Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-త్వరలో నూతన టెండర్లకు బీసీసీఐ సిద్ధం
-కనీస ధర 31 శాతం తగ్గే అవకాశం
న్యూఢిల్లీ : జెర్సీ.. అభిమాన జట్టు ధరించే జెర్సీ కోసం ఔత్సాహిక అభిమానులు ఎంతగా ఆరాటపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్లో ప్రత్యేకించి భారత జట్టు జెర్సీలకు ఉన్న విలువ వేరు. మెన్ ఇన్ బ్లూ జెర్సీల కోసం అభిమానులు క్యూలు కట్టిన సందర్భాలు ఉన్నాయి. కోవిడ్-19 క్లిష్ట పరిస్థితుల్లో భారత క్రికెట్ జట్టు జెర్సీ విలువ భారీగా పడిపోనుంది!. ఈ మేరకు బీసీసీఐ, మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. భారత జట్టు జెర్సీ, కిట్ స్పాన్సర్గా ప్రముఖ క్రీడా ఉపకరణాల సంస్థ నైకీ నాలుగేండ్లకు రూ. 370 కోట్ల ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్తో ఆ ఒప్పందం ముగియనుంది. భారత్లో, విదేశాల్లో జరిగే ప్రతి మ్యాచ్కు నైకీ రూ. 87.34 లక్షలు చెల్లించింది. 2016లో బీసీసీఐ కిట్ స్పాన్సర్ ఒప్పందం అనంతరం నైకీ మార్కెట్లో దూకుడు ప్రదర్శించింది. దేశవ్యాప్తంగా సుమారు 350 స్టోర్లను తెరిచింది. కానీ 2019 వార్షిక నివేదికల ప్రకారం రూ.1413 కోట్ల అమ్మకాలతో పుమా మార్కెట్లో అగ్రగామిగా నిలిచింది. ఆడిడాస్ రెండో స్థానంలో ఉండగా.. నైకీ మూడో స్థానంలో ఉంది. నైకీ గణాంకాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవని సమాచారం. దీంతో భారత్లో స్టోర్ల సంఖ్యను సైతం 100కు కుదిస్తోంది. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ కిట్ స్పాన్సర్ ఒప్పందం నైకీపై పెను భారం మోపుతోంది. ఈ ఒప్పందాన్ని కొనసాగించేందుకు నైకీ విముఖత వ్యక్తం చేస్తూ, ఆ విషయాన్ని బీసీసీఐకి తెలియజేసినట్టు సమాచారం. నైకీ వైదొలిగటంతో బీసీసీఐ తాజాగా రెక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)తో మార్కెట్కు రానుందని సమాచారం. కిట్ స్పాన్సర్గా మ్యాచ్కు కనీస ధరను సుమారు 30 శాతం తగ్గించనుంది. దీంతో ఒక మ్యాచ్కు రూ. 61 లక్షలతో బీసీసీఐ ఆర్ఎఫ్పీ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామంతో ఆసక్తికర చర్చ మొదలైంది. భారత జట్టు జెర్సీ స్పాన్సర్షిప్ కంటే మ్యాచ్ రోజు మైదాన హక్కులే విలువైనవిగా నిలుస్తున్నాయి. స్వదేశంలో జరిగే మ్యాచులకు మైదాన హక్కుల కోసం డ్రీమ్11, హ్యుందారు మోటార్స్, అంబుజా సిమెంట్లు రూ.2.6 కోట్లు చెల్లిస్తున్నాయి. కేవలం డ్రీమ్11 మాత్రమే రూ.110 లక్షలు చెల్లిస్తోంది. ఇప్పుడు రూ.61 లక్షలతో ఇంటా, బయట జరిగే మ్యాచులకు జట్టు జెర్సీ, కిట్ స్పాన్సర్షిప్ హక్కులు దక్కనుండటం విశేషం.