Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మన కోచ్లకు ఇక అధిక వేతనాలు
-క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : క్రీడా మంత్రిత్వ శాఖ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ కోచ్లతో సమానంగా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు రాబడుతున్నా.. వేతనాల విషయంలో విధానపరమైన అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. విదేశీ కోచ్లు అధిక వేతనాలు అందుకుంటుండగా, భారత కోచ్లు మాత్రం తక్కువ వేతనాలతోనే సరిపెట్టుకుంటున్నారు. జాతీయ క్రీడా సమాఖ్యలు (ఎన్ఎస్ఎఫ్), భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సహా కోచ్లు చేసిన విన్నపానికి క్రీడా మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది. భారత కోచ్లకు ప్రస్తుతం కొనసాగుతున్న రూ.2 లక్షల వేతన పరిమితిని ఎత్తివేస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. విదేశీ కోచ్ల కాంట్రాక్టులను 2021 సెప్టెంబర్ 30 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్న క్రీడాశాఖ, అనంతరం భారత కోచ్లకు సైతం తీపికబురు అందించింది. క్రీడా శాఖ నిర్ణయం పట్ల క్రీడా సమాఖ్యలు, ఒలింపిక్ సంఘం, కోచ్లు హర్షం వ్యక్తం చేశారు. 'ఇటీవల కాలంలో చాలామంది భారత కోచ్లు గొప్ప ఫలితాలు రాబడుతున్నారు. వారి కఠోర శ్రమకు రివార్డు దక్కాలి. భారత్లో అత్యుత్తమ కోచింగ్ నైపుణ్యం ఉన్నవారు.. ఎలైట్ అథ్లెట్లకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావాలని ప్రభుత్వం కోరుకుంటుంది. అందుకే వేతనాలపై ఎటువంటి పరిమితి ఉండకూదని భావిస్తున్నాం' అని కిరణ్ రిజుజు ప్రకటనలో తెలిపారు. ' భారత ఒలింపిక్ సంఘం, బారత క్రీడా సమాఖ్యలు క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగిస్తున్నాయి. దేశవాళీ కోచ్ల వేతనాలపై పరిమితి తొలగించటం హర్షణీయం. ప్రపంచ చాంపియన్లను తయారు చేయటంలో వేతనాల పరిమితి మన కోచ్లను నిరుత్సాహపరుస్తోంది. ఈ నిర్ణయంతో స్పోర్ట్స్ కోచింగ్ను కెరీర్గా ఎంచుకునేందుకు చాలా మంది ముందుకు వస్తారు' అని ఐఓఏ కార్యదర్శి రాజీవ్ మెహతా పేర్కొన్నారు. భారత కోచ్ల కాంట్రాక్టులను సైతం నాలుగేండ్లకు పెంచారు. ఒలింపిక్ సర్కిల్ను దృష్టిలో ఉంచుకుని, కోచ్లను నాలుగేండ్ల కాలానికి నియమించే వెసులుబాటు కల్పించారు.