Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ క్రీడా విభాగం
హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, శిఖ పాండే, పూనమ్ యాదవ్, తానియా భాటియా వంటి సీనియర్లతోపాటు జమేలీ రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్, హర్లీన్, అరుంధతి వంటి జూనియర్లతో టీమిండియా మహిళల జట్టు టీ20 ప్రపంచకప్లో దుర్భేద్య ఫామ్లోనే ఉంది. కానీ దిగ్గజ క్రికెటర్ మిథాలీ అనుభవం ప్రస్తుత టీమిండియా జట్టుకు లేకపోవడంతో సమతూకం సాధించడంలో కొంత విఫలమవుతోంది. ఎందుకంటే నిలకడ లేమి జట్టును వేధిస్తోంది. 2018 నుంచి హర్మన్ సేన రెండు ద్వైపాక్షిక సిరీస్లు గెలిచి, మరో రెండింటిలో ఓడింది. 2019 నుంచి ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో జరిగిన ముక్కోణపు సిరీస్ వరకు 10 మ్యాచుల్లో గెలిస్తే 10 మ్యాచుల్లో ఓడటం ఇందుకు మరో ఉదాహరణ. టాప్ ఆర్డర్లో మంధాన, రోడ్రిగ్స్, షెఫాలి విఫలమైతే జట్టు ఒక్కసారిగా కుప్పకూలుతోంది. మిడిలార్డర్లో కెప్టెన్ హర్మన్, వేద కృష్ణమూర్తి అంచనాలు అందుకోవడం లేదు. టాప్ ఆర్డర్ ఎంత రాణించినా లోయర్ ఆర్డర్ చేసే 20-30 పరుగులే విజయం అందిస్తాయని కోచ్ రామన్ అనడమే ఇందుకు ఉదాహరణ. మిథాలీలా 1, 3, 4, 5, 6 స్థానాల్లో ఆడగలిగే సీనియర్ బ్యాటర్ ఇప్పుడు జట్టుకు లేరు.
ఈ ప్రపంచకప్లో కఠినమైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక జట్లున్న గ్రూప్-ఏలో భారత్ ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో సమిష్టిగా చెలరేగే ఆ జట్లతో ఆట సులువు కాదు. పక్కా ప్రణాళికతో దూకుడుగా ఆడకపోతే గెలుపు కష్టం. మొదట్లో వరుస విజయాలు సాధించిన టీమిండియా ఆ తర్వాత కష్టంగా ఫైనల్కు చేరింది. అయితే తుది మ్యాచులో అద్భుతంగా రాణించిన మంధానకు మరెవ్వరూ అండగా నిలవలేదు. భారత అమ్మాయిలు వికెట్ల మధ్య రెండో పరుగుకు ప్రయత్నించకుండా బద్ధకంగా ఉన్నారని మాజీ సారథి డయానా ఎడుల్జీ సైతం విమర్శించింది. సిరీస్లో మంధాన టాప్ స్కోరర్గా నిలిచింది. ఆమెతో పాటు హర్మన్కు మహిళల బిగ్ బాష్ ఆడిన అనుభవం ఉండటం సానుకూలం. అటు బంతి, బ్యాటుతో దీప్తి శర్మ ఫామ్లో ఉంది. మీడియం పేసర్ శిఖా పాండే ఆస్ట్రేలియా పిచ్లపై అత్యంత కీలకం. ఒకవైపు మిథాలీ లేని లోటు, మరోవైపు మిడిలార్డర్ సమస్యలతో టీమిండియా ఇబ్బంది పడుతోంది. ఈ పరిస్థితుల్లో 2007లో ధోనీ సేనలా అంచనాలకు మించి హర్మన్ సేన ప్రపంచకప్ను ముద్దాడితే చరిత్రలో నిలవడం ఖాయం.