్టు సిరీస్ ఓటమితో నాయకుడిగా తీవ్ర ఒత్తిడిలో కొనసాగుతున్న కేన్ విలియమ్స్ సొంతగడ్డపై టీ20 సిరీస్లో న్యూజిలాండ్ను హాట్ ఫేవరెట్గా బరిలోకి దింపుతున్నాడు.
బౌలర్లకు పరీక్ష : భారత్తో సిరీస్కు న్యూజిలాండ్ పచ్చిక పిచ్లు సిద్ధం చేసింది. పచ్చికపై బంతులేయటం, మంచి స్వింగ్ రాబట్టి బ్యాట్స్మెన్ను ఇరుకున పెట్టడం బౌలర్లకు ఎనలేని ఆనందం. బౌలర్లకు న్యూజిలాండ్ పిచ్లపై ఈ ఆనందంతో పాటు మరో కఠిన సవాల్ ఎదురు కానుంది. ఆక్లాండ్ చిన్న బౌండరీల మైదానం. స్ట్రయిట్ బౌండరీ లైన్ మరీ చిన్నదిగా (గల్లీ క్రికెట్ తరహాలో) ఉంటుంది. ఓవర్లో ఆరు బంతులకు లెంగ్త్ మార్చుకోవాలి, స్వింగ్లో వైవిధ్యం చూపించాలి. బ్యాట్స్మెన్ నేరుగా ఆడేందుకు వీలు లేకుండా బంతులేయాలి. 30 యార్డ్ల సర్కిల్ను దాటితే బౌండరీ ఎంతో దూరంలో ఉండదు. బ్యాట్స్మెన్కు ఎక్కువగా టాప్ ఎడ్జ్ తీసుకునేలా ఎంతో తెలివితో బౌలింగ్ చేయాలి. జశ్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, నవదీప్ సైని, షార్దుల్ ఠాకూర్ సహా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు స్వదేశంలో ఆసీస్కు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కానీ ఇక్కడ ఆ ప్రదర్శనతో ప్రయోజనం ఉండదు. చిన్న బౌండరీలైనా ఆక్లాండ్లో స్పిన్నర్లకు అదనపు అనుకూలత ఉంటుంది. కుల్దీప్ యాదవ్, జడేజాలు ఈ అనుకూలతను సద్వినియోగం చేసుకుంటే భారత్కు గొప్ప ఉపశమనం ఉంటుంది.
బ్యాటింగ్ లైనప్లో ఫామ్లో ఉన్న శిఖర్ ధావన్ దూరమైనా, భారత్కు ఎటువంటి ఇబ్బంది లేదు. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లిలతో టాప్ ఆర్డర్ అత్యంత పటిష్టంగా ఉంది. కొత్త బంతిని నేర్పుగా ఎదుర్కొంటే పరుగుల వరద పారించే సత్తా టాప్-3 సొంతం. శ్రేయాష్ అయ్యర్, మనీశ్ పాండే, జడేజా/దూబెలు మిడిల్ ఆర్డర్లో రానున్నారు. అయ్యర్ టీ20 శైలి ఇన్నింగ్స్లు బాకీ పడగా, బల నిరూపణకు మనీశ్కు ఇక్కడ అవకాశం దొరకనుంది. పవర్ ప్లేలో స్పిన్ బౌలర్ అవసరం అనుకుంటే వాషింగ్టన్ సుందర్ సైతం తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. కెఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకోవటంతో.. రిషబ్ పంత్కు తుది జట్టులో లభించటం కష్టం.
సొంతగడ్డపై మెరుస్తారా? : ఆసీస్కు టెస్టు సిరీస్ 0-3తో కోల్పోయినా స్వదేశంలో కివీస్కు ఘనమైన రికార్డుంది. పొట్టి ఫార్మాట్లో శ్రీలంకపై 2-1 విజయం, ఇంగ్లాండ్తో 2-2తో ఐదు మ్యాచ్ల సిరీస్ను సమంగా పంచుకుంది. గాయాల బెడద డ్రెస్సింగ్రూమ్లో ఆందోళన కలిగించినా, నాణ్యమైన ఆల్రౌండర్లు న్యూజిలాండ్ తుది జట్టు కూర్పును ఎప్పుడూ బలంగానే ఉంచుతారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్, సీనియర్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్, స్టార్ బ్యాట్స్మన్ రాస్ టేలర్లు న్యూజిలాండ్ బ్యాటింగ్ భారం మోయనున్నారు. స్వదేశంలో ఎటువంటి బౌలింగ్ బృందానైన్నా వేటాడే ఆటగాడు విలియమ్సన్. కివీస్ పిచ్లపై విలియమ్సన్ను అడ్డుకోవటం భారత బౌలర్లకు పరీక్ష. హిట్టర్లు గప్టిల్, టేలర్లు తమదైన రోజున భారీ ఇన్నింగ్స్లో పూడ్చుకోలేని నష్టం చేయగలరు. ఆల్రౌండర్లు స్కాట్, కొలిన్ మన్రో, మిచెల్ శాంట్నర్, కొలిన్ డీ గ్రాండ్హౌమెలు కీలకం కానున్నరు. వికెట్ కీపర్ టిమ్ సీఫర్ట్ సత్తా చాటేందుకు ఎదురుచూస్తుండగా, ఇశ్ సోధి, టిమ్ సౌథి ఆక్లాండ్ పరిస్థితుల్లో ప్రభావం చూపించగలరు.
పిచ్ రిపోర్టు : ఆక్లాండ్ ఈడెన్పార్క్ బ్యాట్స్మెన్ స్వర్గధామం. చిన్న బౌండరీల మైదానం. ఎటువంటి బ్యాట్స్మెన్ అయినా, హిట్టింగ్ చేయడానికి సాహసించే గ్రౌండ్ ఇది. బౌలర్లు ఎప్పటికప్పుడు లెంగ్త్, లైన్ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఆక్లాండ్ వాతావరణంలో ఆర్థత ఎక్కువ. ఉపఉష్ణమండల పరిస్థితుల్లో స్లో, స్పిన్ బౌలర్లకు అనుకూలత ఎక్కువ. ఇరు జట్లు పేసర్లతో పాటు స్పిన్పై ఎక్కువగా ఆధారపడనున్నాయి. లక్ష్యాన్ని కాపాడుకోవటం కష్టమైన పని. టాస్ నెగ్గిన తొలుత బౌలింగ్ చేసేందుకు మొగ్గచూపనుంది. సాయంత్రం ఆక్లాండ్లో మోస్తరు చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. వర్షం అంతరాయం కలిగించినా, కుదించిన ఓవర్ల మ్యాచ్ ఆడేందుకు అవకాశం ఎక్కువ. ఇక్కడ ఓవర్కు 10కి పైగా పరుగులు రాబట్టేందుకు వీలుంది!.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, శ్రేయాష్ అయ్యర్, మనీశ్ పాండే, శివం దూబె, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, జశ్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైని.
న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, కొలిన్ మన్రో, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, టామ్ బ్రూస్, స్కాట్ కుగ్లిజిన్, టిమ్ సీఫర్ట్, కొలిన్ డీ గ్రాండ్హౌమె, టిమ్ సౌథీ, ఇశ్ సోధి, మిచెల్ శాంట్నర్.
నాయకత్వ పటిమను ఎల్లప్పుడూ ఫలితాల ఆధారంగా నిర్దారణ చేయలేం. కేన్ విలియమ్సన్ మంచి కెప్టెన్. సహచరుల మద్దతు, గౌరవం పొందుతున్నాడు. నాయకుడు జట్టు అత్యుత్తమ ప్రదర్శన రాబట్టేందుకు తోడ్పడుతాడు. అయినా, జట్టు మెరుగ్గా రాణించలేదు అంటే అది సమిష్టి వైఫల్యం. నాయకత్వ వైఫల్యం ఎంత మాత్రం కాదు. ఏడు గంటల సమయ వ్యత్యాసం కలిగిన పర్యటనకు వస్తున్నప్పుడు షెడ్యూల్ మరింత మెరుగ్గా ఉండాల్సింది. బీసీసీఐ భవిష్యత్లో ఇది గమనంలో ఉంచుకోవాలి. వన్డే,టీ20 ప్రణాళికల్లో కెఎల్ రాహుల్ ఇప్పుడు కీలకం. వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకుని జట్టుకు మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నాడు'
- విరాట్ కోహ్లి, భారత కెప్టెన్