Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్ లేకుంటే రూ. 3000 కోట్ల నష్టం
- ఆటగాళ్ల జీతంలో కోత అవకాశం స్వల్పం
- మౌనం వహిస్తున్న బీసీసీఐ ఉన్నతాధికారులు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. వంద కోట్ల అభిమానుల అండతో బీసీసీఐ ఆర్థికంగా ఎదిగింది. ఐపీఎల్ రాకతో బీసీసీఐ ధన బలానికి ఎదురులేకుండా పోయింది. ఒక్క సీజన్తోనే ఏకంగా రూ. 3000 కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది. డబ్బు విషయంలో ఐసీసీ సైతం బీసీసీఐ ముందు మోకరిల్లాల్సిందే!.
కరోనా వైరస్ మహమ్మారితో ఐపీఎల్ 2020 అనిశ్చితిలో పడింది. ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా ఆర్జించాల్సిన రూ. 3 వేల కోట్ల ఆదాయం బీసీసీఐ కోల్పోనుంది. ఆదాయంలో గణనీయ తగ్గుదల చూడనున్న బీసీసీఐ, ఆర్థిక భారాన్ని తనే భరిస్తుందా? ఆటగాళ్లకు బదిలి చేస్తుందా? క్రికెట్ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్.
నవతెలంగాణ క్రీడావిభాగం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 వాయిదా పడింది. మార్చి 29న ఆరంభం కావాల్సిన ఐపీఎల్, ఏప్రిల్ 15కు వాయిదా పడింది. భారత్లో ప్రస్తుతం 21 రోజుల లాక్డౌన్ ఏప్రిల్ 14న ముగియనుంది. కనీసం ఏప్రిల్ 30 వరకు పొడగించాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఐపీఎల్కు ఆతిథ్యం ఇవ్వని ఒడిశా ఇప్పటికే ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ఆతిథ్య రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర సహా పశ్చిమ బెంగాల్ సైతం లాక్డౌన్ కొనసాగించే అవకాశాలు అధికం. దీంతో ఏప్రిల్ 15 తర్వాత ఐపీఎల్ నిర్వహణపై ఎటువంటి ప్రకటన వెలువడే అవకాశం లేదు. మే తొలి వారంలో నిర్వహణపై బీసీసీఐ ఆశలు పెట్టుకుంది. లాజిస్టికల్ సమస్యలతో ఇప్పుడు మే తొలి వారంలో సైతం నిర్వహణ అసాధ్యం. ప్రస్తుతానికి ఐపీఎల్ జరుగుతుందని నమ్మకంగా ఉన్నవారెవరూ లేరు!. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ ఆదాయానికి భారీ గండి పడనుంది. భారత క్రికెట్ బోర్డుకు ప్రధాన ఆదాయ వనరు ఐపీఎల్. ఇప్పుడు 2020 ఐపీఎల్ రద్దు అయితే, ఈ ఏడాది రావాల్సిన సుమారు రూ. 3 వేల కోట్లు నష్టపోనుంది. ఈ భారీ ఆర్థిక నష్టం బీసీసీఐ భరించగలదా? లేదా ఆటగాళ్లకు భారం బదిలీ చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. స్పాన్సర్లు, వాణజ్య ఒప్పంద భాగస్వాములు బీసీసీఐ భారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోరు. ఈ ఆర్థిక నష్టం బీసీసీఐ, ఆటగాళ్లపైనే పడనుంది.
ఐపీఎల్ ఆదాయం సున్నా : 2020 ఐపీఎల్ అనిశ్చితిలో పడింది. కనీసం ఆగస్టు వరకు ఐపీఎల్ ఊసేత్తె పరిస్థితి లేదు. ఏడాది ఆఖర్లో ఏదో రూపంలో జరిగితే, బీసీసీఐ కొంతమేరకు ఆర్థికంగా పుంజుకుంటుంది. లేదంటే ఓ సీజన్ ద్వారా ఆర్జించే పూర్తి ఆదాయం నష్టపోవాల్సి ఉంటుంది. ఐపీఎల్ ద్వారా బీసీసీఐ ప్రధానంగా మూడు మార్గాల్లో సంపాదిస్తోంది. మీడియా హక్కులు (టెలివిజన్, డిజిటల్) స్టార్ ఇండియా దక్కించుకుంది. ఓ సీజన్కు స్టార్ గ్రూప్ రూ. 3065 కోట్లు చెల్లిస్తుంది. ఐపీఎల్ కేంద్ర స్పాన్సర్లు రూ. 618 కోట్ల వరకు బీసీసీఐకి ముట్టజెబుతారు. ప్రతి ప్రాంఛైజీ తన ఆదాయంలో 20 శాతం వాటాను బీసీసీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో బీసీసీఐ రూ. 520 కోట్లు సంపాదిస్తుంది. ప్రతి ప్రాంఛైజీ రూ. 65 కోట్ల చొప్పున ప్రతి ఏడాది బోర్డును చెల్లిస్తున్నాయి. ఐపీఎల్ జరుగకుంటే ఈ మూడు వనరుల ఆదాయం పూర్తిగా నష్టపోవాల్సి ఉంటుంది.
రెగ్యులర్ ఆదాయం ఇలా.. : ఐపీఎల్ రాకముందు బీసీసీఐ ప్రధానంగా ద్వైపాక్షిక సిరీస్లపైనే ఆధారపడింది. సొంతగడ్డపై జరిగే అంతర్జాతీయ మ్యాచుల ద్వారా ప్రధానంగా డబ్బులు సంపాదించేది. ఇప్పుడు కూడా ద్వైపాక్షిక సిరీస్ల ద్వారా బీసీసీఐ దండిగానే ఆర్జిస్తోంది. అయితే, భారత జట్టు ఆడే ఒక్కో మ్యాచ్ లెక్కన స్పాన్సర్లు డబ్బులు చెల్లిస్తారు. ఎన్ని మ్యాచులు జరిగితే అంత ఆదాయం బోర్డుకు లభిస్తుంది. బీసీసీఐ అంతర్జాతీయ మ్యాచుల మీడియా హక్కులు స్టార్ ఇండియావి. ఒక మ్యాచ్కు స్టార్ ఇండియా రూ. 60.1 కోట్లు ఇస్తుంది. టైటిల్ స్పాన్సర్ పేటీఎం ప్రతి మ్యాచ్కు రూ. 3.8 కోట్ల చొప్పున చెల్లిస్తుంది. జెర్సీ స్పాన్సర్ బైజూస్ ప్రతి మ్యాచ్కు రూ. 4.61 కోట్లు చెల్లిస్తుంది. ఐసీసీ టోర్నీ మ్యాచులకు రూ. 1.51 కోట్లు ఇస్తుంది. ఇతర స్పాన్సర్లు ఏసీసీ, హ్యూందారు, డ్రీమ్11 ద్వారా మ్యాచ్కు రూ. 2.59 కోట్లు వస్తాయి. భారత జట్టు కిట్ స్పాన్సర్ నైకి ప్రతి మ్యాచ్కు రూ. 87.34 లక్షలు చెల్లింస్తుంది. 2020 స్వదేశీ సీజన్లో భారత్కు ఇప్పుడు ఒకే సిరీస్ మిగిలి ఉంది. ఇంగ్లాండ్తో వన్డే, టీ20 సిరీస్. దక్షిణాఫ్రికాతో జరగాల్సిన వన్డే సిరీస్ వాయిదా పడింది. ఇంగ్లాండ్తో సిరీస్ సజావుగా సాగితే 2020 ఏడాదికి బీసీసీఐ ద్వైపాక్షిక సిరీస్ల ద్వారా సులువుగా రూ. 1080 కోట్లు జేబులో వేసుకోనుంది. అక్టోబర్లో జరగాల్సిన 2020 టీ20 వరల్డ్కప్ సైతం జరిగితే, ఐసీసీ ఆదాయంలోనూ భారత్కు వాటా లభిస్తుంది.
ద్వైపాక్షిక సిరీస్ల ఆదాయం బాగానే ఉంది. కానీ మెగా ఆదాయం లభించే ఐపీఎల్ జరగకపోతే పరిస్థితి ఏమిటి?. బీసీసీఐ ఖర్చులకు ద్వైపాక్షిక సిరీస్ల నుంచి వచ్చిన ఆదాయం సరిపోతుందా? లేకుంటే బోర్డు ఏం చేయనుంది. బీసీసీఐ కేంద్ర కాంట్రాక్టు కలిగిన క్రికెటర్లకు, ఇతర అంతర్జాతీయ క్రికెటర్లకు ఏడాదికి రూ. 150 కోట్లు చెల్లించాలి. టెస్టులకు రోజుకు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 7 లక్షలు, టీ20కి రూ. 5 లక్షలు మ్యాచ్ ఫీజు ఇవ్వాల్సి ఉంటుంది. క్రికెట్ సీజన్ నిలిచిపోవటంతో మ్యాచు ఫీజు ఇవ్వన్కర్లేదు. కానీ కాంట్రాక్టు క్రికెటర్లకు వార్షిక వేతనం ఇవ్వాల్సిందే. దేశవాళీ క్రికెటర్లకు సైతం బీసీసీఐ ప్రతి ఏడాది రూ. 70 కోట్ల చొప్పున కేటాయిస్తోంది. బీసీసీఐ అనుబంధ రాష్ట్ర సంఘాలకు తన ఆదాయంలో ఆకర్షణీయ మొత్తాలను అందిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభ సమయంలో క్రికెటర్ల వార్షిక వేతనం, రాష్ట్ర సంఘాల వాటా కుదింపుపై బోర్డు ఆలోచన చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఒక్క సీజన్ ఆట ఆగిపోతేనే నష్టాలను క్రికెటర్లపై మోపుతున్నారనే విమర్శలు వస్తాయని బీసీసీఐ ఉన్నతాధికారులు పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ నిర్వహణపై స్పష్టత రాగానే, నష్ట భారం బాధ్యతల బదిలీపై బోర్డు కీలక నిర్ణయం తీసుకోనుంది.
ఐపీఎల్తో బీసీసీఐ ఆదాయం
ఐపీఎల్ మీడియా హక్కులు : రూ. 3065 కోట్లు
ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్లు : రూ. 618 కోట్లు
8 ప్రాంఛైజీల ఆదాయంలో వాటా : రూ. 520 కోట్లు
ద్వైపాక్షిక సిరీస్తో బీసీసీఐ ఆదాయం (ప్రతి మ్యాచ్కు)
మీడియా హక్కులు : రూ. 60.1 కోట్లు
టైటిల్ స్పాన్సర్ : రూ. 3.8 కోట్లు
జెర్సీ స్పాన్సర్ : రూ. 4.61 కోట్లు
ఇతర స్పాన్సర్లు : రూ. 2.59 కోట్లు
కిట్ స్పాన్సర్ : రూ. 87.34 లక్షలు