Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత బంధు తెలుసా....
- డబ్బులతో మీరు ఏం చేస్తారు..
- వాసాలమర్రి నుండే దళిత బంధు ప్రారంభం
- వాసాలమర్రి పర్యటనలో దళితులతో సీఎం కేసీఆర్
నవతెలంగాణ-యాదాద్రి/తుర్కపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తత గ్రామం వాసాలమర్రి దళిత వాడల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బుధవారం సుమారు 3 గంటల పాటు పర్యటించారు. వాసాలమర్రి నుండే దళిత బందును ప్రకటిస్తున్నట్టు సీఎం చెప్పారు. దళిత కుటుంబాల మహిళలు ముఖ్యమంత్రి కేసీఆర్కు బొట్టు పెట్టి స్వాగతం పలికారు. దళిత వాడల్లోని సుమారు 60 ఇండ్లలోకి వెళ్లి కాలినడకన పర్యటిస్తూ ప్రతి ఒక్కర్నీ యోగక్షేమాలను కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇండ్లు లేని వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దళిత బంధు పథకం గురించి తెలుసా అని అడిగి తెలుసుకున్నారు. ఇంటికి పది లక్షలు వస్తే ఏం చేస్తారు..? దళిత బంధు డబ్బలు వస్తే ఎం చేద్దాం అని అనుకున్నారు అని సీఎం ప్రశ్నించారు..? కొంత మంది మిల్క్ డెయిరీఫాం పెట్టుకుంటామని, కొందరు ట్రాక్టర్లు కొంటామని, మరికొందరు వ్యాపారాలు చేసుకుంటామని సీఎంకు తెలిపారు. మీకు పింఛన్ వస్తున్నదా.. అని ఆరా తీసారు. పింఛన్ రానివాళ్ళు ఎవరైనా వుంటే వారికి వెంటనే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని ఆదేశించారు. దళిత వాడల్లో మట్టి గోడల మీద కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను చూసి ముఖ్యమంత్రి చలించిపోయారు. కొన్ని ఇండ్లలో ఇంటిలోపలికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి దళిత బంధు డబ్బులు వస్తే వాటిని ఉపయోగించుకునే మంచి ఆలోచనలు చేయాలని సీఎం వారికి సూచించారు. ఇతర కాలనీల్లో కూడా సీఎం పర్యటించారు. ప్రతి ఒక్కరికీ ఇండ్లు మంజూరు చేస్తామని దిగులు పడవద్దని భరోసానిచ్చారు. నిరుపేద మహిళలు వద్ధులు చెప్పిన సమస్యలను ముఖ్యమంత్రి జాగ్రత్తగా విని అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తమ ఇండ్లు రోడ్డుకు దిగువన ఉండటంతో వర్షం వచ్చినప్పుడు మొత్తం నీటితో నిండిపోతున్నాయని పలువురు సీఎం దష్టికి తీసుకొచ్చారు. పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నందున కాలనీల రోడ్లు, డ్రైనేజీలు ఒక ప్లాన్ ప్రకారం ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం కలెక్టర్ను ఆదేశించారు. తమకు పెన్షన్ రావడం లేదని విన్నవించిన సుమారు 20 మంది బీడీ మహిళా కార్మికులకు రెండు రోజుల్లో వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఒక మహిళ బీడీ కార్మికుల కష్టాల గురించి చెప్పబోతుండగా.. ''నేను బీడీలు చేసేటోళ్ళ ఇంటిలో ఉండే చదువుకున్నా వాళ్ళ కష్టాలు నాకు తెలుసమ్మా'' అని సీఎం వాఖ్యానించారు.
ఒక దళిత కుటుంబం ఇంటి దగ్గర ఆగినప్పుడు వాళ్ళు తమ కూతురుకి ఏదైనా సహాయం చేయాలని సీఎం కు విన్నవించగా అల్లుడు డ్రైవర్ గా పని చేస్తాడు అని చెప్పడంతో దళితబందు కింద అతనికి ట్రాక్టర్ ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఒక ఇంటిలోపలికి వెళ్లిన సమయంలో పక్కనే వున్న ప్రజా కవి , ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నను చూపిస్తూ ఈయన మీకు తెలుసా.. దళిత నాయకుడు '' పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల'' అని పాట రాసింది ఈయనే అని సీఎం వారికి పరిచయం చేశారు.ప్రతి ఒక్కర్నీ పింఛన్ ్ వస్తుందా? 24 గంటల కరెంట్ వస్తుందా? సాగు నీళ్ళు వస్తున్నాయా..? రైతు బందు డబ్బులు వస్తున్నయా ? ఏమేమ్ పంటలు సాగు చేస్తున్నారు అని సీఎం ఆయా కుటుంబాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కొందరు వద్ధుల దగ్గర వెళ్లి పింఛన్లో కొంత ఏమైనా పక్కకు పోదుపు చేసుకుంటున్నరా అని అని ఆరా తీసారు. గ్రామంలో సుమారు వంద ఎకరాలకు పైగావున్న ప్రభుత్వ భూమిని నిరుపేద దళితులకు, ఇతరులకు పట్టాలు ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సీఎం మద్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు గ్రామ కాలనీల్లో సుమారు నాలుగు కిలోమీటర్ల వరకు కాలినడకన పర్యటించారు. ముఖ్యమంత్రి వెంట శాసన మండలి మాజీ చైర్మెన్ గుత్తా సుఖెందర్ రెడ్డి , ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే గొంగిడి సునితా మహెందర్ రెడ్డి , ఎమ్మెల్సీ గోరేటీ వెంకన్న, కలెక్టర్ పమేలా సత్పతి, రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్, సీఎం ఓస్డీ దేశపతి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, కవులు , రచయితలు మిట్టపల్లి సురెందర్, సాయిచంద్ , అంబటి వెంకన్న అభినరు శ్రీనివాస్ , కోదారి శ్రీనివాస్, బూర సతీష్, మానుకోట ప్రసాద్, బాబు, శివ, బిక్షపతి, తదితరులు ఉన్నారు.