Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-నూతన ప్రతిపాదన ముందుకు..
-ఎన్నికల ప్రక్రియకు ఈ వారంలో తుదిరూపు
-జులైలో ఐసీసీ చైర్మెన్ ఎన్నికలు
నవతెలంగాణ-దుబారు
కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచ క్రికెట్కు దశదిశ నిర్దేశం లేకుండా పోయింది. కీలక అంశాల్లో పాటించాల్సిన విధానాలపై స్పష్టత కరువైంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గత రెండు నెలల్లో మూడుసార్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ సమావేశం నిర్వహించినా.. ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదు. కరోనా వైరస్తో క్రికెట్కు ఎదురైన పలు సవాళ్లకు సైతం ఐసీసీ సమర్థవంతంగా స్పందించలేదు. ఐసీసీ టీ20 వరల్డ్కప్ నిర్వహణపై తుది నిర్ణయానికి సైతం రాజకీయ సమీకరణాలను బేరీజు వేసుకుంటోంది. దీంతో ఐసీసీ నాయకత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఐసీసీ స్వతంత్ర చైర్మెన్ శశాంక్ మనోహర్ పదవీకాలం ఈ జులైతో ముగియనుంది. మరో దఫా పదవిలో కొనసాగేందుకు శశాంక్కు అవకాశం ఉంది. కానీ పదవీ నుంచి తప్పుకునేందుకే మనోహర్ మొగ్గుచూపుతున్నారు. కరోనా కష్టకాలంలో ఐసీసీ ఎన్నికలు వాయిదా వేయాలనే ప్రతిపాదనకు బోర్డు సభ్యులు విముఖత వ్యక్తం చేశారు. దీంతో ఎన్నికల ప్రక్రియ రూపొందించే పనిలో ఐసీసీ నిమగమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియలో విప్లవాత్మక ప్రతిపాదనను శశాంక్ మనోహర్ ముందుకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
అందరికీ ఓటు హక్కు : ' ఐసీసీ ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. వీలైనంత ఎన్నికల ప్రక్రియకు తుదిరూపు ఇవ్వటం కీలకం. ఈ వారంలో ఎన్నికల ప్రక్రియను రూపొందిస్తాం, వచ్చే వారంలో నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. జులై ఆఖరు వరకు చైర్మెన్ ఎన్నిక పూర్తి కానుంది' అని ఐసీసీ అధికారి ఒకరు తెలిపారు. ఐసీసీలో భారత క్రికెట్ ప్రయోజనాలకు భారీగా గండి కొట్టిన శశాంక్ మనోహర్... ఇప్పుడు భారత్కు వ్యతిరేకంగా మరో పావు కదుపుతున్నాడు. ఐసీసీ చైర్మెన్లో సభ్యులు అందరికీ ఓటు కల్పించాలనే ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చాడు. ఐసీసీ రాజ్యాంగం ప్రకారం ఐసీసీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లకు మాత్రమే చైర్మెన్ ఎన్నికలో ఓటు హక్కు ఉంటుంది. 12 టెస్టు దేశాల సభ్యులు, మూడు అసోసియేట్ దేశాలు (మలేషియా, స్కాట్లాండ్, సింగపూర్), ప్రస్తుత ఐసీసీ చైర్మన్, ఇండిపెండెంట్ డైరెక్టర్ ఇంద్ర నూయీ, ఐసీసీ సీఈఓ మనులు ఐసీసీ బోర్డు సభ్యులు. సీఈఓకు మాత్రం ఓటు హక్కు ఉండదు. ఐసీసీలో 104 మంది సభ్యులకు ఓటు కల్పించాలని, ఎన్నికల ప్రక్రియలో అందరికీ ప్రాతినిథ్యం ఉండాలనే ప్రతిపాదన కొత్తగా ముందుకొచ్చింది. ఐసీసీ ఎంఓఏ (మెమరెండమ్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ ఆసోసియేషన్స్) ప్రకారం బోర్డు ఆఫ్ డైరెక్టర్స్కు మాత్రమే చైర్మెన్ను ఎన్నుకునే అధికారం ఉంది. ఈ ప్రతిపాదనకు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఏ విధంగా స్పందిస్తారో ఆసక్తికరం.
నేను రేసులో లేను- ఈషన్ మణి : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఈషన్ మణి ఐసీసీ రేసులో నిలువటంపై స్పష్టత నిచ్చాడు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)చైర్మెన్ కొలిన్ గ్రేవ్స్ ప్రస్తుతం చైర్మన్ రేసులో ముందున్నారు. భారత్ సౌరవ్ గంగూలీని బరిలో దింపే ఆలోచనలో ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో మణి స్పష్టమైన ప్రకటన చేశాడు. ' నేను ఐసీసీ చైర్మెన్్ రేసులో ఉన్నాననే వార్తలు భారత మీడియా సృష్టించింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పిలుపుతో పాకిస్థాన్ క్రికెట్ కోసం పనిచేసేందుకు మళ్లీ వచ్చాను. ఐసీసీలో నా పాత్ర సైతం అంతవరకే పరిమితం. 2006లో ఏకగ్రీవంగా ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. ఐసీసీలో నా పాత్ర అక్కడితోనే ముగిసిపోయింది. ఐసీసీ చైర్మెన్్ ఎన్నికల్లో నేను నిలబడటం లేదు' అని ఈషన్ మణి తెలిపారు. ఎన్నికల ప్రక్రియ అధికారికంగా వెలువడిన తర్వాతే బీసీసీఐ దీనిపై స్పందించే అవకాశం కనిపిస్తోంది.
ఈసీబీ చైర్మెన్ కొలిన్ గ్రేవ్స్తో పాటు సింగపూర్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖవాజా పేరు ఐసీసీ చైర్మెన్ రేసులో చక్కర్లు కొడుతోంది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు డేవ్ కామెరూన్ పేరు సైతం వినిపిస్తోంది. ఐసీసీ చైర్మెన్్ పదవికి రెండుసార్లు రాజీనామా చేసినా పదవిలో కొనసాగిన శశాంక్ మనోహర్ సైతం ఆఖరు నిమిషంలో బరిలో నిలిచే అవకాశం లేకపోలేదు!.