Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-దిగ్గజం వీడ్కోలుపై మైకల్ హస్సీ
న్యూఢిల్లీ : ఎం.ఎస్ ధోని భారత క్రికెట్ దిగ్గజం. ఆటగాడిగా, నాయకుడిగా దేశానికి ఎంతో చేశాడు. వీడ్కోలు నిర్ణయం ధోనికే వదిలేయటం గౌరవంగా ఉంటుందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకల్ హస్సీ అభిప్రాయపడ్డాడు. ఓ టాక్షోలో హస్సీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ' నేను భారత సెలక్టర్ను కాదు, కానీ ఎం.ఎస్ ధోనీని విస్మరిస్తారని అనుకోను. చాంపియన్లు, చాంపియన్ ఆటగాళ్లను ఎప్పుడూ తక్కువ చేయవద్దు. ఆటగాడిగా, నాయకుడిగా ఎం.ఎస్ ధోని దేశానికి ఎంతో సేవ చేశాడు. ఇప్పటికీ ధోని తనను తాను మెరుగైన స్థితిలో ఉంచుకుంటాడు. నాకు తెలిసి ఈ విరామం మహికి మేలు చేస్తుంది. ఈ సమయంలో తన ఆటను, ఆలోచనలపై ధోని ఆత్మవిమర్శ చేసుకోగలడు. అంతర్జాతీయ స్థాయికి అవసరమైన నైపుణ్యం సాధించేందుకు కచ్చితంగా సమయం పడుతుంది. కానీ ఈ నియమం స్వీయ ఆటపై పూర్తి అవగాహన లేని వారికి మాత్రమే వర్తిస్తుంది. తన ఆటపై ధోనికి గొప్ప అవగాహన ఉంది. నైపుణ్యాల పరంగా ధోనిపై ఎటువంటి బెంగ అక్కర్లేదు. ఇక్కడ ఒకే ఒక్క ప్రశ్న. నిజంగా ఎం.ఎస్ ధోని ఇంకా కొనసాగాలని అనుకుంటున్నాడా? లేదా అనేది తెలియాలి. కెరీర్ ఎప్పుడు, ఎలా, ఎక్కడ ముగించాలనే నిర్ణయాన్ని ధోనికే వదిలేయాలి' అని మైకల్ హస్సీ అన్నాడు.