Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కివీస్తో రెండో టీ20 నేడు
- మరో విజయంపై కోహ్లిసేన కన్ను
- సమంపై న్యూజిలాండ్ ఫోకస్
- మ 12.20 నుంచి స్టార్స్పోర్ట్స్లో..
నవతెలంగాణ-ఆక్లాండ్
న్యూజిలాండ్ బౌలింగ్ విభాగం గాయాల సమస్యతో బాధపడుతున్నా.. పొట్టి ఫార్మాట్లో భారత్పై ఉన్న తిరుగులేని రికార్డుతో తొలి టీ20లో ఆతిథ్య కివీస్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగి, దారుణ ఓటమి చవిచూసింది. యువ ఆటగాళ్లు బాధ్యత తీసుకోవటంతో భారీ లక్ష్యాన్ని భారత్ 19 ఓవర్లలోనే ఊదేసింది. ఒక్క రోజు విరామంలో భారత్, న్యూజిలాండ్లో మళ్లీ పొట్టి పోరుకు సిద్ధపడ్డాయి. పరుగుల వరదకు నెలవైన ఆక్లాండ్ ఈడెన్పార్క్లోనే రీ మ్యాచ్కు రంగం సిద్ధం చేసుకున్నాయి. వరుసగా మరో విజయం సాధించాలని టీమ్ ఇండియా ఆశిస్తుండగా, ఆక్లాండ్లోనే లెక్క సరిచేయాలని న్యూజిలాండ్ భావిస్తోంది. భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 నేడు.
రోహిత్ మెరిసేనా? : చిన్న బౌండరీల స్టేడియంలో బిగ్ హిట్టర్ రోహిత్ శర్మ కీలకం అవుతాడని భారత్ భావించింది. కానీ స్పిన్ ఆడటంలో రోహిత్ తడబడ్డాడు. ఆక్లాండ్లోనే జరుగుతున్న రెండో మ్యాచ్లో రోహిత్ నుంచి భారత్ మెగా ఇన్నింగ్స్ ఆశిస్తోంది. సులువుగా సిక్సర్లు కొట్టగల రోహిత్ మెరిస్తే భారత్ భారీ స్కోరు సాధించే వీలుంది. యువ బ్యాట్స్మెన్ కెఎల్ రాహుల్, శ్రేయాష్ అయ్యర్ అదే ఫామ్ కొనసాగించాలని చూస్తున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లి ఇటీవల దూకుడుగా ఆడుతున్నాడు. స్ట్రయిక్రేట్ మెరుగుపర్చుకునేందుకు విరాట్ ప్రయత్నించనున్నాడు. తొలి మ్యాచ్లో సహాయక పాత్రకు పరిమితం అయిన మనీశ్ పాండే అవకాశం లభిస్తే యాంకర్ రోల్ పోషించేందుకు సిద్ధంగా ఉన్నాడు. బంతితో మెరిసిన శివం దూబె.. బ్యాట్తో సిక్సర్లు కొట్టేందుకు ఇష్టపడుతున్నాడు. రవీంద్ర జడేజా మరోసారి వాషింగ్టన్ సుందర్ను వెనక్కి నెట్టి తుది జట్టులో ఉండనున్నాడు. బౌలింగ్ విభాగంలో షార్దుల్ ఠాకూర్ స్థానంలో నవదీప్ సైని తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. చాహల్, బుమ్రా, షమిలు బౌలింగ్ విభాగంలో కీలకం కానున్నారు.
దెబ్బకొడతారా? : 203 పరుగులు చేసినా ఆక్లాండ్లో కివీస్కు ఓటమి తప్పలేదు. ఆక్లాండ్లో భారతీయ అభిమానులు ఎక్కువ. ఇది ఆతిథ్య జట్టుకు సొంతగడ్డపై విదేశీ మ్యాచ్ ఆడుతున్న వింత అనుభవం!. బిగ్ హిట్టర్ మార్టిన్ గప్టిల్ నుంచి కివీస్ భారీ ఇన్నింగ్స్ కోరుకుంటోంది. రాస్ టేలర్, కేన్ విలియమ్సన్, కొలిన్ మన్రో ఫామ్లో ఉన్నారు. గ్రాండ్హౌమె, శాంట్నర్, బెనెట్ల రూపంలో మంచి ఆల్రౌండర్లు ఉన్నారు. దీంతో ఆక్లాండ్లోనే సిరీస్ను సమం చేయాలని, భారత్కు మరింత ఆధిక్యం కోల్పోకూడదని విలియమ్సన్ సేన భావిస్తోంది.
తొలి మ్యాచ్ జరిగిన పిచ్పైనే రెండో టీ20 జరుగనుంది. 40 ఓవర్లు ఆడిన పిచే కావటంతో పెద్ద మార్పులేవీ ఉండే అవకాశం లేదు. కానీ రెండు ఇన్నింగ్స్ల్లోనూ స్లో బౌలింగ్, స్పిన్ బౌలింగ్ వ్యత్యాసం చూపించనుంది. ఇరు జట్లు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నాయి. పరుగుల వరద పారుతున్న పిచ్పై టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్కు మొగ్గచూపనుంది.