Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్నల్ సంతోష్బాబు జీవితం యువతకు స్ఫూర్తిదాయకం
సూర్యాపేటలో ఆర్మీ రిక్రూట్మెంట్ ఫ్రీర్యాలీని ప్రారంభించిన మంత్రి జగదీష్రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
దేశ రక్షణలో యువతరం భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి పిలుపునిచ్చారు.అందుకు కల్నల్ సంతోష్బాబును స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని ఆయన యువతీ,యువకులకు విజ్ఞప్తి చేశారు.కల్నల్ సంతోష్ బాబుకు స్ఫూర్తి ఆయన తల్లితండ్రులేనని, నేటి యువతీ,యువకులకు మాత్రం సంతోష్ బాబు స్ఫూర్తి అని ఆయన చెప్పుకొచ్చారు.అర్మీలో సిపాయి నుండి ఉన్నతాధికారి ఎంపికలకు గాను సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని ఎస్వీ కళాశాల క్రీడా మైదానంలో ది సోల్జర్ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన సభా కార్యక్రమాన్ని దివంగత కల్నల్ సంతోష్బాబు చిత్రపటం ముందు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.అనంతరం జరిగిన సభలో మంత్రి ప్రసంగిస్తూ జిల్లాగా రూపాంతరం చెందిన సూర్యాపేట జిల్లా కేంద్రంలో మొట్టమొదటి సారిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి వచ్చిన స్పందన అనూహ్యమైనదని ఆయన వర్ణించారు. పట్టణానికి చెందిన దివంగత సంతోష్ బాబు త్యాగంతో ప్రపంచ చిత్రపటంలో సూర్యాపేటకు చోటు దక్కిందన్నారు. అటువంటి సంతోష్ బాబును స్ఫూర్తిదాయకంగా పెట్టుకుని ఈనాటి ర్యాలీకి తరలి వచ్చిన వారందరినీ ఆయన అభినందించారు.ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్న రోజునే యువత పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుంటుందని ఆయన చెప్పారు. అందుకు భిన్నంగా క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడుతూన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమాజం,దేశం మనదే అని గలిగినప్పుడు మాత్రమే భవిష్యత్ ఉంటుందని ఆయన చెప్పారు.ఉద్యోగాల ఎంపిక కోసం ది సోల్జర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు.ఈ ర్యాలీలో ఎంపికయి రెండు నెలల పాటు శిక్షణ పొందనున్న వారికి శిక్షణా కాలంలో భోజనాది సౌకర్యాలు సొంతంగా భరించనున్నట్టు ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన యువతీ, యువకుల హర్షధ్వనాల నడుమ మంత్రి ప్రకటించారు.ఈ కార్యక్రమంలోమున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణమ్మ, కలెక్టర్ వినరుకష్ణారెడ్డి,ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్, ది సోల్జర్ యూత్ ఫౌండేషన్ ఫౌండర్ కల్నల్ ఎస్.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
అందరికీ అల్పాహారం అందజేత
ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలో మొట్ట మొదటి సారిగా నిర్వహించిన ఆర్మీ ప్రీ రిక్రూట్ మెంట్ ర్యాలీ లో పాల్గొన్న వారందరికీ అల్పాహారం అందించాలని మంత్రి జగదీష్ రెడ్డి తన వ్యక్తిగత అనుచరులకు సూచించారు. మొట్ట మొదటి సారిగా జరుగుతున్న ఈ ర్యాలీలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భారీ ఎత్తున యువతీ యువకులు హాజరు కావడం నిర్వాహకులు ముందుగా ఉహించలేక పోయారు.ఆర్మీ ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ జిల్లా కేంద్రంగా ఉండాలని పట్టుబట్టి సాధించిన మంత్రి జగదీష్ రెడ్డి సైతం కార్యక్రమానికి వచ్చిన స్పందనతో సంతోషం వ్యక్తం చేశారు.అటువంటి తరుణంలో ఈ ఉదయం నిర్వహించిన ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన యువతీ యువకులకు అల్పాహారం అందించాలంటూ ఆయన అనుచరులకు సూచించడంతో అప్పటికప్పుడు అందజేశారు.రెండు నెలల శిక్షణా కాలంలో భోజనాది సౌకర్యాలు కల్పించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో పాటు ఈ ఉదయం 7 గంటలకు జిల్లా కేంద్రంలో జరిగిన ఆర్మీ ఉచిత రిక్రూట్ మెంట్ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అల్పాహారం అందించిన మంత్రికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలిపారు.