Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సీజన్ హైదరాబాద్ ఓపెన్ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. కోవిడ్-19 కారణంగా వాయిదా పడ్డ టోర్నీ ఆగస్టు 11నుంచి గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్నట్లు బిడబ్ల్యుఎఫ్ టూర్ సూపర్-100 టోర్నీ నిర్వాహకులు తెలిపారు. రీషెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ ఆగస్టులో తిరిగి ప్రారంభమైతే ఐదు నెలల తర్వాత జరగనున్న తొలి బ్యాడ్మింటన్ టోర్నీ కానుంది. ఆ తర్వాత చైనా మాస్టర్ సూపర్-100 టోర్నీ ఆగస్టు 25-30 మధ్య జరగనుంది. బిడబ్ల్యుఎఫ్ ప్రపంచటూర్లో భాగంగా తైపీ ఓపెన్ సూపర్-300 సెప్టెంబర్ 1-6 మధ్య, ఆ తర్వాత చైనా ఓపెన్ సూపర్-1000 గ్వాంగ్జూలో ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ వేదికగా బిడబ్ల్యుఎఫ్ ఇండియన్ ఓపెన్ సూపర్500 టోర్నీ షెడ్యూల్ ప్రకారం మార్చిలో ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా డిసెంబర్కు 8-13కు వాయిదా పడిన విషయం తెలిసిందే. సయ్యద్ మోడీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్-300 టోర్నీ లక్నో వేదికగా నవంబర్ 17-22మధ్య జరగనుంది. డిసెంబర్ 16-20 మధ్య హెచ్ఎస్బిసి బిడబ్ల్యుఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్కు గ్వాంగ్జూ ఆతిథ్యమివ్వనుంది. బిడబ్ల్యుఎఫ్ జనరల్ సెక్రటరీ థామస్ లాండ్ మాట్లాడుతూ... బ్యాడ్మింటన్ సీజన్ రీషెడ్యూల్ను ప్రారంభించడానికి కష్టపడాల్సి వచ్చిందన్నారు. జర్మన్ ఓపెన్, స్విస్ ఓపెన్, యూరోపియన్ ఛాంపియన్షిప్స్, ఆస్ట్రేలియా ఓపెన్, బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్స్షిప్స్ను రద్దుచేస్తున్నట్లు తెలిపారు.