Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభం కాని సీసీఐ కేంద్రాలు
- గ్రామాల్లో దళారులు తిష ్ట
- అతివృష్టితో తగ్గిన పత్తి దిగుబడి
- క్వింటాల్ పత్తికి రూ.3600లే
- పెట్టుబడి కూడా దక్కని దుస్థితి
ఈయేడు పత్తి పంటంతా ఎప్పటిలాగే దళారుల పాలవుతోంది. ఒకవైపు అతివృష్టితో సరైన మార్కెట్ సదుపాయం లేక మరొకవైపు దిక్కుతోచని స్థితిలో పత్తి రైతులు అడ్డికి పావుశేరు దళారులకే నమ్ముకుంటున్నారు. ఈయేడు కురిసిన వర్షాలతో జిల్లాలో పలుచోట్ల పత్తి పంట నీళ్లపాలె ౖఅపారనష్టం వాటిల్లింది. నీట మునగగా మిగిలిన పత్తి దిగుబడులను అమ్ముకునేందుకు మార్కెట్ సదుపాయం లేక...గ్రామాల్లో తిష్ట వేసిన దళారులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. పత్తిని అమ్ముకునేందుకు సీసీఐ కేంద్రాలు తెరుచుకోకపోవడంతో దళారులకు కలిసోచ్చింది. దళారుల కోసమే అధికారుల నిర్ణయాలు ఉంటాయని రైతులు వాపోతున్నారు. ఎంత అలస్యం జరిగితే అంతగా దళారుల వ్యవస్థ గ్రామాల్లో పెరిగిపోయి లక్షలు పోగేసుకుంటున్నారు.
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా పత్తి సాగు విస్తీర్ణం గతేడాది కంటే 1,181 వేల ఎకరాలకు పెరిగింది. జిల్లా వ్యవసాయ అధికారిణి కె అనురాధ తెలిపిన వివరాల ప్రకారం గతేడు 1.74 లక్షల ఎకరాలు సాగు చేయగా ఈ యేడు 1,75,181 ఎకరాలలో సాగు చేశారు. వర్షాలకు చేలలో నీరు రోజుల తరబడి నిలిచిపోవడంతో పత్తి ఎదుగుదల లోపించింది. ఈ కారణం చేత పత్తి దిగుబడులు ఆశించిన స్థాయిలో వచ్చే పరిస్థితి లేదు.
తెరుచుకోని సీసీఐ కేంద్రాలు
యాదాద్రిభువనగిరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రైతులు పత్తిని సేకరించి పెట్టుకున్నారు. అక్టోబర్ నెలలో అధికంగా పత్తి విక్రయ కేంద్రాలకు రైతులు పత్తిని తీసుకొస్తుంటారు. అందుకు సంబంధించి అధికారులు ముందస్తుగానే ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కానీ ఏటా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించడం. సీసీఐ నిర్వహకులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం షరా మాములే. జిల్లాలో గతేడు ఏర్పాటు చేసిన 14 కేంద్రాల్లో సీసీఐ పత్తి కొనుగోళ్లు చేపట్టేందుకు ఈ యేడు కూడా కసరత్తు జరుగుతుంది. కాగా గతేడాది కూడా ఆశించిన స్థాయిలో సీసీఐ కేంద్రాలు తెరుచుకోకపోవడంతో పత్తి రైతుల కష్టం దళారుల పాలే అయ్యింది.
నిర్లక్ష్యంలో అధికార యంత్రాంగం
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ఆలస్యంగా మేలుకోవడం వల్ల రైతాంగానికి తీరని నష్టం కలుగనుంది. వర్షాలకు పత్తి తడవగా.. మిగిలిన పత్తిని రైతులు త్వరగా సేకరించారు. గతంలోనూ ఈ సమయానికే పత్తి సేకరించేవారు. ఈ ఏడాది విపరీతమైన వర్షాల కారణంగా పత్తి తడవడం.. ఎండలు సరిగా లేక పంట చేలకు నిమ్ము (తడి) ఉండడంతో పత్తి పూలు పూర్తిస్థాయిలో వికసించలేదు. దీంతో నాణ్యమైన పత్తి దిగుబడులను రైతులు సాధించలేకపోయారు. పత్తి తడవడం, సరిగా పత్తి విచ్చుకోని కారణంగా రైతులు ముందస్తుగా అమ్మకాలు చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న దళారులు రైతుల నుంచి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. పత్తి చెడిపోయే స్థితిలో ఉండడం వల్ల రైతాంగం తక్కువ ధర వచ్చినా అమ్మేసుకుంటున్నారు.
క్వింటాల్కు రూ.3600లకే
ఇటీవల వర్షంలో తడిసిన పత్తి నేపథ్యంలో పత్తిని అగ్వకు అమ్ముకోవడానికి రైతులు సిద్దపడుతున్నారు. సీసీఐ కేంద్రాలు ఇంకా అందుబాటులోకి రాని కారణంగా పత్తి రైతులకు దళారులే దిక్కయ్యారు. తేమ ఉందని లేక పత్తి కాయలుగా ఉందనే కారణంగా దళారులు తక్కువ ధర పలకడానికి కుంటి సాకులు చూపుతూ రైతులను మోసపుచ్చుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో క్వింటాల్ పత్తి రూ.3600 నుంచి రూ.3800కే వీరు కొనుగోలు చేస్తున్నారు. గతేడు 70,000 మెట్రిక్ టన్నుల పత్తి సేకరించగా ఈయేడు 1.44 మెట్రిక్ టన్నుల పత్తి సేకరణ లక్ష్యంగా ఉంది. కాగా ప్రభుత్వం గతేడు క్వింటాళుకు ధర రూ. 5550లు ఇవ్వగా ఈయేడు రూ.5825గా ధర నిర్ణయించింది.
పత్తి ఇలా ఉండాలి...
జిల్లా మార్కెటింగ్ అధికారి అబ్దుల్ హలీం తెలిపిన వివరాల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు, సీసీఐ నిర్దేశించిన నిబంధనల మేరకు పత్తిని తరలించే ముందు ఆయా మండల వ్యవసాయ అధికారి నుంచి టోకన్ పొందాల్సి ఉంటుంది. ఈ పత్తిని కూడా బస్తాల్లో కాకుండా విడిగా తీసుకురావాలి. వాహనంలో ఒక రైతు మాత్రమే నిర్ధేశించిన ఆయా కేంద్రాలకు పత్తిని తరలించాల్సి ఉంటుంది. సామూహికంగా రైతులు పత్తిని తరలిస్తే సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పత్తిని ఆరబెట్టి 8 నుంచి 12 శాతం తేమతో తీసుకురావాల్సి ఉంటుంది. అలా ఉన్న పత్తికి మాత్రమే నాణ్యత ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వం నిర్ణయించిన ధర పలుకుతుంది. ఈ పరిస్థితి గమనించిన దళారులు గ్రామాల్లో పత్తికి దళారులు రూ.3800కి మించి ఇవ్వడం లేదు. దీంతో పత్తి రైతు అగ్వకు అమ్ముకోవడం చేత తీరని నష్టం వాటిల్లనుంది. వర్షాలతోనే నష్టం రాగా ఈ మధ్యదళారులతో పెట్టుబడికి కూడా దక్కని దుస్థితి నెలకొంది. ఇప్పటికైన అధికారులు యుద్దప్రాతిపధికన చర్యలు చేపట్టి అందుబాటులోకి సీసీఐ కేంద్రాలకు తెరవాలని జిల్లా రైతులు కోరుతున్నారు.