Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరిన్ని అంశాలపై స్పష్టత అవసరం
- ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భేటిపై బీసీసీఐ
నవతెలంగాణ-ముంబయి
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. సెప్టెంబర్-అక్టోబర్లో ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ ఇదివరకే తాత్కాలిక షెడ్యూల్ రూపొందించినా, అధికారిక ప్రకటనకు ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. ఐపీఎల్తో చైనా కంపెనీల స్పాన్సర్షిప్ల ఒప్పందంపై సమీక్షకు సైతం బీసీసీఐ సమావేశం కావాల్సి. ఇతర అంశాలపై స్పష్టత వస్తేగానీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించే వాతావరణం లేదని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.
భారత్, చైనా సరిహద్దులో గాల్వాన్ లోయ వద్ద జూన్ 19న నెలకొన్న ఉద్రిక్తత ప్రజల్లో భావోద్వేగాలకు కారణమైంది. పొరుగు దేశం ఉత్పత్తులు, కంపెనీల స్పాన్సర్షిప్లు రద్దు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. ప్రజల్లో రేగిన భావోద్వేగాలకు స్పందించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్లో చైనా కంపెనీల స్పాన్సర్షిప్లపై మరో వారంలో సమీక్ష నిర్వహిస్తామని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. బీసీసీఐ ప్రకటన వెలువడి రెండు వారాలు గడిచినా, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం చోటుచేసుకోలేదు. స్పాన్సర్షిప్ల సమీక్షతో పాటు ఇతర కీలక అంశాలపై స్పష్టత లేనందున ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరుగలేదని తెలుస్తోంది. ఇప్పుడు బీసీసీఐ తీసుకునే ప్రతి నిర్ణయం ఐసీసీ టీ20 వరల్డ్కప్ వాయిదాపైనే ఆధారపడి ఉందని అర్థమవుతోంది. ఈ నెలలో టీ20 వరల్డ్కప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ గత సమావేశంలో తీర్మానించిన సంగతి తెలిసిందే. బీసీసీఐ వేయాల్సిన ప్రతి అడుగు ఐసీసీ నిర్ణయంతోనే ముడిపడి ఉండటంతో.. వరల్డ్ క్రికెట్ బాడీతో భారత క్రికెట్ బోర్డు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తోంది.
చాలా అంశాలు ఉన్నాయి! : ' ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు చాలా అంశాల్లో స్పష్టత అవసరం. అందుకే ఐపీఎల్ జీసీ ఏర్పాటు చేయలేదు. టీ20 వరల్డ్కప్పై ఐసీసీ నిర్ణయం కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఐపీఎల్ 2020పై నిర్ణయం తీసుకునేందుకు చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం తేదీని ఇంకా నిర్ణయించలేదు. అన్ని అంశాలను ఒకేసారి చర్చిస్తాం' అని బీసీసీఐ కోశాధికారి అరుణ్ కుమార్ ధుమాల్ పేర్కొన్నారు.
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కుల కోసం చైనా స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ వీవో ఐదేండ్లకు రూ.2199 కోట్లు చెల్లిస్తోన్న సంగతి తెలిసిందే. వీవో చెల్లిస్తోన్న సొమ్ములో 42 శాతం పన్ను కింద కేంద్ర ప్రభుత్వ ఖజానాకు వెళ్తోంది. ఐపీఎల్కు స్పాన్సర్ చేస్తోన్న చైనా కంపెనీలతో భారత్కు లబ్ది చేకూరుతోందని, చైనాకు ఎటువంటి ఉపయోగం లేదని గతంలోనే అరుణ్ కుమార్ ధుమాల్ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.
సురక్షితమైతేనే.. ఐపీఎల్13! : విలువైన సుమారు రూ.5 వేల కోట్ల ఆదాయం కాపాడుకునేందుకు బీసీసీఐ అందుబాటులోని అన్ని అవకాశాలను నిశితంగా పరిశీలిస్తోంది. ప్రపంచ అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బ్యాంక్ ఖాతాల్లో దండిగా (రూ. 10 వేల కోట్లు) నిధులు ఉన్నప్పటికీ.. రావాల్సిన ఆదాయం నష్టపోకుండా చూసుకునేందుకు గంగూలీ జాగ్రత్త వహిస్తున్నారు. అందుకోసం ఐపీఎల్2020 నిర్వహణకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్లో ఐపీఎల్13, వచ్చే ఏడాది మార్చిలో ఐపీఎల్14 నిర్వహణకు షెడ్యూల్ సరిచేస్తున్నారు. ఐపీఎల్ ప్రధాన భాగస్వామి స్టార్ఇండియా తాజా పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ ప్రసార హక్కుల ఒప్పందానికి ఐదేండ్లకు రూ.16347 కోట్లు స్టార్ఇండియా చెల్లిస్తోంది. ప్రతి సీజన్కు రూ.3269.4 కోట్లు స్టార్ ఇండియా నుంచి బీసీసీఐ అందుకుంటోంది. ఐపీఎల్ ప్రధాన భాగస్వామిగా లీగ్ నిర్వహణపై నెలకొన్న తాజా పరిస్థితులపై ఇటీవల బీసీసీఐకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా స్టార్, డిస్నీ ఇండియా చైర్మన్, వాల్ట్డిస్నీ కంపెనీ (ఆసియా పసిపిక్) ప్రెసిడెంట్ ఉదరు శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సురక్షిత వాతావరణంలో మాత్రమే ఐపీఎల్ నిర్వహణ సాధ్యమని, లేని పరిస్థితుల్లో లీగ్ ఉండబోదని స్టార్ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు!. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ అడ్డాలో ఉదరు శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ' ఇటువంటి సమయంలో ప్రజలు తమకు ఇష్టమైన క్రికెట్ ఐపీఎల్ అనుభవం ఆస్వాదించటం ప్రధానం. అంతర్గతంగా మేము ఐపీఎల్2020 నిర్వహణ ప్రణాళికలు చర్చిస్తున్నాం. ఇదే సమయంలో సురక్షితం కాని వాతావరణంలో ఐపీఎల్ను మేము ఎట్టిపరిస్థితుల్లోను కోరుకోవటం లేదు. ప్రజల్లో చైనా కంపెనీల నిషేధంపై భావోద్వేగాలు నెలకొన్నాయి. క్రికెట్ సీజన్పై చైనా కంపెనీలు భారీగా ప్రకటనలు ఇస్తున్నాయి. ఇప్పుడు ప్రజలు వాటిని వద్దనుకుంటే.. మేము ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తాం' అని ఉదరు శంకర్ తెలిపారు. ఐపీఎల్ సమయంలో వీవో రూ.130 కోట్ల మేర స్టార్స్పోర్ట్స్కు ప్రకటనలు ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఇతర చైనా కంపెనీలు సుమారు రూ.500 కోట్ల వరకు ఐపీఎల్ సమయంలో ప్రకటనలకు కేటాయిస్తున్నాయి.
'రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో మేము చెప్పలేం. అసలు అంచనా వేయలేం. బీసీసీఐ అన్ని అవకాశాలను పరిశీస్తోంది. క్రికెట్ ఎప్పుడు పున ప్రారంభం అవుతుందనే విషయంపై మాకు స్పష్టత లేదు. ఐపీఎల్2020 నిర్వహించినా.. వేదిక ఎక్కడో చెప్పలేం. సురక్షిత వాతావరణం ఆధారంగా భారత్లో టోర్నీ నిర్వహణపై నిర్ణయం ఉంటుంది. ఐపీఎల్ షెడ్యూల్పై అధికారికంగా చర్చించాల్సి ఉంది. ప్రజల ప్రాణాలు రక్షించటం, కరోనా వైరస్ చైన్కు అడ్డుకట్ట వేయటం ఇప్పుడు మన అందరికీ ముఖ్యం'
- సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు