Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఐపీఎల్పై క్రికెటర్ల ఆశాభావం
-ఈ ఏడాది లీగ్పై గట్టి నమ్మకం
నవతెలంగాణ క్రీడా విభాగం
కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రపంచ క్రీడా రంగాన్ని స్తంభింపజేసింది. ఇండోర్, అవుట్డోర్ తేడా లేకుండా అన్ని క్రీడలు నిలిచిపోయాయి. ఐపీఎల్పైనా కోవిడ్ మహమ్మారి పంజా విసిరింది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్లు అత్యధిక వేతనాన్ని పొందే ఐదు వారాల లీగ్ వాయిదా పడటంతో, క్రికెటర్ల ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడనుంది. కఠిన పరిస్థితుల్లోనూ ఎంతో మంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం ఎదురుచూస్తున్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాతైనా ఐపీఎల్ జరుగుతుందని చాలా మంది క్రికెటర్లు నమ్మకంగా కనిపిస్తున్నారు!.
కరోనా వైరస్ మహమ్మారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 13 వాయిదా పడేలా చేసింది. మార్చి 29న ఆరంభం కావాల్సిన ఐపీఎల్2020, ఏప్రిల్ 15కు వాయిదా పడింది. భారత్లో ప్రస్తుతం 21 రోజుల లాక్డౌన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 14న లాక్డౌన్ గడువు ముగియనుంది. కరోనా వైరస్ మూడో దశ వ్యాప్తిని విజయవంతంగా అడ్డుకుంటే అనుకున్న ప్రకారం ఏప్రిల్ 15న భారత్లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. దశల వారీగా అన్ని వ్యవస్థలు సాధారణ కార్యకలాపాలకు తిరిగి రానున్నాయి. అయినా, మరింత ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సామూహిక సమావేశాలు, క్రీడా పోటీలు, రాజకీయ సమావేశాలు, గుంపులుగా చేరటంపై ఆంక్షలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. భారత్లో పరిస్థితులు సద్దుమణిగినా, అంతర్జాతీయంగా కరోనా వైరస్ వ్యాప్తికి ముకుతాడు పడాలి. అప్పుడే భారత్ మళ్లీ అంతర్జాతీయ రాకపోకలను అనుమతి ఇవ్వనుంది. విదేశీ క్రికెటర్లతో కూడిన ఐపీఎల్కు ఆటగాళ్లకు వీసాలు సైతం చాలా కీలకం. భారత్ వీసాలు అందించినా, కొన్ని దేశాల్లో సుమారు 6 నెలల పాటు ప్రయాణ ఆంక్షలు విధించారు. దీంతో ఆ దేశాలు తమ ఆటగాళ్లకు అనుమతి ఇవ్వటంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహణపై ఎవరూ ఏమీ చెప్పలేని పరిస్థితి. అయినా, 2020లో ఐపీఎల్ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రూపంలో కచ్చితంగా జరుగుతుందని చాలా మంది క్రికెటర్లు నమ్మకంగా ఉన్నారు.
ఐదు వారాల ఐపీఎల్ కావాలి : ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకల్ వాన్ ఐదు వారాల ఐపీఎల్ కావాలని అన్నాడు. కరోనా కారణంగా ఇప్పుడు వాయిదా పడిన ఐపీఎల్ను పూర్తి స్థాయిలో నిర్వహించాలని వాన్ అభిప్రాయపడ్డాడు. ' టీ20 వరల్డ్కప్కు ముందు ఐదు వారాల ఐపీఎల్ నిర్వహించాలి అనేది ఓ ఆలోచన. టీ20 ప్రపంచకప్కు ఆటగాళ్లు అందరికీ ఐపీఎల్ చక్కటి సన్నాహాక వేదిక అవుతుంది. ఐపీఎల్ తర్వాత ప్రపంచకప్. క్రికెట్కు ఐపీఎల్ జరగటం అవసరం, వరల్డ్కప్ నిర్వహణ కూడా' అని ఇంగ్లాండ్ మాజీ సారథి అన్నాడు. మే మొదటి వారంలో మొదలెట్టి, తక్కువ రోజుల్లో పూర్తి చేసే షెడ్యూల్ సైతం బీసీసీఐ ప్రణాళికల్లో ఉంది. అక్టోబర్ 18 నుంచి టీ20 వరల్డ్కప్ ఆరంభం కానుంది. వరల్డ్కప్కు ముందు సమయంలో భారత్ ఆసియా కప్లో ఆడాల్సి ఉంది. ఆసియాకప్కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియా కప్ అనంతరం ఇంగ్లాండ్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. స్వదేశంలో ఇంగ్లీష్ జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ద్వైపాక్షిక సిరీస్లు బీసీసీఐ వదులుకున్నా, ఆసియా కప్లో పాల్గొనే దేశాల వైఖరి సైతం కీలకం అవుతుంది.
జరుగుతుందన్నారు! : ఐపీఎల్లో అత్యధిక ధర అందుకున్న విదేశీ ఆటగాడు పాట్ కమిన్స్. కోవిడ్-19 నేపథ్యంలో ఐపీఎల్ ఒప్పందాలు రద్దు చేసుకోవాలని క్రికెట్ ఆస్ట్రేలియా ఆటగాళ్లను కోరేందుకు సిద్దమవుతుండగా... ఐపీఎల్ ఎప్పుడు ఆరంభమైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని కంగారూ క్రికెటర్లు అంటున్నారు. ఐపీఎల్లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని డెవిడ్ వార్నర్ వ్యాఖ్యానించగా.. తానూ అదే మూడ్లో ఉన్నానని కమిన్స్ తెలిపాడు. ' ఐపీఎల్ ఈ ఏడాది జరుగబోయే టోర్నీ. చాలా మందితో నేను మాట్లాడాను. అందరూ ఐపీఎల్ నిర్వహణపై నమ్మకంగా ఉన్నారు. ఏదో ఒక సమయంలో ఈ ఏడాదే ఐపీఎల్ ఉంటుందని విశ్వాసం వెలిబుచ్చారు' అని పాట్ కమిన్స్ వ్యాఖ్యానించాడు. ' ఈ ఏడాది క్రికెట్ క్యాలెండర్ ముందెన్నడూ చూడని విధంగా ఉండనుంది. ఎన్నో దృక్కోణాలు కనిపిస్తున్నాయి. పరిస్థితులు చక్కబడనంత వరకు ప్రపంచ వ్యాప్తంగా ఏ టోర్నీ ఎప్పుడు జరుగుతందనే విషయంపై ఎవరూ ఎమీ చెప్పలేరు' అని కమిన్స్ అన్నాడు.
అది వర్షకాలం.. కదా : టీ20 వరల్డ్కప్కు ముందు ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ వర్గాలు ప్రతికూల స్పందన వ్యక్తం చేశాయి. ఆ సమయంలో ఐపీఎల్ నిర్వహణ అంత ఉపయుక్తం కాదేమోనని పేర్కొన్నాయి. ఆ సమయంలో భారత్లో విస్తారంగా వర్షాలు కురువటమే ఇందుకు కారణమని బోర్డు ఉన్నతాధికారి ఒకరు అన్నారు. ' భారత్లో సెప్టెంబర్ మాసం రుతుపవనాలు వీచే కాసం. ముంబయిలో భారీ వర్షాలు కురుస్తాయి. చెన్నైలో నిలకడగా వర్షం ఉంటుంది. ఈ నిర్ణయం అంత తేలిగ్గా తీసుకునేది కాదు. రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. లాక్డౌన్ ముగిసి, త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయనే సంకేతాలు రావాలి. ఆ సమయంలో మాత్రమే ఐపీఎల్ నిర్వహణ ఆలోచనలు, ప్రణాళికలపై చర్చింగలం' అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు