Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరీస్లో 2-0 ఆధిక్యం
- ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రాహుల్
ఆక్లాండ్: న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్ క్రికెట్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-0తో ఆధిక్యానికి దూసుకెళ్లింది. రెండో టీ20లో భారత్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదర గొట్టింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ను భారత్ 132 పరుగులకే కట్టడి చేసింది. తరువాత 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 17.3 ఓవర్లలో కేవలం 3 వికెట్ల కోల్పోయి సులువుగా ఛేదించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (50 బంతుల్లో 57 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి రాణించగా, శ్రేయాస్ అయ్యర్ (33 బంతుల్లో 44, 1ఫోర్, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. వీరిద్దరూ మూడో వికెట్కు 86 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. రోహిత్ (8), కోహ్లి (11) తక్కువ స్కోరుకే అవుటయ్యారు. శివమ్ దూబే 8 పరుగులతో అజేయంగా నిలిచాడు. అర్థ సెంచరీ చేసిన రాహుల్కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు లభించింది. ఈ సిరీస్లో మూడో టీ20 ఈ నెల 29 జరుగుతుంది.
ఆదివారం లక్ష్య చేధనలో భారత్కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ (8) మరోసారి తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. టిమ్ సౌతీ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టిన రోహిత్ అదే ఓవర్లో స్లిప్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి (11) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. 6వ ఓవర్లో సౌతీ బౌలింగ్లో అనవసర షాట్కు యత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
ఆకట్టుకున్న అయ్యర్-రాహుల్
39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్ను కేఎల్ రాహుల్-శ్రేయాస్ అయ్యర్ జంట ఆదుకుంది. కేఎల్ రాహుల్ తన ఫామ్ను కొనసాగించాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలుతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సిరీస్లో రాహుల్కు వరుసగా రెండో అర్ధసెంచరీ కావడం విశేషం. ఇక మరోవైపు అయ్యర్ సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. అయితే 17వ ఓవర్లో ఇష్ సోధి బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఈ దశలో శివమ్ దుబె(8 నాటౌట్)తో కలిసి రాహుల్ భారత్కు విజయాన్ని అందించాడు. టిమ్ సౌతీ వేసిన 17.3వ బంతిని శివమ్ దుబె భారీ సిక్సర్గా మలిచి విజయాన్ని అందించాడు.
కట్టడి చేసిన భారత బౌలర్లు
ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఓపెనర్ గుప్తిల్ (20 బంతుల్లో 33 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే కొంచెం దాటిగా ఆడాడు. మరో ఓపెనర్ మాన్రో 25 బంతుల్లో 26 పరుగులు చేయగా వీరి తరువాత వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్ (26 బంతుల్లో 33 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్సర్లు) మాత్రమే రాణించాడు. దీంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్ల సాధించగా, దుబె ఠాకూర్, బుమ్రా ఒక్కొ వికెట్ సాధించారు. పాటు షమీ, చహల్లు వికెట్లు పడగొట్టకున్నా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
మ్యాచ్ అనంతరం కోహ్లి బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. కివీస్ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో బౌలర్లు రాణించారని చెప్పాడు. అలాగే భారత్ ఫీల్డింగ్లోనూ రాణించిందని చెప్పాడు. న్యూజిలాండ్ ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారో తెలిసిందని చెప్పాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ భారత్ అన్ని రంగాల్లోనూ తమపై ఆధిత్యం చెలాయించిందని చెప్పాడు.