Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-చీఫ్ కోచ్ పదవిపై వినోద్ రారు
న్యూఢిల్లీ : 2017లో భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ పదవి నుంచి క్రికెట్ జెంటిల్మెన్ అనిల్ కుంబ్లే వైదొలిగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లితో సంబంధాలు అతికించలేని స్థాయికి చేరుకున్నాయని ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ అనంతరం రాజీనామా లేఖలో పేర్కొన్నాడు. అనిల్ కుంబ్లే రాజీనామా చేసినా క్రికెట్ అభిమానులు కుంబ్లేనే కొనసాగించాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత చీఫ్ కోచ్గా తగిన వ్యక్తిగా మరో వ్యక్తి కనిపించాడు. అతడే దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్. అప్పటికే అండర్-19 జట్టు కోచ్గా పని చేస్తున్న రాహుల్ ద్రవిడ్ ఎందుకు చీఫ్ కోచ్ పదవిని కాదనుకున్నాడనే ప్రశ్న అభిమానులను తొలుస్తూనే ఉంది. పాలకుల కమిటీ మాజీ చైర్మన్ వినోద్ రారు ఈ అంశంపై మాట్లాడాడు. ' చీఫ్ కోచ్ రేసులో మా తొలి ప్రాధాన్యం రాహుల్ ద్రవిడ్. కానీ రాహుల్ వ్యక్తిగత కారణాల రీత్యా నిరాకరించాడు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి దగ్గర వారితో గడపాల్సిన అవసరం ఉంది. భారత జట్టుతో ప్రయాణాలతో ఆ పని చేయలేను. కచ్చితంగా నేను ఇంటికి అందుబాటులో ఉండాలని అనుకుంటున్నాను. నా కుటుంబానికి సమయం కేటాయించాలని భావిస్తున్నానని రాహుల్ చెప్పాడు. ద్రవిడ్ చెప్పిన కారణాలు సహేతుకం. గౌరవప్రదంగా చీఫ్ కోచ్ పదవి నిరాకరించాడు. అండర్-19 జట్టుతో కొన్ని ప్రణాళికలు అలాగా ఉండిపోవటంతో ఆ పదవిలో కొనసాగాడు. అనంతరం ఎన్సీఏ డైరెక్టర్గా రావటం సంతోషకరం' అని వినోద్ రారు తెలిపారు.