Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఐజీ రంగనాథ్
నవతెలంగాణ-నల్లగొండ
జిల్లాలో మెడికల్ షాపులు, ఏజెన్సీల నిర్వాహకులు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయిస్తే కఠినచర్యలతో పాటు పీడీయాక్టుల నమోదుకు వెనుకాడబోమని డీఐజీ ఏవీ.రంగనాధ్ హెచ్చరించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని అన్ని మెడికల్ షాపులు, కెమిస్ట్,డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత డ్రగ్స్ బారిన పడుతున్న పరిస్థితులలో ముఖ్యమంత్రి నిర్ధాక్షిణ్యంగా, కఠినంగా వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారన్నారు. అందుకు అనుగుణంగా గంజాయిపై రెండు నెలలుగా వరుసగా చేస్తున్న దాడుల క్రమంలో జిల్లాను గంజాయిరహిత జిల్లాగా మార్చడం లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు.తాము తీసుకుంటున్న చర్యల కారణంగా జిల్లాలో గంజాయి రవాణా, విక్రయించాలంటే భయపడుతున్న పరిస్థితులు నెలకొన్న క్రమంలో సింథటిక్ డ్రగ్స్ వైపుకు యువత ఆకర్షితులవుతున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. అందువల్ల మెడికల్ షాపుల నిర్వాహకులు తరచుగా మత్తు మందుల కోసం వచ్చే వారి సమాచారం పోలీసులకు ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, అదే సమయంలో మెడికల్ షాపుల నిర్వాహకులకు రక్షణ కల్పించే విషయంలోనూ అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు కలిగించే ముందులు ఎలాంటి పరిస్థితుల్లోనూ విక్రయిం చవద్దని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరు విక్రయించినా కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.నిబంధనలు ఉల్లంఘించినా, ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు కలిగించే మందులు విక్రయించినా,మెడికల్ షాపుల లైసెన్సులు రద్దు చేయడం, పీడీ యాక్టులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నర్మద, డీఎస్పీలు వెంకటేశ్వర్రెడ్డి, ఆనంద్రెడ్డి, వెంకటేశ్వర్రావు, రమణారెడ్డి, డ్రగ్ కంట్రోల్ ఏడీ శ్రీనివాస్, డ్రగ్ ఇన్స్స్పెక్టర్ వరప్రసాద్, కెమిస్ట్ అసోసియేషన్ నాయకులు సిరిప్రోలు వెంకటపతి, జి.వెంకటేశ్వర్లు, సీఐలు బాలగోపాల్, చంద్రశేఖర్రెడ్డి, వెంకటీశ్వర్లు, మధు, సురేష్కుమార్, రాఘవులు సత్యనారాయణ, నాగరాజు, నిగిడాల సురేష్, శంకర్రెడ్డి, ఎస్సైలు రాజశేఖర్రెడ్డి, నర్సింహులు, నాగరాజు, యాదయ్య పాల్గొన్నారు.